Newlyweds: నూతన దంపతులను ఆశీర్వదించిన సీఎం జగన్‌

23 Apr, 2022 08:27 IST|Sakshi

ఒంగోలు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఒంగోలు పర్యటనలో భాగంగా నూతన దంపతులను ఆశీర్వదించారు. మధ్యాహ్నం 1.20 గంటలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం సభ ముగిసిన అనంతరం సీఎం నేరుగా స్థానిక బందరు రోడ్డులోని రవిశంకర్‌ గ్రూప్స్‌ చైర్మన్‌ కంది రవిశంకర్‌ నివాసానికి చేరుకున్నారు. రవిశంకర్, ప్రియదర్శిని, వారి కుమారుడు సాయినాథ్‌లు సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. నూతన దంపతులు కంది విష్ణుమోహన్, స్నేహలను సీఎం ఆశీర్వదించారు. రవిశంకర్‌ కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. స్నేహ తల్లిదండ్రులైన బొత్స లక్ష్మణ్‌రావు, కన్నమ్మదేవిలను, మంత్రి బొత్స సత్యన్నారాయణను పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

కార్యక్రమంలో ప్రకాశం, నెల్లూరు, బాపట్ల జిల్లాల రీజనల్‌ కో ఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ, మున్సిపల్‌ శాఖామంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్సీలు తూమాటి మాధవరావు, పోతుల సునీత, శాసనమండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, మద్దిశెట్టి వేణుగోపాల్, అన్నా వెంకట రాంబాబు, బుర్రా మధుసూదన్‌ యాదవ్, కె.నాగార్జునరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబూరావు, బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, బాచిన చెంచుగరటయ్య, శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య, బాలినేని ప్రణీత్‌రెడ్డి, నగర మేయర్‌ గంగాడ సుజాత, ప్రముఖ వ్యాపార వేత్త శిద్దా హనుమంతరావు తదితరులు పాల్గొని నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు.

అక్కడ నుంచి బయల్దేరి 1.53 గంటలకు హెలిపాడ్‌కు చేరుకున్నారు. 1.59 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఒంగోలు నుంచి తాడేపల్లికి హెలికాప్టర్‌లో బయల్దేరి వెళ్లారు.   

చదవండి: (Jeevitha Rajasekhar: సినీ నటి జీవితకు అరెస్ట్‌ వారెంట్‌)

మరిన్ని వార్తలు