ఏపీ: సాగుకు దన్ను

22 Sep, 2022 03:49 IST|Sakshi

రైతన్నలకు అన్ని విధాలా తోడుగా నిల్చొని నడిపిస్తున్నాం 

వ్యవసాయం, అనుబంధ రంగాలపై చర్చలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌  

టీడీపీ పాలనంతా కరువు కాటకాలే.. బాబు–కరువు కవలలు 

దేవుడి దయవల్ల మన పాలనలో ఒక్క కరువు మండలం లేదు   

మూడేళ్లుగా పుష్కలంగా వర్షాలు.. నదులన్నీ పరవళ్లు  

మూడేళ్లలో వ్యవసాయ రంగంపై రూ.1,28,634 కోట్ల ఖర్చు 

ఏటా పెరిగిన 13.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి   

ఆర్బీకేలతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు  

రైతు ముంగిటకే నాణ్యమైన, సర్టిఫై చేసిన ఇన్‌పుట్స్‌  

ఆర్బీకేలకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల ప్రశంసలు 

ఆర్బీకేల పరిధిలో రూ.17 వేల కోట్లతో మౌలిక వసతులు  

ల్యాబ్‌ టూ ల్యాండ్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌..  

మన ‘ఈ క్రాప్‌’ ఈ రోజు దేశానికే మార్గదర్శకం 

ఆర్బీకేల పరిధిలో కిసాన్‌ డ్రోన్స్‌ తీసుకొస్తున్నాం. వీటి వల్ల పురుగుల మందులు పిచికారీ వేగవంతమవుతుంది. నానో ఫెర్టిలైజర్స్‌ను ప్రోత్సహించవచ్చు. వచ్చే రెండేళ్లలో ఆర్బీకే స్థాయిలో 2 వేల డ్రోన్స్‌ తీసుకొచ్చే ఆలోచనతో అడుగులు వేస్తున్నాం. వీటి కోసం గుర్తించిన రైతు కమిటీల్లో ఒకరికి డ్రోన్‌ పైలెట్‌గా శిక్షణ ఇచ్చి లైసెన్స్‌ ఇస్తాం. ఒక్కో డ్రోన్‌ కోసం రూ.10 లక్షలు ఖర్చు పెడుతున్నాం. ప్రతి ఆర్బీకే పరిధిలో మార్చి–ఏప్రిల్‌ నాటికి భూసార పరీక్షలు చేసి, సాయిల్‌ హెల్త్‌ కార్డులు ఇస్తూ సాయిల్‌ డాక్టర్‌ కాన్సెప్ట్‌ తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. తద్వారా ఏ పంటకు ఏ ఎరువు ఎంత వేయాలో ప్రతి రైతుకు అవగాహన వస్తుంది.

చంద్రబాబు హయాంలో ఐదేళ్లూ కరువే.. 2014లో 238 మండలాలు, 2015లో 359, 2016లో 301, 2017లో 121, 2018 ఖరీఫ్‌లో 347, రబీలో 257 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించడం చూశాం. అందుకే చంద్రబాబు పాలన విషయంలో ఒక నానుడి ఉంది. కరువు–బాబు ఇద్దరూ కవల పిల్లలు అంటారు. ఈ 40 నెలల పాలనలో ఏ ఒక్క ఏడాది ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదు.  
 – సీఎం వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని గట్టిగా నమ్మిన ప్రభుత్వం మనది. రైతులకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నాం. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 98.4 శాతం మూడున్నరేళ్లలోనే అమలు చేశాం. గ్రామ స్థాయిలో స్పష్టమైన మార్పు కన్పించేలా ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. ఆర్బీకేల ద్వారా ప్రతి రైతన్నకు తోడుగా నిల్చుని చేయి పట్టుకొని నడిపిస్తున్నాం.

వ్యవసాయ రంగంలో ఎలాంటి మార్పులు తీసుకొచ్చామో గమనించాలి’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు. అసెంబ్లీ సమావేశాల చివరి రోజైన బుధవారం వ్యవసాయం–అనుబంధ రంగాలపై స్వల్ప కాలిక చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చెరువులు, దొరువులు, కాలువలు, వాగులు, వంకలు, నదులు.. అన్నింటిలో నీరు పుష్కలంగా కనిపిస్తోందన్నారు.

రాష్ట్రంలోని వంశధార, నాగావళి.. గోదావరి, కృష్ణ, తుంగభద్ర, పెన్నా.. నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న అద్భుత ఘట్టాన్ని చూస్తున్నామని చెప్పారు. కృష్ణ, గోదావరి డెల్టాతో పాటు రాయలసీమకు కూడా సాగునీటి ప్రాజెక్టులు, కాలువల ద్వారా అత్యధికంగా నీరు ఇచ్చింది ఈ మూడేళ్లలోనే అని స్పష్టం చేశారు. సగటున భూగర్భ జలాలు వర్షా కాలం తర్వాత 2018లో 12.65 మీటర్లు..అంటే దాదాపు 42 అడుగుల లోతులో ఉంటే.. 2021లో 5.78 మీటర్లు.. అంటే 19 అడుగులకే అందుబాటులోకి వచ్చాయని వివరించారు. సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
 
40 నెలల్లో రూ.1.28 లక్షల కోట్ల లబ్ధి  
► ఇదివరకెన్నడూ లేని విధంగా ఈ 40 నెలల కాలంలో రైతన్నల కోసం వ్యవసాయ రంగంపై మనం చేసిన ఖర్చు రూ.1,28,634 కోట్లు. వైఎస్సార్‌ రైతు భరోసా కింద ఏటా రూ.12,500 చొప్పున నాలుగేళ్లలో ప్రతి రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని చెప్పాం. ఇచ్చిన హామీ కంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున ఐదేళ్లలో రూ.67,500 ఇస్తున్నాం.  
► రైతులతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కౌలు రైతులు, ఆర్‌ఒఎఫ్‌ఆర్, దేవుడు భూములు సాగు చేస్తున్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అందిస్తున్నాం. నాలుగవ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో తొలివిడత సాయం ఇప్పటికే అందజేశాం. అక్టోబర్‌లో రెండో విడత సాయం అందజేస్తాం. మూడేళ్లలో 52.38 లక్షల రైతున్నలకు రూ.23,875.29 కోట్ల పెట్టుబడి సాయం అందించాం. 
► ఈ మూడేళ్లలో ఆహార ధాన్యాల దిగుబడి రికార్డు స్థాయిలో వచ్చింది. ఐదేళ్ల చంద్రబాబు పాలనతో పోలిస్తే సగటున 13.29 లక్షల టన్నులకు పెరిగాయి. 2014–19 మధ్య సగటున 154 లక్షల టన్నులుంటే ఈ మూడేళ్లలో 167.24 లక్షల టన్నుల దిగుబడులు వచ్చాయి. ఈ ఏడాది అంతకంటే ఏమాత్రం తగ్గకుండా ఉంటుంది. రైతులే కాదు.. రైతు కార్మికులు కూడా సంతోషంగా ఉన్నారని ఈ దిగుబడులే చెబుతున్నాయి. 
 
గత ప్రభుత్వ బకాయిలు చెల్లిస్తున్నాం 
► గత ప్రభుత్వం ఎగ్గొట్టిన ప్రీమియం మొత్తం ఇన్‌స్రూ?న్స్‌ కంపెనీలకు 2012–13కు సంబంధించి రూ.120 కోట్లు, 2018–19కి సంబంధించి రూ.596.40 కోట్లు.. మొత్తం రూ.716 కోట్లు మనం చెల్లించాం.  

► ఇప్పుడు రైతులపై పైసా భారం పడకుండా వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం అమలు చేస్తోన్న ఏకైక ప్రభుత్వం మనదే. సీజన్‌ ముగియకుండానే పంటల బీమా అందిస్తున్నాం. మూడేళ్లలో 44.28 లక్షల మంది రైతులకు రూ.6,684.84 కోట్లు పరిహారం ఇచ్చాం. ఈ–క్రాప్‌ ఆధారంగా వాస్తవ సాగుదారులకు బీమా రక్షణ కలి్పస్తున్న ప్రభుత్వం ఏపీలో తప్ప దేశంలో ఎక్కడా లేదు. ఆర్బీకేల ద్వారా ఈ క్రాప్‌ నమోదు ఎలా చేస్తున్నారో తెలుసుకొని దేశమంతా అమలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నారు. 

► ఈ క్రాప్‌లో నమోదు చేసుకొని రూ.లక్ష వరకు పంట రుణం తీసుకొని.. ఏడాదిలోగా తిరిగి చెల్లించిన ప్రతి రైతన్నకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ రాయితీని అందిస్తున్నాం. బాబు పెట్టిన బకాయిలతో కలిపి మూడేళ్లలో 65.65 లక్షల రైతులకు రూ.1,282.11 కోట్ల వడ్డీ రాయితీ అందించాం. 2020–21 సీజన్‌తో పాటు ఖరీఫ్‌–2021కు సంబంధించి వడ్డీ రాయితీని ఈ నవంబర్‌లో జమ చేయబోతున్నాం. టీడీపీ హయాంలో అటకెక్కించిన మరో పథకం సున్నా వడ్డీ పంట రుణాల పథకం. ఈ పథకం కింద 2014 నుంచి 2019 వరకు 39.05 లక్షల మంది రైతులకు బకాయి పెట్టిన రూ.784.71 కోట్ల సున్నా వడ్డీ సొమ్ము మనం చెల్లించాం. 
 
సీజన్‌ ముగియకుండానే పంట నష్ట పరిహారం 
► ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగియకుండానే ఇన్‌పుట్‌ సబ్సిడీ అందిస్తున్నాం. ఇందుకోసం రూ.2 వేల కోట్ల ప్రకృతి వైపరీత్యాల సహాయ నిధిని ఏర్పాటు చేశాం.  

► 2020 ఖరీఫ్‌ నుంచి ఇప్పటి వరకు 16.67 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 12.15 లక్షల రైతులకు రూ.932.07 కోట్లు అందించాం. 2021 సెప్టెంబర్‌లో గులాబ్‌ తుఫాన్‌ వల్ల 35 వేల ఎకరాల్లో పంటను కోల్పోయిన 28 వేల మంది రైతులకు కేవలం 45 రోజుల్లోనే రూ.22 కోట్లు ఇచ్చాం. 2021 నవంబర్‌లో భారీ వర్షాలు, వరదల వల్ల 10.10 లక్షల ఎకరాల్లో పంటలు కోల్పోయిన 5.97 లక్షల రైతన్నలకు 90 రోజుల్లోనే రూ.542.09 కోట్లు అందించాం.  

► అంతకు ముందు 2019–20లో పలు ప్రకృతి వైపరీత్యాల వల్ల 1.83 లక్షల ఎకరాల్లో పంటలు నష్టపోయిన 1.47 లక్షల మంది రైతులకు రూ.116.63 కోట్లు పెట్టుబడి రాయితీగా ఇచ్చాం. ఇలా మూడేళ్లలో వివిధ రకాల వైపరీత్యాల వల్ల పంటలు నష్టపోయిన 20.85 లక్షల రైతన్నలకు రూ.1,795.39 కోట్లు అందజేశాం. గత ప్రభుత్వం చెల్లించకుండా ఎగ్గొట్టిన ధాన్యం బకాయిలు రూ.960 కోట్లు, విత్తన బకాయిలు రూ.430 కోట్లు మనమే చెల్లించాం. 
 
ఆర్బీకేలతో విప్లవాత్మక మార్పులు 
► ఆర్బీకేల ఏర్పాటుతో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకొచ్చాం. గ్రామ స్థాయిలో 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. వీటిలో 24,424 మంది గ్రాడ్యుయేట్లు, డిప్లమో హోల్డర్స్‌ గ్రామ వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ, పశు సంవర్ధక, మత్స్య సహాయకులుగా పని చేస్తున్నారు. బ్యాంకింగ్‌ సేవలను రైతుల చెంతకు తీసుకెళ్లేందుకు బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లను ఆర్బీకేలతో అనుసంధానించాం.  

► నీతి ఆయోగ్, ప్రపంచ బ్యాంక్, యూఎన్‌ (ఐక్యరాజ్యసమితి)కు చెందిన ఎఫ్‌ఏఓ (ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్‌) వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు మన ఆర్బీకేలను చూసి ప్రశంసిస్తున్నాయి. ల్యాబ్‌ టూ ల్యాండ్‌ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌.. వ్యవసాయ రంగంలో పరిశోధనలు, విప్లవాత్మక మార్పులను రైతులకు పొలాల వద్దకు చేరవేసే ఒక గొప్ప మార్పు చోటు చేసుకుంది. ఆర్బీకేల ద్వారా విత్తనం నుంచి పంట అమ్మకం వరకు రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్నాం.  

► ఆర్బీకేల పరిధిలో గోదాములు, ప్రైమరీ ప్రొసెసింగ్‌ సెంటర్లు, కోల్డ్‌ స్టోరేజ్‌లు, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, జిల్లా స్థాయిలో సెకండరీ ప్రొసెసింగ్‌ యూనిట్లు తీసుకొస్తున్నాం. వీటికోసం అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ కింద రూ.17 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.  

► ఉత్పత్తుల నాణ్యతను తెలుసుకునేందుకు నిర్ధారించుకునేందుకు వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్స్‌ తీసుకొచ్చాం. గ్రామీణ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 147, జిల్లా స్థాయిలో 13 ల్యాబ్స్‌తో పాటు మరో 4 రీజనల్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో 70 ల్యాబ్‌ల సేవలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మిగిలినవి డిసెంబర్‌ నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. 

► వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం కింద ప్రతి ఆర్బీకే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్‌లు ఏర్పాటు చేస్తున్నాం. రైతు కమిటీకి 40 శాతం సబ్సిడీపై యంత్రాలను అందిస్తున్నాం. వాటిని ఆ కమిటీలోని రైతులతో పాటు ఆర్బీకే పరిధిలోని మిగిలిన రైతులకు తక్కువ అద్దెకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమమిది.  

► 10,778 ఆర్బీకేల్లో రూ.15 లక్షల విలువైన సీహెచ్‌సీలు, వరి ముఖ్య పంటగా ఉన్న 1615 మండలాల్లో కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన రూ.25 లక్షలతో క్లస్టర్‌ స్థాయి సీహెచ్‌సీలను ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే రూ.691 కోట్లు ఖర్చుచేసి ఆర్బీకే స్థాయిలో 6,781, క్లస్టర్‌ స్థాయిలో 391 కేంద్రాలు ఏర్పాటు చేశాం. వీటి ద్వారా ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్‌ ఇతర వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశాం.  

మరిన్ని వార్తలు