ఉపాధి హామీ పనుల్లో రికార్డు సృష్టించాం: సీఎం జగన్‌

16 Mar, 2021 15:15 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమూల్‌ సంస్థతో కలిసి గ్రామీణ ప్రాంతాల్లో విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎన్నికలు కారణంగా చాలా రోజులగా కలెక్టర్లతో సమావేశం కాలేకపోయానని, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియలో ఆరు రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందని తెలిపారు. అదికూడా ముగిస్తే.. ఇక వ్యాక్సినేషన్, పరిపాలన, అభివృద్ధి కార్యక్రమాలమీద దృష్టిపెట్టే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. 

ఉపాధి హామీ పనులు, ఇళ్లపట్టాలు, స్కూళ్లు, అంగన్‌వాడీ సెంటర్లలో నాడు – నేడు, మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు, మెడికల్‌కాలేజీలు, ఆర్‌ అండ్‌ బి, వైయస్సార్‌ బీమా, జగన్నతోడు, వైయస్సార్‌ చేయూత, వైయస్సార్‌ ఆసరా ప్రగతి, రబీ–2020, ఖరీఫ్‌–2021 పంటల కొనుగోళ్లు, జగనన్న విద్యా దీవెన , వాలంటీర్లకు సత్కారం, వైయస్సార్‌ సున్నా వడ్డీ రైతులకు, వైఎస్సార్‌ సున్నా వడ్డీ స్వయం సహాయ సంఘాలకు, జగనన్న వసతి దీవెన కార్యక్రమాలపై సీఎం సమీక్ష నిర్వహించారు.ఈ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారో ఆయన మాటల్లోనే..

'ఉపాధిహామీ పనుల్లో రికార్డు సృష్టించాం. మార్చి 15 నాటికి 2427 లక్షల పనిదినాలు కల్పించాం. 2525 పనిదినాలు ముగియనున్న ఆర్థిక సంవత్సరంలో ఇవ్వగలిగాం. దాదాపు రూ.6వేల కోట్ల రూపాయలు ఉపాధి హామీ కింద కూలీలకు ఇవ్వగలిగాం. కలెక్టర్లందరికీ అభినందనలు. యుద్ధ ప్రాతిపదికన గ్రామ సచివాలయాల నిర్మాణాలను పూర్తిచేయాలి. మే, 2021 నాటికి అన్ని భవనాలూ పూర్తయ్యేలా చూడాలి. అలాగే ఆర్బీకేలను పూర్తి చేయడంపైనా దృష్టిపెట్టాలి. ఆర్బీకేల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అలాగే వైయస్సార్‌ హెల్త్‌క్లినిక్స్‌ను పూర్తిచేయడంపైనా దృష్టిపెట్టాలి. వీటన్నింటిపైనా కలెక్టర్లు, అధికారులు ప్రత్యేక దృష్టిపెట్టాలి.

పాల రైతులకు మంచి ధర వచ్చేలా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. బీఎంసీ, ఏంఎంసీల నిర్మాణాలపైనా దృష్టిపెట్టాలి.నెలాఖారు కల్లా అన్ని ప్రాంతాల్లో బీఎంసీ, ఏంఎంసీల నిర్మాణం మొదలుపెట్టాలి, ఆగస్టుకల్లా పూర్తిచేయాలి. ఉపాధిహామీ కింద మొదలుపెట్టిన సీసీ రోడ్లు, డ్రైన్స్‌ను వెంటనే పూర్తిచేయాలి. అక్కడక్కడా మిగిలిపోయిన ఇళ్లపట్టాల పంపిణీని పూర్తిచేయాలి. అలాగే కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వారికి 90 రోజుల్లోగా పట్టాలు ఇవ్వాలి. కచ్చితంగా నిర్ణీత సమయంలోగా అర్హులైన వారికి ఇంటిస్థలం పట్టా అందాలి. కొత్తగా అర్హులుగా గుర్తించిన 11,334 మందికి పట్టాలను కూడా వెంటనే అందించాలి. మిగిలిన దరఖాస్తుల వెరిఫికేషన్‌ కూడా పూర్తిచేయాలి. ఏప్రిల్‌ నుంచి వీరికి అవసరమైన భూముల గుర్తింపు, కొనుగోలు ప్రక్రియలపై దృష్టిపెట్టాలి.

