CM YS Jagan Review Meet on Job Calendar: 8,000 పోస్టులు సత్వరం భర్తీ

18 Jun, 2022 02:30 IST|Sakshi

జాబ్‌ క్యాలెండర్‌లో మిగిలిన ఈ ఉద్యోగాలపై వెంటనే కార్యాచరణ

వివిధ శాఖల అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ ఉన్నత స్థాయి సమీక్ష

ఉన్నత విద్యలో ఖాళీల భర్తీపైనా దృష్టి పెట్టాలని ఆదేశం 

పోలీసు రిక్రూట్‌మెంట్‌పైనా కార్యాచరణ.. వచ్చే నెల మొదటి వారంలో నివేదించండి 

2021–22 జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా ఇప్పటికే 39,654 మంది నియామకం

గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల శాశ్వత ఉద్యోగాలు 

ఆర్టీసీ విలీనం ద్వారా ప్రభుత్వంలోకి మరో 50 వేల మంది

విద్య, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాల నిర్మాణం

ఈ పరిస్థితిలో ఖాళీలు భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు

ఉన్నత విద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీట 

ఆ మేరకు ప్రతిపాదనలు తయారు చేయండి 

ఉన్నత విద్యలో టీచింగ్‌ పోస్టుల భర్తీలో సమర్థతకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు ఉండాలి. రెగ్యులర్‌ పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియామకాలు జరగాలి. ఇందు కోసం ప్రతిపాదనలు తయారు చేయాలి. పోలీసు ఉద్యోగాల భర్తీపై పోలీసు విభాగం, ఆర్థిక శాఖ అధికారులు సమన్వయంతో వీలైనంత త్వరగా యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించుకోవాలి. వచ్చే నెల మొదటి వారంలో దానిని నాకు నివేదించాలి.     
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: జాబ్‌ క్యాలెండర్‌ (202122)లో మిగిలిన సుమారు 8 వేల పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. 202122 ఆర్థిక సంవత్సరంలో 39,654 పోస్టులను ఇప్పటికే భర్తీ చేశామని స్పష్టం చేశారు. ఇవి కాక ఈ ప్రభుత్వం వచ్చాక గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చామని తెలిపారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా మరో 50 వేల మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని చెప్పారు. ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. శుక్రవారం ఆయన  తన క్యాంపు కార్యాలయంలో జాబ్‌ క్యాలెండర్‌పై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్, ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులపై సమగ్రంగా చర్చించారు.

జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా రిక్రూట్‌ చేసిన పోస్టుల వివరాలను ఈ సందర్భంగా అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. బ్యాక్‌లాక్‌ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్‌మెంట్‌ను సీఎం జగన్‌ సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఏమన్నారంటే..
జాబ్‌ క్యాలెండర్‌పై ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  

గడువులోగా మిగిలిన పోస్టుల భర్తీ
► జాబ్‌ క్యాలెండర్‌లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన వాటి రిక్రూట్‌మెంట్‌పై కార్యాచరణ రూపొందించుకోవాలి. వైద్య ఆరోగ్య శాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యా శాఖలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను సెప్టెంబర్‌లోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీ చేయాలి. నిర్దేశించుకున్న సమయంలోగా ఈ పోస్టులను భర్తీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. 
► విద్య, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నాం. ఇక్కడ ఖాళీలు భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవు.
► ఈ సమీక్షలో డీజీపీ కే వీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ ఎస్‌ రావత్, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్‌ అనురాధ, జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్, కాలేజీ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్, ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె హేమచంద్రారెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా, జీఏడీ కార్యదర్శి (సర్వీసులు హెచ్‌ఆర్‌ఎం) హెచ్‌ అరుణ్‌ కుమార్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.      
► 202122లో 39,654 పోస్టుల భర్తీ.
► ఒక్క వైద్య ఆరోగ్య శాఖలోనే 39,310 పోస్టుల్లో నియామకాలు పూర్తి.
► గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ఈ ఒక్క ఏడాదిలో పూర్తి. 
► 16.5 శాతం పోస్టులను, అంటే సుమారు 8 వేల పోస్టులు ఇంకా భర్తీ చేయాల్సి ఉంది.
► ఇందులో 1,198 పోస్టులు వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నాయి.   

మరిన్ని వార్తలు