సాక్షి, తాడేపల్లి : ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం ఇంటర్నేషనల్ టైగర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 63 పులుల చిత్రాలతో రూపొందించిన పుస్తకాన్ని, పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో అటవీ శాఖ నిర్వహించిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ ఎన్ ప్రతీప్ కుమార్, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శి విజయ్కుమార్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. పులుల సంరక్షణ కోసం తీసుకున్న చర్యలను అధికారులు సీఎం జగన్కు వివరించారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలవల్ల పులుల సంఖ్య పెరిగిందని తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే పులుల సంఖ్య 47 నుంచి 63కి పెరిగిందని పేర్కొన్నారు. ఇక నల్లమలనుంచి శేషాచలం అడవుల వరకూ కూడా అవి ప్రయాణిస్తున్నాయని తెలిపిన అధికారులు.. కడప, చిత్తూరు ప్రాంతాల్లో కూడా పులుల ఆనవాళ్లు కనిపిస్తున్నాయని ముఖ్యమంత్రికి చెప్పారు.
ఈ క్రమంలో.. పులుల సంరక్షణా చర్యలను పటిష్టంగా కొనసాగించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. టైగర్ రిజర్వ్ప్రాంతాల్లో అధికారులకు, ఉద్యోగులకు వాహనాల కొనుగోలుకు ఆయన అంగీకారం తెలిపారు.