సాగుకు రూ.లక్షన్నర కోట్లు

15 Jun, 2021 03:19 IST|Sakshi
రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక బుక్‌లెట్‌లతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్,  వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి తదితరులు

రూ.2,83,380 కోట్లతో రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక.. వ్యవసాయ రంగానికి రూ.1,48,500 కోట్ల రుణాలు లక్ష్యం

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో రుణ ప్రణాళికను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

పేదల కాలనీల్లో వసతుల కల్పన, నాడు–నేడుకు బ్యాంకుల సహకారం కావాలి

మహిళా సాధికారత పథకాలు, వ్యవసాయ మౌలిక సదుపాయాలకు సాయం చేయాలి.. కౌలు రైతులకూ ఇతోధికంగా రుణాలివ్వాలి

పంపిణీ లక్ష్యాలను అధిగమించినా కొన్ని అంశాల్లో సమర్థత పెరగాలి

కరోనా విపత్తులోనూ ఈ వృద్ధిని సాధించడంలో బ్యాంకుల పాత్ర మరువలేనిది 

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్లు సమకూర్చేందుకు కొత్తగా నిర్మిస్తున్న 17 వేలకుపైగా కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బ్యాంకులు సహకారం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. విద్య, వైద్య–ఆరోగ్య రంగంలో నాడు–నేడు ద్వారా మౌలిక సదుపాయాల కల్పన, గ్రామాల్లో వ్యవసాయ అనుబంధ రంగాల్లో మౌలిక వసతులు, మహిళా సాధికారత కోసం చేపట్టిన వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాలకు బ్యాంకులు సహాయ సహకారాలు అందించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. కౌలు రైతులకు ఇతోధికంగా రుణాల మంజూరుపై దృష్టి సారించాలని బ్యాంకర్లకు సూచించారు.

రుణాల పంపిణీ లక్ష్యాల కన్నా అధికంగా చేపట్టినా అగ్రి ఇన్‌ఫ్రా, వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహాలు, విద్య అంశాల్లో రుణాల మంజూరు పెరగాల్సి ఉందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ అధ్యక్షతన సోమవారం క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ 215వ సమావేశం జరిగింది. 2021 – 22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.2,83,380 కోట్లతో వార్షిక రుణ ప్రణాళికను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,48,500 కోట్ల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధారించారు.

వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, సెర్ప్‌ సీఈవో రాజాబాబు, రాష్ట్ర ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ వి.బ్రహ్మానందరెడ్డి, నాబార్డు సీజీఎం సుధీర్‌కుమార్‌ జన్నావర్‌తో పాటు వివిధ బ్యాంకులకు చెందిన ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆర్‌బీఐ జీఎం యశోదాబాయి హాజరయ్యారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ..


వృద్ధిలో బ్యాంకుల పాత్ర మరువలేనిది
కోవిడ్‌తో ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనూహ్య పరిస్థితులు తలెత్తాయి, వైరస్‌ ఉధృతిని అడ్డుకునేందుకు కర్ఫ్యూ లాంటి నియంత్రణలు అమలు చేస్తున్నాం. కర్ఫ్యూ పొడిగించడం వల్ల ఆర్ధికంగానూ పెనుభారం పడింది. అయినప్పటికీ రుణాల పంపిణీలో నిర్దేశించుకున్న లక్ష్యాల కన్నా అధికంగానే చేపట్టాం. ప్రాధాన్యత రంగాల్లో 105 శాతం, వ్యవసాయ రంగంలో 114.16 శాతం లక్ష్యాలను చేరుకున్నాం. ఈ వృద్ధిని సాధించడంలో బ్యాంకుల పాత్ర మరువలేనిది. కానీ కొన్ని అంశాల్లో బ్యాంకుల సమర్థత పెరగాల్సి ఉంది. అగ్రి ఇన్‌ఫ్రా, వ్యవసాయ అనుబంధ రంగాలు, గృహాలు, విద్య అంశాల్లో పెరగాల్సి ఉంది.

స్కూళ్లు, ఆస్పత్రుల అభివృద్ధి..
ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులలో నాడు – నేడు కింద పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టాం. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాం. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంతోపాటు సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లు సమాజానికి భారం కాదు. ప్రైవేట్‌ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలు తిరిగి వస్తున్నారు. పాఠశాలల్లో ఇది ఉద్యమంలా సాగుతోంది. తొలిదశలో 15,650 స్కూళ్లను నాడు – నేడు కింద అభివృద్ధి చేశాం. ఇప్పుడు రెండో దశ కింద పనులు చేపట్టి సుమారు 16 వేల స్కూళ్లను బాగు చేస్తున్నాం. స్కూళ్లలో మౌలిక సదుపాయలను గణనీయంగా మెరుగుపర్చుతున్నాం. 
 

మనకు మహా నగరాలు లేకపోవడంతో..
బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి టైర్‌ – 1 నగరాలు మన రాష్ట్రంలో లేవు. అత్యుత్తమ వైద్యం కోసం ఆ నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. అందుకనే మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు గ్రామ స్ధాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ నుంచి పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు మొదలుకుని టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ అభివృద్ధి పనులు చేపట్టాం. 16 కొత్త మెడికల్‌ కాలేజీలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక టీచింగ్‌ ఆస్పత్రి ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టాం. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రులు, నిపుణులైన వైద్యుల సేవలను పార్లమెంటు నియోజకవర్గ స్ధాయిలో ప్రజలకు అందుబాటులో తెస్తున్నాం.

వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు
అన్నదాతలకు సొంత ఊరిలోనే విత్తనాల నుంచి విక్రయాల దాకా అన్ని సేవలను అందించేందుకు గ్రామ స్ధాయిలో రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చాం. దాదాపు 10 వేలకు పైగా ఆర్బీకేలను ఏర్పాటు చేశాం. ప్రతి రెండు వేల జనాభాకు ఒక ఆర్బీకేను పెట్టాం. నాణ్యమైన, ధృవీకరించిన విత్తనాల దగ్గరనుంచి, పండించిన పంటను అమ్మేంత వరకూ రైతుకు చేదోడు వాదోడుగా ఆర్బీకేలు నిలుస్తాయి. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నాం. ఆర్బీకేల ద్వారా గ్రామ స్ధాయిలో అగ్రి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను మెరుగుపర్చేందుకు గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు సహా అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో సెకండరీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నాం.

మహిళా సాధికారితలో మూడు పథకాలు..
మహిళా సాధికారితకు పెద్దపీట వేస్తూ అనేక చర్యలు తీసుకున్నాం. వరుసగా నాలుగు సంవత్సరాల పాటు చేయూత, ఆసరా పధకాల ద్వారా అదుకుంటున్నాం. లబ్ధిదారులైన మహిళలకు స్థిరంగా నాలుగేళ్లపాటు చేతిలో డబ్బులు పెడుతున్నాం. మహిళలు వారి పిల్లలను తమతో పాటు పనికి తీసుకెళ్లకుండా స్కూళ్లకు పంపించేలా స్ఫూర్తి నింపేందుకు తొలిసారిగా అమ్మ ఒడి కింద ఏటా డబ్బులు కూడా ఇస్తున్నాం. ఈ మూడు పథకాలు మహిళా సాధికారితలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

17 వేలకు పైగా కొత్త కాలనీల నిర్మాణం..
కొత్తగా 17 వేల గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీలను నిర్మిస్తున్నాం. తద్వారా 28.30 లక్షల ఇళ్లను పేదల కోసం నిర్మించబోతున్నాం. సోషల్‌ ఆడిట్‌ నిర్వహించి ,గ్రామ సచివాలయాల ద్వారా పారదర్శక పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశాం. ఈ ఏడాది 15.60 లక్షలకుపైగా ఇళ్లను ఈ 17 వేల కాలనీల్లో తొలివిడతలో నిర్మిస్తున్నాం. వచ్చే ఏడాది మరో 12.08 ఇళ్లను నిర్మించబోతున్నాం. 

కాలనీల్లో మౌలిక సదుపాయాలు
ఈ కాలనీలు మురికివాడలుగా మారకూడదు. అందుకనే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, ఇతర సోషల్‌ ఇన్‌ఫ్రాను కూడా కల్పిస్తున్నాం. రానున్న మూడేళ్లలో దీనికోసం దాదాపుగా రూ.34 వేల కోట్లు ఖర్చు చేస్తాం. ఈ అంశాల్లో బ్యాంకుల సహకారం కావాలి. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణం ద్వారా ఈ 17 వేల కాలనీలను అన్ని వసతులతో సుందరంగా తీర్చిదిద్దుతాం.

రీ స్టార్ట్, నవోదయం..
ఎంఎస్‌ఎంఈల కోసం రీ స్టార్ట్, నవోదయం కార్యక్రమాలను తెచ్చి రుణాల పునర్‌ వ్యవస్థీకరణ కార్యక్రమం చేపట్టాం. కోవిడ్‌ సమయంలో వాటికి చేయూతనిచ్చి నడిపించాల్సిన అవసరం ఉంది.

కౌలు రైతులకు రుణసాయం
కౌలు రైతులకు రుణాల సదుపాయంపై  కూడా దృష్టిపెట్టాలని బ్యాంకులను కోరుతున్నా. వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా. గ్రామాల స్థాయిలో ఆర్బీకేలున్నాయి. ఇ– క్రాపింగ్‌ కూడా గ్రామ సచివాలయాల స్థాయిలోనే చేస్తున్నాం. ప్రతి కార్యక్రమం పారదర్శకంగా చేస్తున్నాం. వీటిని దృష్టిలో ఉంచుకుని కౌలు రైతులకు రుణాలపై బ్యాంకులు మరింత దృష్టి సారించాలని కోరుతున్నా.

అడ్డంకులు ఎదురైనా సంక్షేమం ఆగలేదు..
– ముఖ్యమంత్రి జగన్‌ దార్శనిక పాలనతో టాప్‌ 5 రాష్ట్రాల్లో ఏపీ
– రాష్ట్రంలో లక్షలాదిగా పేదల ఇళ్ల నిర్మాణాలు.. కౌలు రైతులను ఆదుకుందాం
– ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్, యూనియన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌ రాయ్‌
కోవిడ్‌ విపత్తు సమయంలో ప్రజలకు చేయూతనిస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు చర్యలు తీసుకున్నారని ఎస్‌ఎల్‌బీసీ చైర్మన్, యూనియన్‌ బ్యాంకు ఎండీ, సీఈవో రాజ్‌కిరణ్‌ రాయ్‌ పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశానికి ఆయన వర్చువల్‌ విధానంలో హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి దార్శనిక పాలనతో సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలపై 2020 సంవత్సరానికిగాను నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్‌ అత్యుత్తమ 5 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని ప్రశంసించారు. దీనికి ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్‌తో పలు అడ్డంకులు ఎదురైనా ప్రజలను ఆదుకునే సంక్షేమ పథకాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం పక్కకు వెళ్లకపోవడం గుర్తించదగ్గ అంశమన్నారు. పేదల కోసం జగనన్న కాలనీల పేరుతో ఆంధప్రదేశ్‌ ప్రభుత్వం లక్షలాది ఇళ్లను నిర్మిస్తోందని, ఇది బ్యాంకులకు మంచి అవకాశమని పేర్కొన్నారు. కౌలు రైతులను ఆదుకోవడంపై బ్యాంకులు దృష్టి సారించాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో సేవలను అందించడంపై బ్యాంకుల బ్రాంచీలు దృష్టి పెట్టాలన్నారు. ఆత్మనిర్భర్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలను ప్రకటించిందని, ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టి లక్ష్యాలను అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వ్యాక్సినేషన్‌లో బ్యాంకు సిబ్బందికి ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.

లక్ష్యాన్ని మించి రుణాలు
– 2020–21లో ప్రాథమిక రంగం లక్ష్యం రూ.1,87,550 కోట్లు కాగా 105.3 శాతం లక్ష్య సాధన. రూ.1,96,982 కోట్ల మేర రుణ వితరణ. 
– వ్యవసాయరంగంలో 114.16 శాతం లక్ష్య సాధన. రూ.1,28,660 కోట్ల లక్ష్యానికి గానూ రూ.1,46,879 కోట్లు రుణాల మంజూరు.
– ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.39,600 కోట్లకుగానూ రూ.40,312 కోట్ల మేర రుణాలు.
అనుకున్న లక్ష్యాన్ని దాటి 101.8 శాతం మంజూరు.
– నాన్‌ ప్రయార్టీ రంగం కింద రూ.64.050 కోట్లకుగానూ రూ.90,652 కోట్ల మేర మంజూరుతో 141.53 శాతం రుణాలు.

2021 – 22 వార్షిక రుణ ప్రణాళిక ఇలా
– 2021 – 22 రాష్ట్ర వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.2,83,380 కోట్లు
– వ్యవసాయ రంగ రుణాల లక్ష్యం రూ.1,48,500 కోట్లు (54 శాతం)
– మొత్తంగా ప్రాథమిక రంగానికి రూ.2,13,560 కోట్ల రుణాలు లక్ష్యం (వార్షిక రుణ ప్రణాళికలో ఇది 75.36 శాతం)

బ్యాంకులపై ఒత్తిడి తగ్గింది
– ఇప్పుడు బ్రాంచ్‌ల వద్ద ధర్నాలు లేవు: బ్రహ్మానందరెడ్డి
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బ్యాంకింగ్‌ రంగానికి మంచి వాతావరణం సృష్టించారని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. రైతు భరోసాతోపాటు  సకాలంలో బీమా పరిహారం రైతులకు అందుతోందన్నారు. చేయూత, ఆసరాతోపాటు పలు పథకాలు లబ్ధిదారులకు చేరుతుండటంతో బ్యాంకర్లపై ఒత్తిడి తగ్గిందన్నారు. రెండు మూడేళ్ల క్రితం పలు బ్రాంచ్‌ల వద్ద ధర్నాలు జరిగేవని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌  దూరదృష్టితో అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. గర్భిణిల నుంచి అంతిమ దశ వరకు ఈ కోవలో ఉన్నాయని చెప్పారు. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, ఇళ్లపై ముఖ్యమంత్రి తీసుకున్న శ్రద్ధ ప్రశంసనీయమని, ఇవన్నీ బ్యాంకింగ్‌ రంగానికి విలువ జోడిస్తున్నాయని చెప్పారు. ముఖ్యమంత్రి కాంక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రణాళిక త్వరలోనే సాకారమవుతుందన్నారు.

>
మరిన్ని వార్తలు