వాటిని పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోండి: సీఎం జగన్‌

21 Jun, 2022 13:57 IST|Sakshi

తాడేపల్లి:  రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేసేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనుల ప్రగతిపై సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ మేరకు పనులు ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న రోడ్లు, బ్రిడ్జిలు, ఆర్వోబీలు, ఫ్లైఓవర్లను పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

‘వీటికి సంబంధించిన పనులు ఎక్కడా కూడా పెండింగ్‌లో ఉండకూడదు. అత్యంత ప్రాధాన్యత ఇవ్వండి. వేగంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకొని త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కచ్చితంగా ఫలితాలు కనిపించాలి. అసంపూర్తిగా ఉన్న రోడ్లను పూర్తిచేయడమే కాకుండా, గుంతలు లేకుండా రోడ్లను తీర్చిదిద్దాలి.

నివర్‌ తుపాను కారణంగా కొట్టుకుపోయిన ప్రాంతాల్లో కొత్త బ్రిడ్జిల నిర్మాణాన్ని కూడా ప్రాధాన్యతగా తీసుకోవాలి. తుపాను కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో పనులు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. కార్పొరేషన్లు, మున్పిపాల్టీల్లో జులై 15 కల్లా గుంతలు పూడ్చాలి. జూలై 20న ఫొటో గ్యాలరీలు పెట్టాలి. పంచాయతీ రాజ్‌ రోడ్లకు సంబంధించి ఇప్పుడు చేపడుతున్న పనులే కాకుండా, క్రమం తప్పకుండా నిర్వహణ, మరమ్మతులపై కార్యాచరణ సిద్ధంచేయాలి’ అని అధికారులకు స్పష్టం చేశారు. 

కుట్రలు పన్నుతున్నారు..
‘రాష్ట్రంలో అభివృద్ధి పనులు ముందుకు సాగనీయకుండా రకరకాల కుట్రలు పన్నుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుణాలు ఇవ్వకూడదని, కేంద్రం నుంచి డబ్బులు రాకూడదని, కేసుల ద్వారా అడ్డుకోవాలని, తద్వారా అభివృద్ధి పనులు ఆగిపోవాలని ప్రతిపక్షాలు ఒక అజెండాతో పనిచేస్తున్నాయి. అయినా సడలి సంకల్పంతో అడుగులు వేస్తూ సడలని సంకల్పంతో ముందుకుసాగుతున్నాం. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో అభివృద్ధి పనులకు ఎక్కడా కూడా నిధులకు లోటు రాకుండా, చెల్లింపుల సమస్యలేకుండా చూసుకుంటూ ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలను పూర్తిచేస్తున్నాం’ అని సమీక్ష సందర్భంగా సీఎం జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు