పెన్షన్లపై విష ప్రచారం.. సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

27 Dec, 2022 11:34 IST|Sakshi

సాక్షి, అమరావతి: పెన్షన్లపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. అర్హులైనప్పటికీ ఏ కారణం చేతనైనా లబ్ధి పొందని వారికి మరో అవకాశం కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా 2,79,065 మందికి రూ.590.91 కోట్లను సీఎం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి ఖాతాల్లో జమ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘పెన్షన్లపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆడిట్‌ జరగాలి. ఆడిట్‌ జరుగుతుంటే పెన్షన్లు తీసేస్తున్నారని విష ప్రచారం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి రీవెరిఫికేషన్‌ మాత్రమే చేస్తారు. అర్హులందరికీ పెన్షన్లు అందాలన్నదే మా లక్ష్యం. మంచి పనులను చెడుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషపు రాతను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.. తప్పుడు ప్రచారాన్ని కలెక్టర్లు తిప్పికొట్టాలి’’ అని సీఎం పేర్కొన్నారు.

‘‘గత ప్రభుత్వంలో పెన్షన్‌ బిల్లు కేవలం రూ.400 కోట్లు మాత్రమే. ఇప్పుడు నెలనెలా పెన్షన్‌ బిల్లు రూ.1770 కోట్లు. గత ప్రభుత్వంలో 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్లు ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో 62 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వంలో పెన్షన్‌ రూ.వెయ్యి మాత్రమే ఇచ్చేవారు. మా ప్రభుత్వంలో పెన్షన్‌ రూ.2750కి పెంచుతూ ఉన్నాం. మనం విషపు వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. విష ప్రచారం చేసే వారిని దేవుడే శిక్షిస్తాడు.’’ అని సీఎం అన్నారు.

తమది రైతులు, పేదల కష్టాలు తెలిసిన ప్రభుత్వమని.. ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకూడదన్నదే తమ లక్ష్యమని సీఎం అన్నారు. అర్హత ఉండి సంక్షేమ పథకాలు పొందని వారికి అవకాశం ఇచ్చాం. పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులు జమ చేస్తున్నాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఈ మాదిరిగా సంక్షేమ పథకాలు ఇవ్వడం దేశ చరిత్రలోనే లేదని సీఎం అన్నారు.
చదవండి: లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్‌

‘‘లంచాలు, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. మూడున్నరేళ్లలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో రూ.1.85 లక్షల కోట్లు జమ చేశాం. డీబీటీ, నాన్‌ డీబీటీ ద్వారా మొత్తం రూ.3.30 లక్షల కోట్లు అందించాం. సంక్షేమ పథకాల అమలులో కలెక్టర్ల పాత్ర చాలా కీలకం. గత ప్రభుత్వంలో ఏ పార్టీ అని అడిగి పథకాలు ఇచ్చేవారు. లంచాలు  లేకుండా గత ప్రభుత్వం ఏ పథకం ఇవ్వలేదు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు వసూళ్లకు పాల్పడ్డాయి’’ అని సీఎం జగన్‌ అన్నారు.

మరిన్ని వార్తలు