ఏఐటీటీ టాపర్స్‌కు సీఎం జగన్‌ అభినందనలు 

30 Oct, 2021 13:45 IST|Sakshi

ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షలు ప్రోత్సాహం 

మెమెంటో, సర్టిఫికెట్, ట్యాబ్స్‌ అందజేత 

చదువుకు అనుగుణంగా ఏపీఐఐసీలో ఉద్యోగం

సాక్షి, అమరావతి: ఆల్‌ ఇండియా ట్రేడ్‌ టెస్ట్‌ (ఏఐటీటీ)–2020లో క్రాఫ్ట్‌మెన్‌ ట్రైనింగ్‌ స్కీమ్‌ (సీటీఎస్‌) జాతీయ స్థాయి పరీక్షలో టాప్‌ ర్యాంకులు సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా వారిని అభినందిస్తూ ఒక్కో విద్యార్థికి రూ.5 లక్షల నగదు ప్రోత్సాహం, వారి చదువుకు అనుగుణంగా ఏపీఐఐసీలో ఉద్యోగాన్ని ప్రకటించారు. వారికి మెమెంటోలతో పాటు సర్టిఫికెట్‌లు, ట్యాబ్‌లను అందజేశారు. ఇదిలా ఉండగా కౌశలాచార్య అవార్డు–2021ని సాధించిన డిప్యూటీ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ వై.రజిత ప్రియను కూడా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అభినందిస్తూ రూ.5 లక్షల ప్రోత్సాహం ప్రకటించారు.

వీరందరికీ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి మంగళగిరి ఏపీఐఐసీ ప్రధాన కార్యాలయంలో రూ.5 లక్షల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఐటీ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్‌ లావణ్య వేణి, రీజనల్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వరరావు, జాయింట్‌ డైరెక్టర్‌ జి.బాలసుబ్రహ్మణ్యం, పలువురు అధికారులు పాల్గొన్నారు.  

ఏఐటీటీ–2020 టాపర్స్‌ వీరే..  
డి.మణికంఠ, మెకానిక్‌ డీజిల్‌ ట్రేడ్‌ – ఆల్‌ ఇండియా సెకండ్‌ ర్యాంక్‌
మొండి సతీష్, ఎలక్ట్రీషియన్, ఆల్‌ ఇండియా ఐదో ర్యాంక్‌
ఎన్‌.కుమారి, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఆల్‌ ఇండియా ఆరో ర్యాంక్‌
► ఎం.బాల పవన్‌ రాజు, డ్రాఫ్ట్‌మెన్‌ సివిల్, ఆల్‌ ఇండియా ఎనిమిదో ర్యాంక్‌
ఎం.రోషణ్, మెకానిక్‌ ఆర్‌ అండ్‌ ఏసీ ట్రేడ్, ఆల్‌ ఇండియా తొమ్మిదో ర్యాంక్‌.

మరిన్ని వార్తలు