6న ప్రధానితో సీఎం జగన్‌ భేటీ!

4 Oct, 2020 03:23 IST|Sakshi

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలు మోదీ దృష్టికి..

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వివరించేందుకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 6వ తేదీ ఉదయం.. ప్రధాని మోదీతో సమావేశం కానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సమావేశమై రాష్ట్ర విభజనకు సంబంధించి అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని సీఎం కోరిన విషయం తెలిసిందే.

ఇప్పుడు ప్రధాని దృష్టికి కూడా రాష్ట్రానికి సంబంధించిన వివిధ సమస్యలను తీసుకెళ్లి త్వరగా పరిష్కరింపచేయాలని కోరడంతోపాటు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయించాల్సిందిగా సీఎం వైఎస్‌ జగన్‌ కోరనున్నట్లు అధికార వర్గాల సమాచారం. సీఎం జగన్‌ ఐదో తేదీ ఉదయం పులివెందుల వెళతారు. అక్కడ తన మామగారైన ఈసీ గంగిరెడ్డికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తరువాత అక్కడినుంచి బయల్దేరి రాత్రికి ఢిల్లీ చేరుకోనున్నారు.

>
మరిన్ని వార్తలు