రైతుల ఆదాయం రెట్టింపు కావాలి: సీఎం జగన్‌

10 Sep, 2020 16:33 IST|Sakshi

సాక్షి, అమరావతి :ఈ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వల్ల రైతులు తమ ఉత్పత్తులు దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రైతు తన పంటను అమ్ముకోవాలంటే జనతా బజార్లు అందుబాటులోకి రావాలి. రైతు భరోసా కేంద్రాలు ఫంక్షనింగ్‌లోకి రావాలని తెలిపారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతు భరోసా కేంద్రాల పక్కన దాదాపు రూ.6 వేల కోట్లతో మల్టిపర్పస్‌ ఫెసిలిటీస్‌ ఏర్పాటుపై చర్చ జరిపారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఈ – మార్కెటింగ్‌  మల్టిపర్పస్‌ ఫెసిలిటీస్‌ ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలు అన్నీ కూడా ఆప్కాబ్‌ ద్వారా నాబార్డ్‌కు పంపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. (చక్కని వసతులు.. ఇంగ్లిష్‌ మాటలు)

ఆర్‌బీకేలను బలోపేతం చేసేందుకు తగిన మౌలిక సదుపాయాలు ఉండాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ మెటీరియల్, సీడ్స్, ఫర్టిలైజర్స్ అన్ని నాణ్యతగా ఉండాలన్నారు.. రైతు భరోసా కేంద్రాల వద్ద మొత్తం 13 రకాల సదుపాయాల కల్పన. అవీ.. గోదాములు, డ్రైయింగ్‌ ప్లాట్‌ఫామ్, కలెక్షన్‌ సెంటర్స్, కోల్డ్‌ రూమ్‌లు – స్టోరేజిలు, కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, అసేయింగ్‌ ఎక్విప్‌మెంట్, జనతా బజార్లు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, సెలక్టెడ్‌ గ్రామాల్లో ఆక్వా ఇన్‌ఫ్రా, సెలక్టెడ్‌ గ్రామాల్లో క్యాటిల్‌ షెడ్స్, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, (ప్లాస్మా దానం చేసిన ప్రిన్సిపల్‌ సెక్రటరీ)

ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు:  
ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పీఏసీ) ను మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జరిపిన సమీక్షలో పీఏసీఎస్‌ల ముందున్న సవాళ్ళు, పరిష్కార మార్గాలపై చర్చించారు. ఈ సందర్భంగా గోదాముల వద్దే జనతా బజార్లు ఏర్పాటు చేయడంపై అనుకూలతలు, ప్రతికూలతలపై అధ్యయనం చేసి నివేదిక సిద్దం చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. పీఏసీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. దీనిపై ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై ఆర్థికశాఖ అధికారులతో సమన్వయం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. .

ఈ–క్రాపింగ్‌:
పంటల ఈ–క్రాపింగ్‌ వల్ల వాటికి సంబంధించిన సమగ్ర సమాచారం నమోదవుతుందని తెలిపిన వైఎస్‌ జగన్‌ దాని వల్ల పంటలకు బీమా ప్రీమియమ్‌ చెల్లింపుతో పాటు, వాటికి గిట్టుబాటు ధర కల్పన, పంట నష్టం జరిగితే పరిహారం చెల్లింపు వంటివి ఎంతో సులభతరం అవుతాయని తెలిపారు. అలాగే పలు అనేక అంశాలపై చర్చించిన సీఎం వైఎస్‌ జగన్‌ ఈ కింది విధంగా పేర్కొన్నారు. (అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే:​ కేంద్రం)

రైతులు–సంక్షేమం:
రైతులకు వీలైనంత వరకు లబ్ది పొందేలా చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి పెట్టాలి. రైతుల ఆదాయం రెట్టింపు కావాలి. ఆ ప్రక్రియలో ఈ–మార్కెట్‌ ప్లాట్‌ఫామ్స్‌ అందుబాటులోకి రావాలి.ప్రతీ అంశం కూడా ఒకదానికొకటి కనెక్ట్‌ కావాలి. రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గాలి. మరోవైపు వారి పంటలకు తగిన గిట్టుబాటు ధరలు రావాలి. అప్పుడే వారు సంతోషంగా జీవించగలుగుతారు. ఆ దిశలో ఏ విధంగా రైతలకు మేలు జరుగుతుందో ఆ విధానాలను అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోండి. ఆసరా, చేయూత పధకాలు కూడా మెజార్టీ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయి. మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తాం. (అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నాం : వైఎస్ జ‌గ‌న్‌)

