మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కొలమానం: సీఎం జగన్‌

7 Mar, 2023 20:43 IST|Sakshi

సాక్షి, అమరావతి: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మానవాళిలో సగభాగం మాత్రమే కాక, అభివృద్ధిలోనూ అంతకు మించిన పాత్రను మహిళలు పోషిస్తున్నారని సీఎం కొనియాడారు.

‘‘మహిళల అభ్యున్నతే ఏ సమాజం ప్రగతికైనా కీలకమైన కొలమానం. 2019లో అధికారం చేపట్టిన నాటి నుంచి మన ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య, ఉద్యోగ సాధికారతలపై దేశంలోని మరే ప్రభుత్వమూ పెట్టనంతగా దృష్టి పెట్టింది’’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

‘‘జగనన్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత, 30 లక్షల ఇళ్ల పట్టాలు-22 లక్షల ఇళ్ల నిర్మాణం, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ వంటి పథకాలతో గర్భస్త శిశువు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ చూపిస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే. వారి రక్షణ, భద్రతను దృష్టిలో ఉంచుకుని దిశ యాప్, దిశ పోలీస్‌ స్టేషన్లతో ఆడబిడ్డల రక్షణలో అందరికన్నా మిన్నగా అడుగులు ముందుకు వేశాం’’ అని సీఎం అన్నారు.
చదవండి: ఉద్యోగులకు ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

‘‘21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే అవతరించేలా నిర్ణయాలు తీసుకున్నాం. రాజకీయ పదవుల్లో కూడా చట్టాలు చేసి మరీ సగభాగం ఇచ్చింది మన ప్రభుత్వమే. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క కుటుంబం, మొత్తం సమాజం ఆడబిడ్డల పట్ల మరింత గౌరవం, శ్రద్ధ కనబర్చేలా నిర్ణయాలు తీసుకోవాలి’’ అని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు