కేసీఆర్‌ అభ్యర్థన.. స్పందించిన సీఎం జగన్‌

19 Oct, 2020 20:03 IST|Sakshi

సాకక్షి, హైదరాబాద్‌ : గత పదిరోజులుగా సంభవిస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే హైదరాబాద్‌ నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు, ముసీ పరివాహక ప్రాంతం వరద నీటిలో చిక్కుకుంది. పలు ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లల్లోకి చేరడంతో చాలామంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఇప్పటికీ  హైదరాబాద్‌లో పలుకాలనీలు నీటిముంపులోనే ఉన్నాయి. మరోవైపు రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మరింత అప్రమత్తం అ‍య్యింది. వరద ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సాయం కోరారు. (భారీ వరదలు : ఇంటికి లక్ష సాయం)

భారీ వర్ష సూచన ఉండటంతో సహాయచర్యల కోసం స్పీడ్‌ బోట్స్‌ పంపించాలని సోమవారం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వరద బాధితులను వీలైనంత త్వరగా చేరుకునేందుకు స్పీడ్‌ బోట్స్‌ అత్యవసరమని  భావించినసీఎం కేసీఆర్.. అధికారులతో సమీక్ష అనంతరం ఏమాత్రం ఆలస్యం చేయకుండా సీఎం జగన్‌ సాయం కోరారు. కేసీఆర్‌ విజ్ఞప్తికి వెంటనే స్పందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. తెలంగాణ ప్రభుత్వం కోరిన సాయాన్ని వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా స్పీడ్‌ బోట్లను తరలించాలని అధికారులకు స్పష్టం చేసినట్టు ఏపీ సీఎం కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. (భారీ వరద: కుంగిన పురానాపూల్‌ వంతెన)

మరిన్ని వార్తలు