‘వైఎస్సార్‌ బీమా పథకం’ ప్రారంభం

21 Oct, 2020 12:05 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: పెద్ద సంఖ్యలో సంక్షేమ పథకాలతో ప్రజా ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్‌ మరో కీలక ముందడుగు వేసింది. నిరుపేద కుటుంబాలకు కొండంత అండగా నిలిచేందుకు వైఎస్సార్‌ బీమా పథకాన్ని ప్రారంభించింది. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఈ పథకాన్ని ప్రారంభించారు. ‘వైఎస్సార్‌ బీమా పథకం’  ద్వారా బియ్యం కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరనుంది. కుటుంబ పెద్దకు జీవన భద్రత కల్పించేందుకు తీసుకొచ్చిన ఈ బీమా పథకం ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. కోవిడ్‌ వల్ల ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ నిరుపేద కుటుంబాలకు మేలు చేయాలన్న సంకల్పంతో వైఎస్సార్‌ బీమా పథకాన్ని అమలు చేసినట్టు సీఎం జగన్‌ తెలిపారు.
(చదవండి: ఏపీ: తుడాలో మరో 13 మండలాల విలీనం)

ఆయన మాట్లాడుతూ.. ‘నిరుపేదల కోసం వైఎస్సార్‌ బీమా పథకం తెచ్చాం. కేంద్రం తప్పుకున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం భరిస్తుంది. ఏడాదికి రూ.510 కోట్లు ప్రీమియం చెల్లిస్తున్నాం. ఈ పథకంతో 1.41 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. గ్రామ సచివాలయాల్లో ఇన్సూరెన్స్‌ జాబితా పెడతాం. ప్రమాదాల్లో మరణించిన, వైకల్యం కలిగిన కుటుంబాలకు బీమా కవరేజీ ఉంటుంది. 18-50 ఏళ్ల మధ్య వారు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు బీమా. సహజ మరణానికి రూ.2లక్షల బీమా. ప్రమాదవశాత్తు పాక్షిక వైకల్యం కలిగితే రూ.1.50 లక్షల బీమా. 51-70 ఏళ్ల మధ్య ఉన్నవారు మరణిస్తే రూ.3లక్షలు బీమా. ప్రమాదవశాత్తు చనిపోయినవారి కుటుంబాలకు తక్షణం రూ.10వేలు అందిస్తాం.  గ్రామ సచివాలయం నుంచే రూ.10వేలు ఇస్తాం’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు