స్మార్ట్‌ వాచ్‌తో ఆలయంలోకి సీఎం రమేష్‌

28 Dec, 2020 13:37 IST|Sakshi

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్

సాక్షి, తిరుమల: బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో చేతికి స్మార్ట్‌ వాచ్‌తో లోనికి ప్రవేశించడం వివాదాస్పదంగా మారింది. ఇక శ్రీవారిని దర్శించుకున్న సీఎం రమేష్‌కు వేద పండితులు ఆశీర్వచనాలు అందించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. యూకే నుంచి మన దేశానికి వచ్చిన కొందరికి కరోనా పాజిటివ్‌ రాగా, వారిలో కొత్త రకం వైరస్‌ లక్షణాలు ఉన్నాయన్నారు. ఈ క్రమంలో ప్రజలను, రాష్ట్రాన్ని కాపాడమని స్వామి వారిని ప్రార్థించినట్లు తెలిపారు. బీజేపీ పార్టీకి దేశమంతా మంచి ఫలితాలు వచ్చాయన్నారు. తిరుపతిలో జనసేన, బీజేపీ కలిసి పని చేస్తాయని స్పష్టం చేశారు. (చదవండి: శ్రీవారి సేవలో రాష్ట్రపతి కోవింద్‌)

కాగా సీఎం రమేష్‌ చేతికి ఆపిల్‌ కంపెనీకి చెందిన స్మార్ట్‌ వాచ్‌తో ఆలయంలోకి ప్రవేశించారు. టీటీడీ నిబంధనల ప్రకారం ఎలక్ట్రానిక్ వస్తువులు ఆలయంలోకి తీసుకువెళ్లరాదు. పైగా దేవాదాయశాఖ చట్టం ప్రకారం ఇది నేరం కూడా! అయితే సెక్యూరిటీ సిబ్బంది ఆయన స్మార్ట్‌ వాచ్‌తో వెళ్లడాన్ని పెద్దగా గమనించలేదు. అన్నీ తెలిసి కూడా సీఎం రమేష్‌ టీటీడీ నిబంధనలను అతిక్రమించడంపై భక్తులు మండిపడుతున్నారు. (చదవండి: సీఎం రమేశ్‌కు కరోనా పాజిటివ్‌)

మరిన్ని వార్తలు