18 నెలల్లో 95 శాతం హామీలు నెరవేర్చాం: సీఎం జగన్

30 Dec, 2020 13:30 IST|Sakshi

సాక్షి, విజయనగరం : రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఆస్తి, స్థిరాస్తి అందించే మహాయజ్ఞాన్ని ప్రారంభించామని, 18 నెలల్లో 95 శాతం హామీలు నెరవేర్చామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  రాష్ట్రంలో ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ పేదలకు ఇళ్ల పట్టాలు..  రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షలకు పైగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామని తెలిపారు. పేదలకు 2.20 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తున్నామని వెల్లడించారు. 35.70లక్షల ఇళ్లను రెండు దశల్లో పూర్తి చేస్తామన్నారు. బుధవారం విజయనగరం జిల్లా పర్యటనలో భాగంగా 'నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని  ‘వైఎస్సార్‌ జగనన్న కాలనీ’ పైలాన్‌ను ఆవిష్కరించారు. ( చదవండి : వైఎస్సార్‌ జగనన్న కాలనీ పైలాన్‌ ఆవిష్కరించిన సీఎం జగన్ )

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘‘అక్కచెల్లెమ్మలకు మంచి చేసే అవకాశం దక్కింది. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా మహిళలకు, రైతులకు, విద్యార్ధులకు.. అక్కచెల్లెమ్మలకు, వందల సామాజిక వర్గాలకు అండగా నిలిచా. 50 లక్షలకు పైగా రైతులకు రైతు భరోసా సాయం అందించాం. 62 లక్షల మంది అవ్వాతాతలకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్‌.. వారి ఇంటి వద్దకే అందించేలా గొప్ప కార్యక్రమం చేపట్టాం. 15 లక్షలకు పైగా విద్యార్ధుల చదువులకు తోడుగా నిలబడ్డా. రైతన్నలకు ఇన్‌పుట్ సబ్సిడీ అందించి అండగా నిలబడ్డా. గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా 1.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం’’ అని అన్నారు.

ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు
ప్రభుత్వం కడుతున్నది ఇళ్లు కాదు.. ఊళ్లు. కొత్తగా 17,005 వైఎ‍స్సార్‌ జగనన్న కాలనీలు నిర్మించబోతున్నాం. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. గుంకలాం లేఅవుట్‌లో 12,301 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తాం. గుంకలాంలో చిన్న నగర పంచాయతీ ఏర్పడబోతుంది. కుల, మత, పార్టీలకతీతంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టాం. గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్‌ప్లే చేస్తున్నాం. ఇళ్ల పట్టాలను నిరంతర ప్రక్రియగా మార్చాం. అర్హులైనవారు దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లో.. ఇంటి స్థలం కేటాయించేలా ఆదేశాలు ఇచ్చాం. తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్ సహా మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. లే అవుట్ విస్తీర్ణం బట్టి పార్క్‌లు, అంగన్‌వాడీలు, విలేజ్‌ క్లీనిక్‌లు, ఆర్‌బీకేలు ఏర్పాటు.. 224 చదరపు అడుగుల నుంచి 340 చదరపు అడుగులకు విస్తీర్ణం పెంచాం. 

ఒక రూపాయికే టిడ్కో ఇళ్లు
300 చదరపు అడుగులు ఉన్న టిడ్కో ఇళ్లను ఒక రూపాయికే అందిస్తున్నాం. టిడ్కో ఇళ్లను పూర్తిచేసేందుకు రూ.9వేల కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నాం. లక్షా 43వేల మంది టిడ్కో లబ్ధిదారుల్లో ఒక్కరు మాత్రమే చంద్రబాబు స్కీం కావాలన్నారు. 365, 430 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లల్లో.. 50శాతం లబ్ధిదారుల వాటాను ప్రభుత్వమే చెల్లిస్తుంది.  దీనివల్ల రూ.4,250 కోట్లు ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు ఇచ్చాం. మొదటి ఆప్షన్‌లో నిర్మాణ సామాగ్రి, లేబర్ ఛార్జీలను లబ్ధిదారులకు ఇస్తాం. రెండో ఆప్షన్‌లో నిర్మాణ ఖర్చులను పురోగతి వారీగా డబ్బులు చెల్లిస్తాం. మూడో ఆప్షన్‌లో పూర్తిగా ఇంటి నిర్మాణం చేసి లబ్ధిదారులకు అందిస్తాం. 

చంద్రబాబు అండ్‌ కో కుట్రలతో రిజిస్ట్రేషన్‌లు జరగలేదు
లబ్ధిదారుల పేరుతోనే ఇంటి రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. చంద్రబాబు అండ్‌ కో కుట్రలతో రిజిస్ట్రేషన్‌లు జరగలేదు. లబ్ధిదారులకు కేవలం 'డి' పట్టాలు మాత్రమే ఇస్తున్నాం. న్యాయపరమైన చిక్కులు తొలిగిపోగానే లబ్ధిదారులకు అన్ని హక్కులు కల్పిస్తాం. డిసెంబర్‌ 25న ఇళ్ల పట్టాలు పంచుతామని తెలిసి 24న కోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారో దీన్ని బట్టే తెలుస్తుంది. పులివెందులలో ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు ద్వారా స్టే తెచ్చారు. అమరావతిలో 54 వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామంటే.. సామాజిక సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. విశాఖలో 1.84 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సంకల్పించాం..ల్యాండ్ పూలింగ్‌కు సంబంధంలేనివారు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు.

రాజమండ్రిలో ఆవా భూముల పేరుతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. ప్రభుత్వ భూములను కూడా పేదలకు కేటాయించకుండా అడ్డుకుంటున్నారు. ఇళ్ల నిర్మాణం ద్వారా 30 రకాల వృత్తిదారులకు ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. చంద్రబాబు, అనుచరుల పిటిషన్ల వల్ల 10% ఇళ్ల పట్టాల పంపిణీ నిలిచిపోయింది. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం కాగానే మిగిలిన వారందరికీ ఇళ్ల స్థలాలు.. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును చట్టబద్ధ హక్కుగా మార్చారు. పేదలకు ఆస్తి హక్కు కల్పించే ప్రయత్నం చేస్తుంటే కోర్టుకెళ్లి అడ్డుకుంటున్నారు. విజయనగరంలో మెడికల్ కాలేజీకి జనవరిలో టెండర్లు.. మార్చి నాటికి మెడికల్ కాలేజీ నిర్మాణం చేపడతాం. రెండేళ్లలో తోటపల్లి, తారకరామ తీర్ధసాగరం ప్రాజెక్ట్‌ పూర్తి చేస్తాం. ఏడాదిలోగా రాముడువలస లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేస్తాం.\

మరిన్ని వార్తలు