వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ప్రారంభం

17 Nov, 2020 12:15 IST|Sakshi

పంటల కొనుగోలుకు రూ. 3,200 కోట్లు కేటాయించాం: సీఎం జగన్‌

సాక్షి, తాడేపల్లి: రైతు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మంగళవారం ఈ పథకాన్ని వర్చువల్‌గా ప్రారంభించారు. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నామని అన్నారు. 14.58 లక్షల రైతుల ఖాతాల్లో 510 కోట్ల రూపాయలకు పైగా జమ చేసినట్టు తెలిపారు. అక్టోబర్‌లో దెబ్బతిన్న పంటలకు కూడా పెట్టుబడి రాయితీ విడుదల చేసినట్టు వెల్లడించారు. నెల రోజుల్లోపే 132 కోట్ల రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేస్తున్నామని, ఈ ఖరీఫ్‌లో పంట నష్టాలపై ఇప్పటివరకు పూర్తి ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లింపులు జరిపినట్టు సీఎం పేర్కొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘రైతులకు ఎంత చేసినా తక్కువే.18 నెలల్లోనే 90 శాతానికిపైగా హామీలు నెరవేర్చాం. రైతుభరోసా కింద 13,500 రూపాయలు ఇస్తున్నాం. పంట రుణాలపై రైతులకు వడ్డీ రాయితీ పూర్తిగా చెల్లిస్తున్నాం. రుణమాఫీ వాగ్దానాన్ని ఎలా అటకెక్కించారో గతంలో మనం చూశాం. గత ప్రభుత్వం సున్నవడ్డీపై పెట్టిన 1180 కోట్ల రూపాయల ఆ బకాయిలన్నింటినీ మేమే చెల్లించాం. ఏ సీజన్‌లో పంట నష్టపోతే.. అదే సీజన్‌లో రైతులను ఆదుకుంటున్నాం. నెల రోజుల్లోపే రూ.132 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేశాం. అర్హత ఉండి అందకపోతే.. మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు. రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తున్నాం. పగటిపూటి ఉచితంగా 9 గంటల విద్యుత్‌ ఇస్తున్నాం. రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. 147 ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. పంటల కొనుగోలుకు 3,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. ఈ నెల 26న ప్రకాశం, చిత్తూరు, వైఎస్‌ఆర్‌ జిల్లాలో మొదటి విడత పాలసేకరణలో భాగంగా బల్క్‌ మిల్క్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నాం’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు