ఈనెల 28న ‘వైఎస్సార్‌ జలకళ’ ప్రారంభం

22 Sep, 2020 20:20 IST|Sakshi

చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు

సాక్షి, విజయవాడ: రైతు సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సన్న, చిన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్వించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ జలకళ’ కార్యక్రమాన్ని ఈనెల 28న ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో అర్హులైన రైతులందరు గ్రామ సచివాలయాల్లో గానీ, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సమాచార కమిషనర్‌ విజయ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. పాదయాత్రలో భాగంగా సీఎం జగన్‌ రైతులకు ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు వీలుగా రూపొందించిన ‘వైఎస్సార్‌ జలకళ’ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా బోర్లు తవ్విస్తామని పేర్కొన్నారు. (చదవండి: ఎస్జీటీ ఉద్యోగార్థులకు ఏపీ శుభవార్త)

అదే విధంగా హైడ్రలాజికల్‌, జియోఫిజికల్‌ సర్వేల ఆధారంగా ఆయా ప్రదేశాల్లో బోర్ల తవ్వకం చేపడతారని, ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి పారదర్శకంగా సాగుతుందని స్పష్టం చేశారు.ఇక దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అర్హులైన రైతులను ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన సమాచారాన్ని, వివరాలను ఎప్పటికప్పుడు ఎస్‌ఎంఎస్‌ ద్వారా వారికి తెలియజేస్తామన్నారు. అదే విధంగా బోర్లు తవ్వే పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తామని, నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసిన తర్వాతే చెల్లింపులు జరుపుతామని విజయ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

ఇక సెప్టెంబరు 28న సీఎం జగన్‌ సచివాలయంలో ఆన్‌లైన్‌ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఆరోజు నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలవుతుందని వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. కాగా ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టి వారి ఆకాంక్షలు, సమస్యల పరిష్కారానికి అనుకూలంగా నవరత్నాలతో మేనిఫెస్టో రూపొందించిన వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తన హామీలన్నీ నెరవేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు