ఇళ్ల పట్టాలపై ప్రశంసలు.. సీడీ ఆవిష్కరించిన సీఎం జగన్‌

24 Dec, 2020 18:38 IST|Sakshi

ఇళ్ల పట్టాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట

పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, పీటీ ఉష ప్రశంసలు

సాక్షి, అమరావతి : రేపు (శుక్రవారం) జరగబోయే ఇళ్ల పట్టాల పంపణీ యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ మహిళా సాధికారతకు పెద్దపీట అంటూ ప్రముఖులు కొనియాడుతున్నారు. ఇళ్ల పట్టాల పంపిణీపై పలురంగాలకు చెందిన మహిళా ప్రముఖులు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ సీడీని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి తయారు చేయగా.. దీనిని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతులు మీదగా గురువారం సాయంత్రం ఆవిష్కరించారు. ఇళ్ల పట్టాల పంపిణీపై పీవీ సింధు, కరణం మల్లేశ్వరి, పీటీ ఉష, సుధామూర్తి, అపోలో సంగీతరెడ్డి పద్మావతి వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ జమున, ఇంటర్నేషనల్ జస్టిస్ మిషన్ ఫ్రీడ్ హాగ్ యూనిసెఫ్ యస్మిన్ ఆలీ, కర్ణాటక ఉమెన్స్ కమిషనర్ చైర్‌పర్సన్‌ ఒడిశా చైర్‌పర్సన్, మణిపూర్ చైర్‌పర్సన్, ఎంపీ నవనీత్‌ కౌర్ హోంమంత్రి సుచరిత, ఎమ్మెల్యే రోజా సంతోషం వ్యక్తం చేస్తూ సీడీలో వారి అభిప్రాయాలను చెప్పారు. (పులివెందుల రుణం ఎప్పటికీ తీరనిది‌)

నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా డిసెంబర్‌ 25న రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల స్థలాల పంపిణీ కోసం 30,68,281 మంది అర్హులను అత్యంత పారదర్శకంగా ఎంపిక చేసి సచివాలయాల నోటీసు బోర్డుల్లో జాబితాను పొందుపరిచారు. అర్హుల్లో ఏ ఒక్కరికీ ఇంటి స్థలం రాలేదనే మాట వినిపించరాదని సీఎం వైఎస్‌ జగన్‌ పలుమార్లు స్పష్టం చేశారు. ఏవైనా కారణాలతో ఎక్కడైనా అర్హుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో లేకపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఇలా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. 90 రోజుల్లోగా ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి స్థలాలు కేటాయిస్తామని ప్రకటించింది. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రాష్ట్రవ్యాప్తంగా 66,518 ఎకరాల భూమిని సేకరించి లేఔట్లు వేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. చివరిలో దరఖాస్తు చేసుకుని అర్హులుగా ఎంపికైన 80 వేల మంది కోసం వచ్చే నెల 10లోగా స్థల సేకరణతోపాటు ప్లాట్ల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. స్థలాల పంపిణీతోపాటు 15 లక్షల ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ కోసం ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి కావచ్చాయి.

ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు : బొత్స
ఇళ్ల పట్టాల పంపిణీపై రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో మాట్లాడారు. రేపు పేదల సొంతింటి కల నెరవేర్చే రోజుఅని అన్నారు. తొలుత 30 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు. తొలివిడతలో 15 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేపడతామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం తూర్పు గోదావరి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. ‘ఇంత పెద్దఎత్తున పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం చరిత్రలో ఇదే తొలిసారి. 300 ఎస్‌ఎఫ్‌టి ఇళ్లను ఒక్క రూపాయికే అందిస్తున్నాం. స్థలం ఉండి పాకలో ఉండే పేదలకు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందిస్తాం. 15.60 లక్షల ఇళ్లకు రూ.1.80 లక్షల చొప్పున లబ్ధిదారులకు ఇస్తాం. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 17 వేల కొత్త టౌన్‌షిప్‌లు వస్తాయి. రూ.23,538 కోట్ల విలువైన భూమిని పేదలకు అందిస్తున్నాం. రాజకీయాలకు తావులేకుండా లబ్ధిదారుల ఎంపిక జరిగింది. చంద్రబాబు కోర్టులకు వెళ్లి అడ్డుకోవాలని చూశారు’ అని అన్నారు. (పట్టాల పండుగకు చురుగ్గా ఏర్పాట్లు)

మరిన్ని వార్తలు