కూ యాప్‌ ద్వారా ప్రజలకు మరింత చేరువగా సీఎం జగన్‌

4 Aug, 2021 19:30 IST|Sakshi

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖుల బాటలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా కూ యాప్‌ ద్వారా ప్రజలకు మరింత చేరువ కానున్నారు. ఈ వివరాలను యాప్‌ ప్రతినిధులు ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు.  భారత మైక్రో బ్లాగింగ్, సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అయిన కూ యాప్‌...  వినియోగదారులకు స్థానిక భాషలలో సైతం ఇంటరాక్ట్‌ అయ్యే అవకాశం కల్పిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రితో పాటు సీఎంఓ కార్యాలయం,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ కూడా ఈ సోషల్‌ వేదికపై తమ అధికారిక ఖాతాలను ప్రారంభించాయి.

ఇకపై తెలుగులోనే సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ప్రజలతో ఇంటరాక్ట్‌ అవుతారని, ప్రజలు తమ సీఎంతో https://www.kooapp.com/profile/ysjagan ద్వారా చేరువ కావచ్చునని యాప్‌ ప్రతినిధులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ సీఇఓ రాధాకృష్ణ, సహ వ్యవస్థాపకులు మయాంక్‌ బిడావక్తలు మాట్లాడుతూ సీఎం వైఎస్‌ జగన్‌ తమ సోషల్‌ వేదిక ద్వారా ప్రజలతో ఇంటరాక్ట్‌ అవుతుండడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి ఇది ఎంతో ఉపయుక్తమైన అంశమని అభిప్రాయపడ్డారు. సినీనటులు తనికెళ్ల భరణి, భాజాపా నేత విజయశాంతి, ఎల్బీ శ్రీరాం, సినీ నటి ఈషారెబ్బా, అనుష్క శెట్టి, నాగశౌర్య తదితరులు కూడా కూ యాప్‌లో తాజాగా ఖాతా తెరిచారన్నారు.

మరిన్ని వార్తలు