మౌలిక సదుపాయాలే కీలకం: నీతి ఆయోగ్‌ భేటీలో సీఎం జగన్‌

28 May, 2023 04:38 IST|Sakshi
ప్రధాని నరేంద్ర మోదీ, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ సుమన్‌బేరిలతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు

అప్పుడే ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన అభివృద్ధి.. ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారానే అది సాధ్యం 

నీతి ఆయోగ్‌ భేటీలో సీఎం జగన్‌ స్పష్టీకరణ  

జీడీపీలో సేవలు, తయారీ రంగం వాటా 85% దాటాలి 

ఇందుకు వ్యవసాయం, పెట్టుబడులపై ప్రధానంగా దృష్టి సారించాలి.. ఉత్పాదకతకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాలి 

పరిశ్రమలు, వైద్యం, నైపుణ్యాభివృధ్ధి, మహిళా సాధికారతపై ఏపీ శ్రద్ధ.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో మూడేళ్లుగా రాష్ట్రం నంబర్‌వన్‌  

గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌తో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు.. విలేజ్‌ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్‌ వ్యవస్థతో ప్రజలకు చేరువైన వైద్యం  

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆరోగ్యకరమైన పెట్టుబడుల ద్వారా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తేనే ఆర్థిక వ్యవస్థ శీఘ్రగతిన పురోగమిస్తుందని ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశ జీడీపీలో తయారీ, సేవల రంగం వాటా 85 శాతం దాటినప్పుడే ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యం నెరవేరుతుందని స్పష్టం చేశారు. రెండు రంగాల ప్రపంచ సగటు వాటా 91.5 శాతంగా ఉందని, ఈ లక్ష్యాన్ని సాధించడానికి వ్య­వ­సాయం, పెట్టుబడులు.. రెండింటి­కీ సంబంధించిన అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చె­ప్పారు.

ఆహార రంగంలో స్వయం సమృద్ధిని సాధించడంతోపాటు, వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రాష్ట్రాలూ ఒక జట్టుగా పని చేయాలని, ప్రతి రాష్ట్రం శ్రేయస్సు మొత్తం దేశంతో ముడి పడి ఉంటుందని చెప్పారు. శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ ఎనిమిదవ పాలక మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. నీతి ఆయోగ్‌ చర్చించే వివిధ అంశాల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరిస్తూ ఒక నోట్‌ సమర్పించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  
 
పోర్డు ఆధారిత అభివృద్ధికి ఏపీ ప్రాధాన్యం  
► దేశంలో లాజిస్టిక్స్‌ కోసం పెడుతున్న ఖర్చు జీడీపీలో 14 శాతంగా ఉంది. భారతీయ ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ఇది ప్రతిబంధకంగా మారింది. అమెరికాలో లాజిస్టిక్స్‌ ఖర్చు కేవలం 7.5 శాతానికే పరిమితమైంది. గత తొమ్మిదేళ్లలో సరకు రవాణా కారిడార్లు, జాతీయ రహదారులపై ప్రభుత్వం ప్రశంసనీయ రీతిలో వ్యయం చేస్తోంది. ఆశించిన ఫలితాలను సాధించడానికి దీన్ని కొనసాగించడం చాలా అవసరం. 

► ఇందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం పోర్టు ఆధారిత అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 4 కొత్త పోర్టులు, 10 ఫిషింగ్‌ హార్బర్లు ఏర్పాటవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కర్నూలులోని ఓర్వకల్‌ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. విశాఖపట్నంలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పీపీపీ పద్ధతిలో నిరి్మస్తోంది.  
 
రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 6 లక్షల మందికి ఉపాధి  

► తయారీ, సేవల రంగాల వాటా పెరుగుదలను సాధించడానికి పెట్టుబడులు చాలా అవసరం. దీనికి అనుకూలమైన వ్యాపార వాతావరణం తప్పనిసరి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో ఏపీ గత మూడేళ్లుగా వరుసగా దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 

► ప్రభుత్వం వ్యాపారస్తులకు అత్యంత అనుకూలంగా అనుమతులు సహా తదితర విధానాలను సరళీకృతం చేసింది. వాడుకలో లేని చట్టపరమైన నిబంధనలను సవరించడంతో పాటు కొన్నింటిని రద్దు చేసింది.   

► విశాఖపట్నంలో నిర్వహించిన గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌–2023కు అద్భుత స్పందన లభించించింది. రూ. రూ.13 లక్షల కోట్ల భారీ పెట్టుబడులతో వివిధ సంస్థలు, కంపెనీలు ముందుకు వచ్చాయి. దీనివల్ల దాదాపు 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. 
 
ప్రజారోగ్యం బలోపేతం  
► ప్రజారోగ్యం, పౌష్టికాహారం కూడా చాలా ముఖ్యమైన అంశాలు. పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులు, పెరుగుతున్న సంక్రమించని దీర్ఘకాలిక వ్యాధులైన హృదయ సంబంధ వ్యాధులు, మధుమేహం వంటి అనారోగ్యాలకు సమయానికి చికిత్స అందించకపోతే తీవ్ర సమస్యలకు దారితీస్తుంది. టెరిటరీ హెల్త్‌కేర్‌ పేరిట అతిపెద్ద భారానికి దారితీస్తుంది. అందుకనే దీనిపై ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్, పౌష్టికాహారంపై అత్యంత దృష్టి పెట్టాలి.  

