మంత్రి కుటుంబ సభ్యులను ఓదార్చిన ముఖ్యమంత్రి
సాక్షి, మచిలీపట్నం/సాక్షి, అమరావతి: ‘అమ్మలేని లోటు ఎవరూ పూడ్చలేనిది.. దేవుడు అండగా ఉంటాడు, ధైర్యంగా ఉండండి’ అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) కుటుంబ సభ్యులను ఓదార్చారు. పేర్ని నాని మాతృమూర్తి నాగేశ్వరమ్మ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. నాని కుటుంబాన్ని పరామర్శించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మచిలీపట్నంలోని మంత్రి స్వగృహానికి చేరుకున్నారు. తొలుత నాగేశ్వరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తల్లిని కోల్పోయిన దుఃఖం నుంచి త్వరగా కోలుకోవాలని, ఆమెను స్ఫూర్తిగా తీసుకుని ముందుకుసాగాలని నాని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
మోకా భార్యకు పరామర్శ
ఇటీవల టీడీపీ నేతల చేతిలో హత్యకు గురైన మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావు సతీమణి వెంకటేశ్వరమ్మను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబానికి అండగా ఉంటానని, ధైర్యంగా ఉండాలని చెప్పారు. సీఎం పర్యటనలో మంత్రులు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ బాలశౌరి, పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.