CM Jagan: నరసాపురం పర్యటనకు సీఎం జగన్‌

15 Nov, 2022 18:08 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: నరసాపురంలో ఈనెల 18న జరుగనున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లను వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. సోమవారం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మున్సిపల్‌ కౌన్సిల్‌ హాల్‌లో అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఆక్వా యూనివర్సిటీ, బియ్యపుతిప్ప ఫిషింగ్‌హార్బర్, కాళీపట్నం రెగ్యులేటర్ల నిర్మాణం, వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్, సబ్‌స్టేషన్‌ నిర్మాణం వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన, బస్టాండ్, 100 పడకల ఆస్పత్రి ప్రారంభోత్సాలు చేస్తారన్నారు. ఈ మేరకు ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు.

పట్టణంలోని 25వ వార్డు వీవర్స్‌కాలనీలో బహిరంగసభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను వెంటనే పూర్తిచేయా లని ఆదేశించారు. చినమామిడిపల్లి లేఅవుట్‌ వద్ద హెలీప్యాడ్‌ పనులు పూర్తి చేయాలన్నారు. ముఖ్యమంత్రి రోడ్డు మార్గం మీదుగా వెళ్లే ప్రాంతాలను సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో ఉన్న సిబ్బందికి పాస్‌లు జారీ చేయాలని, అవసరమైన చోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని సూచించారు. అనంతరం ఆమె సీఎం పర్యటించనున్న ప్రాంతాలు బస్టాండ్, ప్రభుత్వాస్పత్రి, సభావేదిక స్థలాన్ని పరిశీలించారు. జాయింట్‌ కలెక్టర్‌ మురళి, నరసాపురం సబ్‌కలెక్టర్‌ ఎం.సూర్యతేజ ఆమె వెంట ఉన్నారు.  

చదవండి: (CM Jagan: రేపు హైదరాబాద్‌కు సీఎం జగన్‌)

92 అర్జీల స్వీకరణ : నరసాపురం మున్సిపల్‌ కార్యా లయంలో కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 92 మంది అర్జీలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జీలను తక్షణం పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.  ఫిర్యాదుల పరిష్కార అంశానికి అధిక ప్రాధాన్యమివ్వాలని, స్పందన దరఖాస్తుల పరిష్కారంపై ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని సూచించారు. వృద్ధుల వద్దకు నేరుగా వెళ్లి కలెక్టర్‌ వినతులు స్వీకరించారు.   

చదవండి: (విశాఖ నార్త్ నియోజకవర్గ పార్టీ శ్రేణులతో సీఎం జగన్‌ భేటీ)

మరిన్ని వార్తలు