జీవనాడికి సహకరించండి

30 Mar, 2023 05:07 IST|Sakshi
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం జగన్‌

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు అడ్‌హక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలని విభజన హామీల నోడల్‌ ఏజెన్సీ అయిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షాకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన జరిగి తొమ్మి­దేళ్లయినా ప్రధాన సమస్యలు అలాగే ఉన్నా­యని, వాటిపై దృష్టిసారించాలని కోరారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి మేలు జరుగు­తుందని వివరించారు. బుధవారం ఢిల్లీ పర్య­టనకు వచ్చిన ఆయన రాత్రి సుమారు 40 నిమి­షాల పాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్రంలో పలు పెండింగ్‌ అంశా­లపై సుదీర్ఘంగా చర్చించారు. ‘అశాస్త్రీయ విభ­జన వల్ల ఏపీకి ఆర్థికంగా, ఆదాయాల పరంగా, అభివృద్ధి పరంగా, వివిధ సంస్థల రూపేణా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ నష్టాల నుంచి కాపాడేందుకు పార్లమెంట్‌ సాక్షిగా విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. అది జరిగి తొమ్మిదేళ్లు కావొస్తున్నా రాష్ట్రానికి నెరవేర్చాల్సిన అనేక అంశాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. వీటిపై వెంటనే దృష్టి సారించాలి’ అని సీఎం కోరారు. ఇంకా అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లిన అంశాలు ఇలా ఉన్నాయి. 

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అనంతరం అధికారిక నివాసానికి వెళ్తున్న సీఎం జగన్‌ 

వేగం పెరగాలంటే నిధులివ్వాలి
► అనూహ్య వరదల కారణంగా పోలవరం డయా ఫ్రం వాల్‌ దెబ్బతింది. ఆ ప్రాంతంలో చేయాల్సిన మరమ్మతులకు రూ.2,020 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని డీడీఆర్‌ఎంపీ అంచనా వేసింది. ఈ సొమ్ములు వెంటనే విడుదల చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్ప­టికే సొంత ఖజానా నుంచి రూ.2,600.74 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్లుగా ఈ సొ­మ్ము పెండింగ్‌లో ఉంది. వెంటనే చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలి.

పోలవరం ప్రా­జెక్టు అంచనాలను టెక్నికల్‌ అడ్వయిజరీ కమిటీ రూ.55,548 కోట్లుగా నిర్ధారించింది. ఈ మొత్తానికి వెంటనే ఆమోదం తెలపాలి. తాగునీటి సరఫరా అంశాన్ని కూ­డా పోలవరం ప్రాజెక్టులో భాగంగా చూ­డాలి. ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్‌­వారీ నిబంధనలను సడలించాలి. ముంపు బాధితులకు వీలైనంత త్వరగా పరిహారం ఇవ్వాలి. డీబీటీ పద్ధతిలో ఈ సహాయం అందిస్తే జాప్యాన్ని నివారించవచ్చు. ఈ నేపథ్యంలో పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి అడహాక్‌గా రూ.10 వేల కోట్లు మంజూరు చేయాలి. 

► 2014–15 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రీసోర్స్‌ గ్యాప్‌ ఫండింగ్‌ కింద పెండింగ్‌లో ఉన్న రూ.36,625 కోట్లు వెంటనే విడుదలయ్యేలా చూడాలి. 

► రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కన్నా ముందున్న ప్రభుత్వం పరిమితికి మించి రుణాలు వాడు­కుందన్న కారణంతో ఇప్పుడు ఆంక్షలు విధించారు. నిబంధనల ప్రకారం ఇచ్చి­న రుణ పరిమితిని కూడా తగ్గించారు. 2021–22లో రూ.42,472 కోట్ల రుణ పరిమితి కల్పించి, తదుపరి కాలంలో రూ.17,923 కోట్లు తగ్గించారు. ఈ విష­యంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలి.

► తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు, 2014 జూన్‌ నుంచి 2017 జూన్‌ వరకు సరఫరా చేసిన విద్యుత్‌కు సంబంధించి రూ.7,058 కోట్లు రావాల్సి ఉంది. వీటిని వెంటనే ఇప్పించాలి. 

► జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల ఎంపికలో హేతు బద్ధత పాటించక పోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. పీఎంజీకేఏవై కార్యక్రమం కిందకు రాని, 56 లక్షల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా రేషన్‌ ఇవ్వడం వల్ల దాదాపు రూ.5,527 కోట్ల భారాన్ని మోయాల్సి వస్తోంది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ విజ్ఞప్తి సరైనదేనని నీతి ఆయోగ్‌ కూడా నిర్ధారించింది. ఈ నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం నెలకు వినియోగించని రేషన్‌ దాదాపు 3 లక్షల టన్నులు ఉంటుంది. ఇందులో 77 వేల టన్నులు రాష్ట్రానికి కేటాయిస్తే సరిపోతుంది. దీనిపై దృష్టి సారించాలి. 

► రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామంటూ పార్లమెంటు సాక్షిగా కేంద్రం హామీ ఇచ్చింది. దీని వల్ల రాష్ట్రానికి గ్రాంట్లు, పన్ను రాయితీలు లభిస్తాయి. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. పెద్ద ఎత్తున పరిశ్రమలు రావడమే కాకుండా, సేవా రంగం విస్తరిస్తుంది. స్వయం శక్తి దిశగా రాష్ట్రం అడుగులేసేందుకు తోడ్పడు­తుంది. అందువల్ల రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాం. 

► కొత్తగా కేంద్రం మంజూరు చేసిన మూడు మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తంగా రాష్ట్రంలో 14 మాత్రమే ఉన్నాయి. మిగిలిన 12 కాలేజీలకు వీలైనంత త్వరగా అను­మతులు మంజూరు చేయాలి. (జిల్లాకు ఒక కాలేజీ చొప్పున మాత్రమే కేంద్రం సాయం చేస్తుంది.. రాష్ట్రంలో మరో రెండు కాలేజీలు అదనం) ఈ కాలేజీలకు సంబంధించిన ప­నులు అత్యంత వేగంగా ముందుకు సా­గుతున్నాయి. వీటికి సంబంధించి కేంద్రం తగిన విధంగా సహాయ పడాలి. 

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం
ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం జగన్‌కు వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజ­యసాయిరెడ్డి నేతృత్వంలో ఎంపీలు మి­థున్‌­రెడ్డి, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, వే­మిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వంగా గీత, తలారి రంగయ్య, శ్రీకృష్ణదేవరాయలు, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, అనూరాధ, మాధవి, బీవీ సత్యవతి, ఆర్‌.కృష్ణయ్య, కోటగిరి శ్రీధర్, బీద మస్తానరావులు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. రాత్రి అధి­కారిక నివాసంలో బస చేశారు. గురువారం కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర సింగ్‌ షెకావత్‌ తదితరులతో సమావేశమయ్యే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు