పండుగలా రైతు దినోత్సవం

8 Jul, 2021 03:03 IST|Sakshi

రాష్ట్ర స్థాయి మొదలు ఆర్‌బీకే స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు

అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల్లో నేడు, రేపు సీఎం జగన్‌ పర్యటన

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం

ఇడుపులపాయలో మహానేత వైఎస్సార్‌కు నివాళి అర్పించనున్న ముఖ్యమంత్రి

సాక్షి, అమరావతి: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా గురువారం రాష్ట్ర వ్యాప్తంగా పండుగలా రైతు దినోత్సవం నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర స్థాయి మొదలు ఆర్‌బీకే స్థాయి వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురు, శుక్రవారాల్లో రెండు రోజుల పాటు వైఎస్సార్, అనంతపురం జిల్లాల్లో పర్యటించి రైతు సంక్షేమాన్ని కాంక్షిస్తూ పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. పులివెందుల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనల అనంతరం ఇడుపులపాయలో వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. రెండో రోజు శుక్రవారం బద్వేలు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొని, ఆ తర్వాత కడప నగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 

ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా.. 
– రూ.413.76 కోట్లతో నిర్మించిన 1,898 రైతు భరోసా కేంద్రాలు
– రూ.79.50 కోట్లతో ఏర్పాటైన 100 వైఎస్సార్‌ ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు, ఆక్వా ల్యాబ్‌లు, సీఏడీడీఎల్‌లు
– ఆర్‌బీకేలకు అనుసంధానంగా రూ.96.64 కోట్లతో 611 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాల (సీహెచ్‌సీలు)తో పాటు పాడిరైతుల కోసం ప్రత్యేకంగా 34 సీహెచ్‌సీల ప్రారంభోత్సవం
– రూ.31.74 కోట్లతో నిర్మించిన 53 కొత్త వెటర్నరీ ఆసుపత్రుల ప్రారంభం
– రూ.400.30 కోట్ల వ్యయంతో 1,262 గోదాముల నిర్మాణానికి శంకుస్థాపనలు
– రూ.200 కోట్లతో పోస్ట్‌ హార్వెస్టింగ్‌ వసతుల కల్పన
– రూ.212 కోట్లతో మార్కెట్‌ యార్డ్‌లలోనూ నాడు– నేడు పనులు
– రూ.7.53 కోట్లతో విజయవాడలో పాడిరైతుల కోసం ప్రత్యేకంగా కాల్‌ సెంటర్‌
– రూ.45 కోట్లతో 45 కొత్త రైతు బజార్లకు శంకుస్థాపనలు, 6 రైతు బజార్ల ప్రారంభోత్సవం
– రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో నగదు ప్రోత్సాహకాలతో రైతులకు సత్కారం

9వ తేదీ సీఎం పర్యటన ఇలా..
– 10.40 గంటలకు బద్వేలు చేరుకుంటారు. 
– 11.10 –12.45 వరకు బద్వేలు నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడతారు. 
– మధ్యాహ్నం 1.45 గంటలకు కడప చేరుకుంటారు. 
– 2.05 గంటలకు సీపీ బ్రౌన్‌ గ్రంథాలయం చేరుకుని సీపీ బ్రౌన్‌ విగ్రహాన్ని, వివిధ అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరిస్తారు. 
– 2.40 – 3.25 గంటలకు కడప మహావీర్‌ సర్కిల్లో వివిధ అభివృద్ధి పనులు ప్రారంభిస్తారు.
– 3.50– 4.20 గంటలకు వైఎస్‌ రాజారెడ్డి క్రికెట్‌ స్టేడియంలో అభివృద్ధి పనులకు శిలాఫలకం ఆవిష్కరిస్తారు.
– సాయంత్రం 5 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం బయలుదేరతారు.   

నేడు సీఎం పర్యటన ఇలా..
► ఉదయం 9.00 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి బయలుదేరతారు.
► 10.40 గంటలకు అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం 74 –ఉడేగోళం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ యూనిట్స్‌ పరిశీలిస్తారు.
► 11.20 గంటలకు రాయదుర్గం మార్కెట్‌ యార్డులో వైఎస్సార్‌ ఇంటిగ్రెటెడ్‌ అగ్రి ల్యాబ్‌ ప్రారంభించి, లబ్ధిదారులతో మాట్లాడతారు.
► 11.45 – 1.10 గంటలకు విద్యార్థి పాఠశాలలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తారు.
►  2.10 గంటలకు వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని భాకరాపురం చేరుకుంటారు.
► 2.50 – 3.20 గంటలకు పులివెందులలోని ఇంటిగ్రెటెడ్‌ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ గ్రౌండ్‌లో వివిధ అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేస్తారు. శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. 
► 3.55 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌ చేరుకుంటారు. 
► 4.10 – 4.55 గంటలకు వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. రాత్రికి అక్కడి గెస్ట్‌హౌస్‌లో బస చేస్తారు.  

మరిన్ని వార్తలు