► ఏపీ ప్రభుత్వం 10,592 గ్రామ, వార్డు క్లినిక్‌లను ఏర్పాటు చేసి, ఇందులో ఒక మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్, ఒక ఏఎన్‌ఎం, ఆశావర్కర్లను అందుబాటులో ఉంచింది. ప్రతి విలేజ్, వార్డు క్లినిక్‌లో 105 రకాల అవసరమైన మందులు, 14 రకాల డయాగ్నస్టిక్స్‌ అందుబాటులో ఉన్నాయి. 

► రెండున్నరేళ్లలో రాష్ట్రంలో 48,639 మంది వైద్యులు, ఆరోగ్య సిబ్బందిని నియమించింది. విలేజ్‌ క్లినిక్‌ల నుండి బోధనాస్పత్రుల వరకు అవసరమైన సంఖ్యలో వైద్యులు, నర్సులు, పారామెడిక్స్‌ ఉన్నారు.  

► విలేజ్‌ క్లినిక్‌ కాన్సెప్‌్టను పూర్తి సామర్థ్యంతో అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందులో పీహెచ్‌సీల నుండి వైద్యులు కనీసం నెలకు రెండుసార్లు వారికి నిర్దేశించిన గ్రామాన్ని సందర్శిస్తారు. విలేజ్, వార్డు క్లినిక్‌ల సౌకర్యాన్ని ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవడానికి ముందుగా పేర్కొన్న తేదీల్లో వైద్యులు ఆయా గ్రామాలను సందర్శిస్తారు.  

► జీవనశైలిలో వచ్చిన మార్పుల కారణంగా వచ్చే వ్యాధుల సమస్యలను సమర్థవంతంగా స్క్రీనింగ్‌ చేయడం, గుర్తించడం, నిర్ధారించడం, ట్రాక్‌ చేయడం, చికిత్స చేయడం ద్వారా విజయవంతంగా వాటిని నివారించవచ్చని ప్రగాఢంగా నమ్ముతున్నాం.  
  
డైనమిక్‌గా పాఠ్య ప్రణాళిక  
► నైపుణ్యాభివృద్ధి అన్నది మరో కీలక అంశం. జర్మనీ వంటి అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఈ అంశంలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. తగ్గుతున్న జననాల రేటు కారణంగా, ఆ దేశాలు చివరకు శ్రామికశక్తి కొరతను ఎదుర్కొంటాయి. పని చేసే వయసున్న జనాభా విషయంలో సమస్యను ఎదుర్కొంటున్నాయి.  

► అదృష్టవశాత్తు మన దేశ జనాభాలో అధిక భాగం పనిచేసే వయసున్న వారే ఉన్నారు. ఇది దేశానికి అత్యంత ప్రయోజనకరం. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్‌ లెర్నింగ్, లార్జ్‌ లాంగ్వేజ్‌ల ప్రవాహం ప్రపంచాన్ని శరవేగంగా మారుస్తోంది. ఈ సృజనాత్మక యుగంలో పాతవాటి విధ్వంసం, కొత్త ఆవిష్కరణలు.. ఇప్పటికే ఉన్న వ్యాపార పద్ధతులు, ప్రక్రియలు, సాంకేతికతలను సమూలంగా మార్చేస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి వీలుగా మనం పాఠ్యాంశాల్లోనే అర్థవంతమైన, డైనమిక్‌ నైపుణ్యాలను నేర్చుకునేలా కొత్తవాటిని ప్రవేశపెట్టాలి. పాఠ్య ప్రణాళికను డైనమిక్‌గా తీర్చిదిద్దాలి.  
 
మహిళలకు చేయూత  
► సమ్మిళిత వృద్ధి లక్ష్యాన్ని సాధించడానికి మహిళా సాధికారత చాలా కీలకం. మహిళలకు ఆర్థిక వనరులు, అవకాశాలను పెంపొందించడానికి, ఏపీ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేయూత, ఆసరా వంటి అనేక పథకాలను అమలు చేస్తోంది. దీని కింద వెనుకబడిన, ఆరి్థకంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నాలుగేళ్లుగా స్థిరంగా ఆర్థిక సహాయం అందిస్తున్నాం.  

► మహిళా స్వయం సహాయక సంఘాలపై అధిక అప్పుల భారం.. ఆదాయాన్ని సమకూర్చే కార్యక్రమాల్లో వారి పెట్టుబడి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని ప్రభుత్వం గుర్తించింది. ఈ పోటీ ప్రపంచంలో వారు నిలదొక్కుకోవడం చాలా కష్టమవుతున్నందున, సున్నా వడ్డీ కార్యక్రమం ద్వారా, సకాలంలో తిరిగి చెల్లించే షరతుపై ఎస్‌హెచ్‌జీలు పొందే రుణాలపై వడ్డీ రాయితీని ప్రభుత్వం గణనీయంగా అందిస్తోంది.  

► కేవలం నిధులను మహిళల చేతుల్లో పెట్టడంతోనే ప్రభుత్వాల పాత్ర ముగిసిపోకూడదు. పెట్టుబడి పెట్టడానికి, తీవ్రమైన పోటీని తట్టుకునేలా ఆయా కార్యక్రమాల్లో కొనసాగడానికి మహిళలకు పరిమిత సామర్థ్యం ఉందని ప్రభుత్వాలు గుర్తించాలి. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్‌ అనుసంధానాలను పొందడంలో మహిళలకు చేయూతనిచ్చి నడిపించే ప్రగతిశీల విధానాన్ని ప్రభుత్వాలు అవలంబించాలి.     

మరిన్ని వార్తలు