కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం జగన్‌

20 Nov, 2021 14:52 IST|Sakshi

సాక్షి, విజయవాడ: గుండెపోటుతో మరణించిన కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ మహ్మద్‌ కరీమున్నీసా భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  అనంతపురం కరీమున్నిసా కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హోం మంత్రి సుచరిత, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు కూడా ఎమ్మెల్సీ కరీమున్నిసా భౌతికకాయానికి నివాళులర్పించారు.

కాగా, కృష్ణా జిల్లా ఎమ్మెల్సీ ఎండీ కరీమున్నిసా గుండెపోటుతో శుక్రవారం అర్థరాత్రి మృతి చెందారు. శాసనమండలి సమావేశానంతరం ఇంటికి వచ్చిన ఆమె రాత్రి 11.30 గంటల సమయంలో ఛాతిలో నొప్పి వస్తోందని చెప్పడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విజయవాడలోని రెండు హాస్పటల్స్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. 

వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి కరీమున్నీసా పార్టీకోసం నిరంతరం శ్రమించారు. ఈ ఏడాది ఎమ్మెల్సీగా ఆమెకు సీఎం జగన్‌ అవకాశం కల్పించారు. శుక్రవారం ఉదయం శాసనమండలిలో ఆమె సీఎం జగన్‌, శాసనమండలి చైర్మన్‌ మోషేన్‌ రాజును కలిశారు. కరీమున్నీసాకు భర్త, ఐదుగురు కుమారులు ఉన్నారు.
 

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మృతి పట్ల గవర్నర్ సంతాపం 
విజయవాడ: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ మహ్మద్ కరీమున్నీసా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మైనారిటీ వర్గానికి చెందిన నాయకురాలిగా కరీమున్నీసా తన రాజకీయ జీవితాన్ని కార్పొరేటర్‌గా ప్రారంభించి ఎమ్మెల్సీ స్థానానికి ఎదిగారన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

చదవండి: (వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ కన్నుమూత)

మరిన్ని వార్తలు