డైరీ రంగం:
కేవలం పాల ధర పెంచినంత మాత్రాన రైతులకు పూర్తి ప్రయోజనం కలగదు. దానికి అనుబంధంగా చాలా ఉన్నాయి. అందుకే ఆ దిశలో ప్రభుత్వం అమూల్‌ సంస్థతో ఒప్పందం చేసుకుంది. మహిళలకు ఉపాధి కల్పించడం, వారికి ఆదాయం పెంచడం కోసం పలు సంస్థలతో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. ఉపాధి అవకాశాలు కోరుతూ ఇప్పటికే లక్షకు పైగా మహిళల నుంచి దరఖాస్తులు వచ్చాయి.

నాణ్యమైన విద్యుత్‌ సరఫరా:
క్వాలిటీ పవర్‌ ఇవ్వాలంటే మీటర్లు ఉండాలి. అప్పుడే ఫీడర్లపై భారం ఎంతో కూడా తెలుస్తుంది. ప్రభుత్వమే నేరుగా రైతుకు ప్రత్యేక అకౌంట్లలో డబ్బు జమ చేస్తుంది. అందువల్ల ఎక్కడా రైతులకు విద్యుత్‌ బిల్లుల సమస్య ఉండదు. వారిపై ఒక్క రూపాయి కూడా భారం పడదు. వచ్చే 30 ఏళ్ళ వరకూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదంతా కూడా ఒక విజన్‌తో భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని చేస్తున్న ప్రణాళిక. విజన్‌ అన్న దానికి ఉదాహరణ: నాడు శ్రీశైలం, నాగార్జున సాగర్‌ వంటి ప్రాజెక్టులను కేవలం కొన్ని వేల కోట్ల రూపాయలతోనే కట్టారు. అదే ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ.55 వేల కోట్లు ఖర్చవుతున్నాయి. ఇదే ప్రాజెక్టు మరో 10 ఏళ్లు ఆలస్యం అయితే ఖర్చు రెండింతలు పెరుగుతుంది. అందుకే భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు పనులు వేగంగా పూర్తి చేస్తున్నాము.

గోదాముల నిర్మాణం:
 గోదాముల నిర్మాణాన్ని ఎప్పుడు ప్రారంభించాలి?. ఎప్పుడు పూర్తి చేయాలి?. బడ్జెట్‌ నిధులు వంటి అంశాలపై సమగ్ర నివేదిక సిద్దం చేయాలి. ఆ ప్రణాళికలో జనతా బజార్లను, ఆక్వా రంగాన్ని కూడా కలపండి.

ఈ–మార్కెటింగ్‌: 
ఈ–మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ ఏర్పాటుపై మరింత దృష్టి పెట్టండి. ఈ మార్కెటింగ్‌ ఫ్లాట్‌ఫామ్‌ వచ్చే ఖరీఫ్‌ నాటికి సిద్దం చేయాలి. జనతా బజార్లు, షెడ్యూలింగ్, సెకండరీ ప్రాసెసింగ్‌కు సంబంధించి వెంటనే తగిన ప్రణాళిక సిద్ధం చేయాలి. ఆ తర్వాత పంటలకు కనీస మద్దతు ధరల (ఎమ్మెస్పీ)పై కసరత్తు చేయాలి. 

రెవెన్యూ రికార్డులు: 
2016లో గత ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌ (ఆన్‌లైన్‌ రికార్డులు) పేరుతో రికార్డులను తారు మారు చేశారని, ఇష్టానుసారం పేర్లు మార్చేశారని సమావేశంలో అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడ్డి ప్రస్తావించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన పేరుతో ఆ పని చేశారని ఆయన పేర్కొన్నారు.  దీనిపై స్పందించిన సీఎం వైయస్‌ జగన్, ఈ అంశాన్ని రానున్న స్పందన సమీక్ష ఎజెండాలో చేర్చి, కలెక్టర్లకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీఎస్‌ నాగిరెడి, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య, అగ్రికల్చర్, మార్కెటింగ్‌ శాఖ స్పెషల్‌ కమీషనర్‌ పిఎస్‌ ప్రద్యుమ్న, అగ్రికల్చర్‌ స్పెషల్‌ కమిషనర్‌ అరుణ్‌కుమార్, నాబార్డు సీజీఎం ఎస్‌కే జన్నావర్‌తో పాటు, వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు