రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్‌: సీఎం జగన్‌ అభినందనలు

21 Jun, 2021 12:22 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా వైరస్‌ నివారణ చర్యలు, హెల్త్ నాడు-నేడుపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో రికార్డు స్థాయిలో వ్యాక్సిన్‌ వేసిన సిబ్బందికి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటే వేసే సమర్ధత ఉందని నిరూపించారని పేర్కొన్నారు. పటిష్ట యంత్రాంగంతో రికార్డు స్థాయి వ్యాక్సినేషన్ సాధ్యమైందని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

సమీక్షలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని, కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. బిల్డింగ్, నాన్‌ బిల్డింగ్ సర్వీసులపై అధికారులు సీఎం జగన్‌కు అధ్యయన వివరాలు తెలియజేశారు. ఆస్పత్రుల ఆవరణ కూడా అత్యంత పరిశుభ్రంగా ఉండాలని, ఆస్పత్రుల నిర్వహణపై ఎస్‌ఓపీలను రూపొందించాలన్నారు. 

ప్రభుత్వాస్పత్రులు కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీ పడాలని, ఎక్కడా ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఆస్పత్రుల్లో ఎమర్జెన్సీ ప్లాన్ కూడా సమర్ధవంతంగా ఉండాలని, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రొటోకాల్స్‌పై అధ్యయనం చేయాలన్నారు. అన్ని అంశాలు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్ ఫోర్స్, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌లో ఆంధ్రప్రదేశ్‌ మరో రికార్డును సాధించింది. గతంలో ఒకేరోజు 6.32 లక్షల డోసులు టీకాలు వేసి దేశంలోనే రికార్డు సృష్టించగా  ఆదివారం చేపట్టిన ప్రత్యేక వ్యాక్సిన్‌ డ్రైవ్‌ అంచనాలకు అందని రీతిలో విజయవంతమైంది. తాజాగా ఒక్కరోజే 13,59,300 మందికి టీకాలు వేశారు. దీంతో ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో టీకాలు ఇవ్వడంలో ఏపీ తన రికార్డును తానే అధిగమించింది.

చదవండి: ఏపీ: ప్రమాణ స్వీకారం చేసిన నలుగురు నూతన ఎమ్మెల్సీలు

మరిన్ని వార్తలు