తొలివిడతలో 15.60లక్షల ఇళ్లను నిర్మించబోతున్నాం. దీనికి సంబంధించిన అన్నిరకాల ప్రక్రియలను పూర్తిచేయాలి. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సన్నాహక పనులను ముమ్మరం చేయాలి. లే అవుట్లలో నీళ్లు, కరెంటును వెంటనే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి. ఏప్రిల్‌ 15 కల్లా ఈ లేఅవుట్లలో కరెంటు, నీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలి. ఏప్రిల్‌ 15 నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం అవుతుంది. ప్రతి కాలనీలో ఒక మోడల్‌హౌస్‌ కట్టాలి. తామే ఇళ్లు కట్టుకుంటామన్న వారికి నిర్మాణ సామగ్రిని అందించాలి. పెద్ద మొత్తంలో ప్రభుత్వం నిర్మాణ సామగ్రిని కొనుగోలుచేస్తున్నందున లబ్దిదారులకు తక్కువ ధరకు సిమ్మెంటు, స్టీలు, మెటల్‌ లాంటి నిర్మాణ సామగ్రి లభిస్తుంది, వారికి మేలు జరుగుతుంది. గ్రామ సచివాలయాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, డిజిటల్‌ అసిస్టెంట్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, వాలంటీర్లు.. ఇలా వీరి సేవలను వాడుకోవాలి’ అని సీఎం జగన్‌ ఆదేశించారు.

నాడు – నేడు
‘మొదటి విడత స్కూళ్లలో మార్చి 31 నాటికి పనులు పూర్తికావాలి. 10 రకాల సదుపాయాల నాడు – నేడు కింద స్కూళ్లకు సమకూరుతున్నాయి.పెయింట్‌ పనులపై కాస్త దృష్టిపెట్టాలి. వైయస్సార్‌ ప్రీ ప్రైమరీ స్కూల్స్‌ కింద అంగన్‌వాడీల్లో కూడా నాడు–నేడు పనులు చేపడుతున్నాం. 6ఏళ్లలోపు వయసులో 80శాతం వరకూ మెదడు అనేది అభివృద్ది చెందుతుంది. అందుకనే ఈవయసులో ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టిపెట్టాం. ప్రీ ప్రమైరీ స్కూల్స్‌ పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. కొన్ని చోట్ల భవనాల నిర్మాణకోసం స్థలాలపై దృష్టిపెట్టాలి.అంగన్‌వాడీలకు ఇవ్వనున్న శిక్షణపై అధికారులు దృష్టిపెట్టాలి.ఆర్బీకేల పరిధిలో మల్టీపర్పస్‌ సెంటర్లను పెడుతున్నాం.మల్టీపర్పస్‌ సెంటర్లకోసం 50 సెంట్ల నుంచి ఒక ఎకరం స్థలం వరకూ కావాలి.వీలైనంత త్వరగా భూములను గుర్తించి సంబంధిత శాఖకు అప్పగించాలి. గోడౌన్లు, కోల్డు స్టోరేజీలు, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ ఫాంలాంటి సదుపాయాలు గ్రామాల స్థాయి వరకూ రావాలి. రైతులకు మంచి ధరలు రావాలంటే.. ఈసదుపాయలు రావాలి.రెండో స్థాయిలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో 10–15 ఎకరాల భూమిని గుర్తించాలి.ఫుడ్‌ ప్రాససింగ్‌ కోసం ఈ భూమిని వినియోగిస్తాం

మెడికల్‌కాలేజీల నిర్మాణం
ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక మెడికల్‌కాలేజీని తీసుకు వస్తున్నాం. బోధనాసుపత్రితోపాటు నర్సింగ్‌ కాలేజీ కూడా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.కాలేజీలకు భూములను గుర్తించి, వాటిని సేకరించే పనులు పూర్తిచేయాలి.పులివెందుల, పిడుగురాళ్ల, అమలాపురం, పాలకొల్లు, ఆదోని, మచిలీపట్నంల్లో ఆరు చోట్ల ముందస్తుగా నిర్మాణాలు ఏప్రిల్‌లో మొదలు పెట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం.జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన భూములను సేకరించాలి.దీనిపై కలెక్టర్లు దృష్టిపెట్టాలి.ప్రత్యేక సెల్‌ను ఏర్పాటుచేయాలి' అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

చదవండి : (‘చంద్రబాబుకు దమ్ముంటే విచారణకు సిద్ధం కావాలి’)
(‘భూస్కామ్ చేసిన బాబుకు నోటీస్‌ వస్తే తప్పేంటి’)

మరిన్ని వార్తలు