ఢిల్లీ వెళ్లనున్న సీఎం వైఎస్‌ జగన్‌

4 Dec, 2022 21:53 IST|Sakshi

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. జీ-20 అఖిలపక్ష సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.  కాగా, భారతదేశం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న జీ20 దేశాల సదస్సును విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది.

డిసెంబర్‌ 5న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సాయంత్రం 5 గంటలకు జరిగే ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ఇటీవల ఆహ్వానం అందింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది.

ప్రపంచంలో ఆర్థికంగా బలంగా ఉన్న గ్రూప్‌ ఆఫ్‌ ట్వంటీ (జీ 20) దేశాలకు 2022 డిసెంబర్‌ 1 నుంచి 2023 నవంబర్‌ 30 వరకు భారత్‌ నేతృత్వం వహించనుంది. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా 32 రంగాలకు సంబంధించి వివిధ నగరాల్లో 200కు పైగా సమావేశాలు నిర్వహించనున్నారు. భారతదేశం నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశాలను విజయవంతం చేయడం ద్వారా దేశ సత్తాను ప్రపంచానికి తెలియచేసే విధంగా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయనున్నారు.

మరిన్ని వార్తలు