టీడీపీ నేతకు అండగా నిలిచిన సీఎం రిలీఫ్‌ ఫండ్‌

6 May, 2021 05:22 IST|Sakshi
ఎమ్మెల్సీ క్యాంపు ఆఫీసులో టీడీపీ నేత తిమ్మారెడ్డి కుటుంబానికి చెక్కు అందిస్తున్న వైఎస్సార్‌సీపీ నేత బాబురెడ్డి

హిందూపురం: సంక్షేమ పథకాల అమలులో, కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలో కులం, మతం, ప్రాంతం, పార్టీలు చూడమని చెప్పిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ లబ్ధి జరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అనారోగ్యంతో కష్టాల్లో ఉన్న ఓ టీడీపీ నేతను ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆదుకున్నారు. అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడు తిమ్మారెడ్డి కొంతకాలంగా పక్షవాతానికి గురై.. అనారోగ్యంతో బాధపడుతున్నారు. వైద్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్‌ ఇటీవల తిమ్మారెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అప్పుడే కొంత ఆర్థిక సాయం చేసిన ఇక్బాల్‌.. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం తిమ్మారెడ్డి కుటుంబ సభ్యుల ద్వారా సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేయించారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం తిమ్మారెడ్డికి రూ.2.70 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తానికి సంబంధించిన చెక్కును బుధవారం ఎమ్మెల్సీ కార్యాలయంలో తిమ్మారెడ్డి కుమారుడు వెంకటేష్, కుమార్తె తేజస్విని అందుకున్నారు. అలాగే నియోజకవర్గానికి చెందిన 36 మందికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరవ్వగా.. వారందరికీ చెక్కులు పంపిణీ చేశారు.   

మరిన్ని వార్తలు