ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం

4 Aug, 2020 04:13 IST|Sakshi
ఈ–రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

రాష్ట్ర చరిత్రలో వారికి ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వం లేదు 

మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్‌కు శ్రీకారం 

వేధింపులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కలిగిస్తారు 

సైబర్‌ నేరాలు, వైట్‌కాలర్‌ నేరాలు.. తదితరాలపై కూడా.. 

దిశ చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సినవి చేశాం 

రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం 

ఈ–రక్షాబంధన్‌ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని.. రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మహిళలపై సైబర్‌ నేరాల నిరోధానికి చర్యలు తీసుకోవడంతో పాటు వేధింపులను ఎలా ఎదుర్కోవాలనే దానిపై అవగాహన కల్పిచేందుకు రాఖీ పండుగను పురస్కరించుకుని సోమవారం తన క్యాంపు కార్యాలయంలో మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్‌ కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ఎమన్నారంటే..

► రాఖీ పండుగ సందర్భంగా రెండు కార్యక్రమాలు మొదలుపెట్టాం.
► ఉదయం వైఎస్సార్‌ చేయూత, ఆసరా కార్యక్రమాలకు సంబంధించి హిందుస్థాన్‌ యునిలీవర్, ప్రోక్టర్‌ అండ్‌ గాంబిల్, ఐటీసీలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం.
► ఇంతకుముందు అమూల్‌తో ఒప్పందం చేసుకున్నాం.
► అర్హత పొందిన మహిళలకు నాలుగేళ్లపాటు తోడ్పాటు అందుతుంది.
► ఈ పెద్ద పెద్ద కంపెనీల భాగస్వామ్యంతో వారికి స్థిరమైన ఆదాయం లభించేలా కార్యక్రమాలు చేపడుతున్నాం.
► ఇందుకు ఏడాదికి దాదాపు రూ.11వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.

రాఖీ పండుగ రోజున మరో కార్యక్రమం చేపడుతున్నాం..
► 4s4u.ap.police.gov.in అనే పోర్టల్‌ను ప్రారంభిస్తున్నాం.
► రాబోయే నెలరోజులపాటు ఈ వెబ్‌ చానల్లో వివిధ నిపుణులతో మహిళలకు అవగాహన కల్పిస్తారు.
► ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలోనూ స్మార్ట్‌ఫోన్‌ ఉంది కాబట్టి దానివల్ల మంచి ఏంటి? చెడు ఏంటి? నష్టాలేంటి? వేధింపులను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై అవగాహన కలిగిస్తారు.
► సైబర్, వైట్‌కాలర్‌ నేరాలు.. తదితర అంశాలనూ వివరిస్తారు.
► ఏయే యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు, ఏ యాప్‌లవల్ల ఇబ్బందులు వస్తాయన్న వాటి గురించి కూడా చెబుతారు. 
► నేరం జరిగినప్పుడు ఎక్కడ? ఎలా? ఫిర్యాదు చేయాలో తెలియజేస్తారు.

దిశ యాప్, పోలీస్‌స్టేషన్లు..
► దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, దిశ కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేయడం, సైబర్‌మిత్ర వాట్సాప్‌ నంబర్ల ద్వారా సహాయం పొందవచ్చు.
► ఇవికాక దిశ పోలీస్‌స్టేషన్లు కూడా ఉన్నాయి. వీటిలో ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్య తీసుకుంటారు.
► 18 దిశ పోలీస్‌స్టేషన్లు, స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను కూడా పెట్టాం.
► దిశ చట్టం కోసం రాష్ట్ర ప్రభుత్వపరంగా చేయాల్సినవి చేశాం. రాష్ట్రపతి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నాం.
► రాష్ట్ర చరిత్రలో మహిళలకు ఇంత ప్రాధాన్యతనిచ్చిన ప్రభుత్వంలేదు.
► ఇప్పటికే వారికి 50శాతం రిజర్వేషన్లు.. అమ్మ ఒడి, వసతి దీవెన ఇస్తున్నాం. ఈనెల 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున వారి పేరు మీద ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి ఇస్తున్నాం.
► హోంమంత్రి పదవి కూడా మహిళకు ఇచ్చాం. ప్రతి గ్రామంలో మహిళా పోలీసులను పెట్టాం.
► మద్యాన్ని కూడా నియంత్రించాం.
► 4ఎస్‌4యూ పోర్టల్‌ ద్వారా కూడా వారికి మంచి జరుగుతుంది. ఇది మరో చరిత్రాత్మక ఘట్టం.
హోంమంత్రి సుచరిత, డీజీపీ సవాంగ్, సీఐడీ అడిషనల్‌ డీజీ సునీల్‌కుమార్, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యే రజని, మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపాటి అమ్మాజీ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు