స్పీకర్‌ సతీమణికి సీఎం జగన్‌ కితాబు

11 Mar, 2021 20:35 IST|Sakshi

సాక్షి, ఆమదాలవలస: అక్షయపాత్ర పనితీరుపై స్పందించడం బాగుందని, మీరు ‘‘స్టీల్‌ లేడీ ’’అని స్పీకర్‌ తమ్మినేని సీతారాం సతీమణి వాణీసీతారాంను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రశంసించారు. తొగరాం సర్పంచ్‌గా గెలుపొందిన ఆమె స్పీకర్‌తో సీఎంను బుధవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వాణమ్మకు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలో పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. జగనన్న గోరుముద్ద పథకానికి సన్నబియ్యం అందించాలని వాణమ్మ కోరగా, వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

బలసలరేవు బ్రిడ్జి, రింగ్‌ రోడ్ల నిర్మాణాలు,  విద్యా సంస్థల ఏర్పాటు, నారాయణపురం, ఇరిగేషన్‌ పెండింగ్‌ ప్రాజెక్టులు, రెల్లిగెడ్డ పునః ప్రారంభంపై సుదీర్ఘంగా చర్చించారు. మడ్డువలస పనులు సకాలంలో పూర్తయ్యేందుకు నిధులు సమకూర్చాలని స్పీకర్‌ కోరగా సానుకూలంగా స్పందించారు. ఆమదాలవలసలో స్టేడియం నిర్మాణానికి నిధులు సమకూర్చాలని కోరారు. జిల్లాలో అత్యంత ప్రధానమైన ఉద్దానం కిడ్నీ వ్యాధి సమస్య, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టు, వంశధార, నాగావళి నదుల అనుసంధానం మొదలైన అంశాలపై చర్చించినట్లు తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు తీరుపైన, ప్రజల స్పందన, ప్రజల అభిప్రాయాలు చర్చించినట్లు పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు