Manabadi Nadu Nedu Phase 2: రెండో దశ చకచకా

14 Apr, 2022 03:22 IST|Sakshi

25 వేల స్కూళ్లలో రూ.11,267 కోట్లతో నాడు–నేడు పనులు

ఇప్పటికే రూ.3,698 కోట్లతో మొదటి దశలో 15,715 స్కూళ్లలో వసతులు

విద్యా రంగంపై ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌     

శరవేగంగా పనులు పూర్తి చేయండి

2వ దశ పనుల ద్వారా గణనీయంగా మార్పులు కనిపించాలి

ఈ విద్యా సంవత్సరంలో ఆంగ్ల మాధ్యమంలోకి 8వ తరగతి 

ప్రతి మండలంలో బాలబాలికలకు వేర్వేరు జూనియర్‌ కాలేజీలు

స్కూళ్లు తెరిచే నాటికి రూ.960 కోట్లతో విద్యాకానుక 

నూతన విద్యా విధానంలో భాగంగా మూడు దశల్లో 6 కేటగిరీల స్కూళ్లు

2022 జూలై, 2023 జూలై, 2024 జూలైలో ఈ స్కూళ్లు ఏర్పాటవ్వాలి

స్కూళ్లు తెరిచే నాటికి విద్యార్థులకు విద్యా కానుక అందించేలా చర్యలు తీసుకోవాలి. విద్యా కానుకకు దాదాపుగా రూ.960 కోట్లు ఖర్చు అవుతుందని, గతేడాదితో పోలిస్తే రూ.200 కోట్లకుపైగా అదనపు ఖర్చు అవుతోందని అధికారులు చెబుతున్నారు. విద్యా కానుక కోసం ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. పాఠశాలల్లో చదువుతున్న పిల్లలందరూ మన పిల్లలే. వారిని బాగా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 25 వేల స్కూళ్లలో రూ.11,267 కోట్ల అంచనా వ్యయంతో మన బడి నాడు–నేడు రెండో దశ కింద పనులు చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఈ పనులను శరవేగంగా పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రెండో దశ నాడు–నేడు పనుల ద్వారా ఈ ఏడాది స్కూళ్లలో గణనీయంగా మార్పులు కనిపించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లో కూడా నాడు–నేడు కింద పనులు చేపట్టాలని సూచించారు. నాడు–నేడు ద్వారా చరిత్రలో ఈ ప్రభుత్వం పేరు, భాగస్వాములైన అధికారుల పేర్లు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు.

విద్యా రంగంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరంలో 8వ తరగతిని ఇంగ్లిష్‌ మాధ్యమంలోకి తీసుకురావాలని, నాడు–నేడు కింద 468 జూనియర్‌ కళాశాలల్లో పనులు చేపట్టాలని ఆదేశించారు. ప్రతి మండలంలో రెండు జూనియర్‌ కళాశాలలు ఉండేలా చర్యలు తీసుకోవాలని, ఇందులో అమ్మాయిల కోసం ప్రత్యేకించి ఒక కాలేజీ ఏర్పాటు కావాలని స్పష్టం చేశారు. దీనిపై కార్యాచరణ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్‌ పూర్తి చేశామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. విడతల వారీగా ఆరు కేటగిరీల స్కూళ్లను ప్రారంభిస్తామని చెప్పారు. జూలై నుంచి మొదటి విడతలో మ్యాపింగ్‌ చేసిన స్కూళ్లు ప్రారంభిస్తామని వివరించారు. ఈ సమీక్షలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

తగినన్ని తరగతి గదులుండాలి
► తగినన్ని తరగతి గదులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. కావాల్సిన తరగతి గదులను శరవేగంగా పూర్తి చేయాలి. అవి పూర్తవుతున్న కొద్దీ దశల వారీగా ఆరు రకాల స్కూళ్లను ప్రారంభించే ప్రక్రియ కొనసాగాలి. 
► 2022 .ఊలై, 2023 జూలై, 2024 జూలై.. ఇలా దశల వారీగా ఈ 6 కేటగిరీల స్కూళ్లు ఏర్పాటు కావాలి. ఇందుకు అనుగుణంగా సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం కూడా చేపట్టాలి. 
► జూలై 2024 నాటికి సబ్జెక్టుల వారీగా టీచర్లను పెట్టే కార్యక్రమం పూర్తి కావాలి. ప్రతి హైస్కూల్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్లన్నీ సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌తో ఉండాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలి. (ఇప్పటి వరకు 1,310 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ పూర్తయింది.)  

ఇంగ్లిష్‌ పదాల ఉచ్ఛారణపై యాప్‌
► ఇంగ్లిష్‌ పదాల ఉచ్ఛారణపై టీచర్లకు, విద్యార్థులకు అందుబాటులో యాప్‌ను ఉంచాలి. తల్లిదండ్రుల ఫోన్లలో కూడా ఈ యాప్‌ అందుబాటులో ఉంచేలా చూడాలి. 
► జగనన్న గోరుముద్ద, సంపూర్ణ పోషణలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. నిర్దేశించిన మెనూ మేరకు పిల్లలకు ఆహారం అందుతుందా? లేదా? అన్న దానిపై నిరంతర పర్యవేక్షణ ఉండాలి. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలి. 
► ఈ సమీక్షా సమావేశంలో సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పాఠశాల విద్యా శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌ సురేష్‌ కుమార్, ఎస్‌ఎస్‌ఏ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

భద్రతపై అవగాహన
విద్యా వ్యవస్థలో మహిళా పోలీసులు నిర్వర్తించాల్సిన విధులపై సీఎం ఆదేశాల మేరకు అధికారులు ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌) రూపొందించారు. ఇందులో భాగంగా మహిళా పోలీసులు స్కూళ్లు, కాలేజీల్లో భద్రతపై అవగాహన కల్పిస్తారు. మహిళా ఉపాధ్యాయులు, బాలికలకు అన్ని రకాల వేధింపుల నుంచి రక్షణ కోసం దిశ యాప్‌ను డౌన్లోడ్‌ చేయిస్తారు. ఎలా ఉపయోగించాలో అవగాహన కల్పిస్తారు. బాల్య వివాహాల నివారణ, మత్తు మందులకు దూరంగా ఉంచడం, పోక్సో యాక్ట్, ఫిర్యాదుల బాక్స్‌ నిర్వహణపై అవగాహన కల్పిస్తారు.  

మరిన్ని వార్తలు