Andhra Pradesh: ఏపీలో నవశకం

8 Aug, 2022 03:05 IST|Sakshi
నీతి ఆయోగ్‌ భేటీకి హాజరైన సీఎం వైఎస్‌ జగన్‌ను ఆప్యాయంగా పలుకరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ

వ్యవసాయం, విద్య, పాలన రంగాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు

నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ 

ఆర్బీకేల ద్వారా రైతుల చేయి పట్టుకుని నడిపిస్తున్నాం

మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడేలా విద్యా వ్యవస్థలో మార్పులు

పిల్లలు ఉత్సాహంగా బడికి వెళ్లేలా విప్లవాత్మక చర్యలు

ప్రజల గడప దగ్గరకే సేవలు.. అర్హులందరికీ ఫలాలు.. అవినీతికి తావులేకుండా పారదర్శక పాలన  

అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం, విద్య, పాలన రంగాల్లో చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రైతులను ఆదుకునేందుకు వైఎస్సార్‌ రైతు భరోసా–పీఎం కిసాన్, ఉచిత పంటల బీమా పథకం, సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని రుణాలు, 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ తదితర పథకాలు తీసుకొచ్చామన్నారు. బడికెళ్లడం, చదువు కోవడం అనేది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని తెలిపారు. తల్లిదండ్రుల పేదరికం పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో అమ్మ ఒడి సహా పలు పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు.

వివక్ష, అవినీతికి తావు లేకుండా అర్హులైన వారందరికీ పథకాలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆదివారం రాష్ట్రపతి భవన్‌లోని కల్చరల్‌ సెంటర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన నీతి ఆయోగ్‌ పాలక మండలి ఏడో సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పంటల మార్పిడి, నూనె దినుసులు, పప్పు దినుసుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి, జాతీయ విద్యా విధానం, పాఠశాల విద్య, ఉన్నత విద్య, పురపాలక పాలనపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయం, విద్య, పాలనా రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వివరించారు. ఇందుకు సంబంధించి ఒక నోట్‌ను కూడా సమర్పించారు. సీఎం ప్రసంగంలోని వివరాలు ఇలా ఉన్నాయి. 
నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరైన వివిధ రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

వ్యవసాయానికి అగ్ర స్థానం
► రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ పూర్తిగా వ్యవసాయాధారిత రాష్ట్రంగా మారింది. 62 శాతం మంది ప్రజలు ఈ రంగం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. రాష్ట్ర జీడీపీలో వ్యవసాయ రంగం వాటా 35 శాతం పైనే ఉంది. ఈ రంగం ప్రాముఖ్యత దృష్ట్యా అత్యంత ప్రాధాన్యం ఇస్తూ వివిధ పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. 
► రైతులకు మరింత అండగా నిలుస్తూ.. వారికి భరోసా ఇచ్చేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 10,778 రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే)ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వ్యవసాయ అవసరాలకు ఒన్‌ స్టాప్‌ సొల్యూషన్‌ కింద వీటిని ఏర్పాటు చేశాం. నాణ్యమైన, ధ్రువీకరించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలను ఈ కేంద్రాల ద్వారా అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ఆర్బీకేల ద్వారా రైతులకు తోడుగా నిలుస్తున్నాం. 
► డిజిటిల్‌ టెక్నాలజీని విస్తృతంగా వాడుకుంటూ సీఎం యాప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చాం. మొత్తం పంటల కొనుగోలు ప్రక్రియను రోజు వారీగా ఆర్బీకేల స్థాయిలో ఈ యాప్‌ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. అవసరమైన పక్షంలో ప్రభుత్వం తరఫున పంటల కొనుగోళ్లు చేస్తూ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ అండగా నిలుస్తున్నాం. 
► ఆర్బీకే స్థాయిలోనే ఈ– క్రాప్‌ బుకింగ్‌ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ, వడ్డీ లేని పంట రుణాలు, పంటల కొనుగోలు తదితర వాటిని సమర్థవంతగా అమలు చేయడానికి ఈ–క్రాప్‌ బుకింగ్‌ ఎంతగానో దోహద పడుతోంది. 
► ఆర్బీకేల్లో కియోస్క్‌లను కూడా అందుబాటులో పెట్టాం. రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తదితర వాటిని కియోస్క్‌ల ద్వారా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయొచ్చు. వారి చెంతకే అవన్నీ చేర వేస్తున్నాం. పంటలకు సంబంధించి రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి, సూచనలు చేయడానికి శాస్త్రవేత్తలతో ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్‌ కూడా ఏర్పాటు చేశాం.
► ఆర్బీకే, మండల, జిల్లా స్థాయిలో కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లను ప్రారంభిస్తున్నాం. పంటల మార్పిడి, చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించడం, క్రమంగా సేంద్రియ, సహజ వ్యవసాయ పద్ధతుల వైపుగా రైతులను ప్రోత్సహిస్తున్నాం.

జీఈఆర్‌ పెంపే లక్ష్యం
► విద్యా రంగానికి సంబంధించి బడికి వెళ్లడం, చదువు కోవడం అన్నది చిన్నారుల హక్కుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని సుస్థిర ప్రగతి లక్ష్యాలతో అనుసంధానం చేశాం. పాఠశాల మానేసే విద్యార్థుల శాతాన్ని పూర్తిగా నివారించడంతోపాటు గ్రాస్‌ ఎన్‌ రోల్‌మెంట్‌ రేషియో (జీఈఆర్‌) పెంచేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. 
► ప్రాథమిక విద్యలో దేశ జీఈఆర్‌ నిష్పత్తి 99.21 శాతం కాగా, ఏపీలో ఇది 84.48 కావడం విచారకరం. 2018లో కేంద్ర విద్యా శాఖ విడుదల చేసిన గణాంకాల్లో విద్యా రంగంలో రాష్ట్రం పనితీరు అత్యంత దారుణంగా ఉందని వెల్లడైంది. అందుకే ఈ రంగంలో కీలక అంశాలపై దృష్టి పెడుతూ సమర్థవంతమైన విధానాలను తీసుకొచ్చాం. 
► తల్లిదండ్రుల పేదరికం అన్నది పిల్లల చదువులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమ్మ ఒడి అనే పథకాన్ని అమలు చేస్తోంది. పిల్లలను బడికి పంపిస్తే చాలు, ఏటా రూ.15 వేలు చొప్పున పిల్లల తల్లులకు అందిస్తున్నాం. 75 శాతం హాజరు ఉండాలనే నిబంధనను పరిగణనలోకి తీసుకున్నాం.
► పిల్లలకు పౌష్టికాహారం అందించడానికి మధ్యాహ్న భోజన పథకంలో సమూల మార్పులు తీసుకు వచ్చాం. విద్యా కానుక ద్వారా స్కూలు బ్యాగులు, బై లింగువల్‌ టెక్టŠస్‌ బుక్స్, నోట్‌ పుస్తకాలు, షూ, 3 జతల యూనిఫారం, ఇంగ్లిష్‌ టు తెలుగు డిక్షనరీలు ఇస్తున్నాం. పిల్లలకు మరింత నాణ్యతతో బోధన అందించడానికి నాణ్యమైన పాఠ్యాంశాలతో ఉన్న బైజూస్‌ యాప్‌ కూడా అందిస్తున్నాం. 8వ తరగతి విదార్థులకు ట్యాబ్‌ కూడా ఇవ్వబోతున్నాం. 

55,555 స్కూళ్లలో నాడు–నేడు
► పిల్లలు మంచి వాతావరణంలో విజ్ఞానాన్ని సముపార్జించడానికి మన బడి నాడు – నేడు కింద 55,555 స్కూళ్లలో రూ.17,900 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. నీటి సదుపాయం ఉన్న టాయిలెట్లు, పరిశుభ్రమైన తాగు నీరు, పెయింటింగ్, విద్యుదీకరణ, ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు, పిల్లలకు.. టీచర్లకు ఫర్నిచర్, గ్రీ¯Œన్‌  చాక్‌ బోర్డులు, ఇంగ్లిష్‌ ల్యాబ్, కాంపౌండ్‌ వాల్, కిచెన్‌ షెడ్, అదనపు తరగతి గదులు, డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్, ఇతరత్రా కావాల్సిన మరమ్మతులు అన్నీ చేపడుతున్నాం. మొత్తం మూడు విడతల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మొదటి విడత కింద ఇప్పటికే 15,715 స్కూళ్లను తీర్చిదిద్దాం. ఇందులో డిజిటల్‌ తరగతుల ఏర్పాటు కూడా పూర్తి చేస్తాం. 
► ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్‌ భాషకు ఉన్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చక్కటి పునాది వేసే కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. ప్రపంచ స్థాయి పోటీని ఎదుర్కొనేలా పిల్లలను తీర్చిదిద్దడానికి అన్ని స్కూళ్లను మ్యాపింగ్‌ చేసి,  3వ తరగతి నుంచే సబ్జెక్టు వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తున్నాం. 
► ఉన్నత విద్య స్థాయిలో కూడా ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. కేవలం విద్య ద్వారానే పేదిరికం నుంచి బయట పడతారని గట్టిగా విశ్వసిస్తూ విద్యా దీవెన పథకం ద్వారా 100 శాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నాం. గత మూడేళ్లలో 21.56 లక్షల మంది విద్యార్థులు దీని ద్వారా లబ్ధిపొందారు. విద్యార్థులు భోజనం, హాస్టల్‌ ఖర్చు కోసం వసతి దీవెన అమలు చేస్తున్నాం. 
► అండర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో సంప్రదాయ కోర్సులను ఉద్యోగాలు కల్పించేలా తీర్చిదిద్దాం. నైపుణ్యాలను అభివృద్ధి చేస్తున్నాం. 1.6 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్‌ ఇప్పటికే ముందుకు వచ్చింది. కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రతికూల ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు మంచి ఫలితాలిస్తున్నాయి. 2018–19లో క్యాంపస్‌ల ద్వారా 37 వేల మందికి ఉద్యోగాలు వస్తే, 2020–21లో 69 వేలు వచ్చాయి. 

పారదర్శక పాలనతో ప్రజలకు చేరువ
► ప్రజల గడప వద్దకే సేవలందించే విధానాన్ని అమలు చేస్తూ.. చివరి వరకూ అత్యంత పారదర్శకంగా సేవలను అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. 11,162 గ్రామ సచివాలయాలు, 3,842 వార్డు సచివాలయాలు ఇప్పుడు రాష్ట్రంలో పని చేస్తున్నాయి. 
► ప్రతి 50–100 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించాం. తద్వారా వారికి ఉపాధితో పాటు.. అవినీతి లేకుండా, పారదర్శకంగా ప్రజలకు సేవలు అందిస్తున్నాం. మరింత సమర్థవంతంగా లక్ష్యాలు సాధించడానికి అధికార వికేంద్రీకరణ, జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ చేపట్టాం. వివక్ష, అవినీతికి తావులేకుండా అర్హులైన వారందరికీ ఆయా పథకాల ఫలాలు అందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.    

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు