తాడేపల్లి: డిప్యూటీ మేయర్లపై సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే ప్రత్యేక ఆర్డినెన్స్ ద్వారా ఇద్దరు డిప్యూటీ మేయర్లు, ఇద్దరు వైస్ ఛైర్మన్ల నియామకాన్ని చేపట్టనున్నారు. ఇందుకోసం మున్సిపల్ చట్టాన్ని సవరించనుంది. ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత ఈ నెల 18న యథాతథంగా మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక పురపాలక ఎన్నికల్లో ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీ మొత్తం కార్పొరేషన్లను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. 75 పురపాలక సంఘాలు, 11 కార్పోరేషన్లను గెలుచుకొని అఖండ విజయం సాధించింది.ఏపీ చరిత్రలో ఇంతవరకు ఒకే పార్టీకి ప్రజలు పట్టం కట్టడం ఇదే తొలిసారి.
ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రజలు జై కొట్టడంతో.. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ.. ఇలా మూడు ప్రాంతాల్లోనూ వైఎస్సార్ సీపీ ఆధిక్యం కొనసాగడం విశేషం. దీంతో మూడు రాజధానులకు ప్రజలు మద్దతిచ్చినట్లు స్పష్టమవుతోంది. ఇక నగర పాలక సంస్థల్లో తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ.. మున్సిపాలిటీలల్లోనూ బోర్లా పడింది. కనీసం ఒక్కటి కూడా గెలుచుకోలేకపోయింది. ఇక జనసేన, బీజేపీ, వామపక్ష పార్టీలు అసలు పత్తా లేకుండా పోయాయి.
చదవండి : (మున్సిపల్ ఎన్నికల చరిత్రలో 'ఫ్యాన్' తుపాన్)
(AP Municipal Elections Results: వైఎస్సార్ సీపీ సరికొత్త రికార్డు)