పాతపాటి సర్రాజు భౌతికకాయానికి సీఎం జగన్‌ నివాళులు

18 Feb, 2023 14:58 IST|Sakshi

పెద అమిరం(ప.గో. జిల్లా):  గుండెపోటుతో మరణించిన క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పాతపాటి సర్రాజు భౌతికకాయానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. శనివారం మధ్మాహ్నం పశ్చిమగోదావరి జిల్లాలోని పాతపాటి సర్రాజు నివాసానికి చేరుకున్న సీఎం జగన్‌.. సర్రాజు భౌతికకాయానికి ఘనమైన నివాళులు అర్పించారు.  ఈ క్రమంలోనే పాతపటి సర్రాజు కుటుంబ సభ్యులను సీఎం జగన్‌ పరామర్శించారు. పాతపాటి సర్రాజు మరణవార్త తెలిసిన వెంటనే ఆయన మృతి పట్ల ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన సీఎం జగన్‌..  ఆపై వెంటనే పశ్చిమగోదావరి జిల్లాలోని సర్రాజు నివాసానికి బయల్దేరి వెళ్లారు.

కాగా, పాతపాటి సర్రాజు గుండెపోటుతో మృతిచెందిన సంగతి తెలిసిందే. 1954లో కాళ్ల మండలం జక్కవరం గ్రామంలో జన్మించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ద్వారా సర్రాజు  రాజకీయాల్లోకి వచ్చారు. కోపల్లె సహకార సంఘం అధ్యక్షుడిగా, ఆకివీడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా ఆయన పని చేశారు. 2004లో ఉండి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి గెలిచి వైఎస్సార్‌ హయాంలో తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి ఆయన అడుగుపెట్టారు.

17 జులై 2021న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా నియమితులయ్యారు. 14 ఆగష్టు 2021న ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం పోలవరం నియోజక వర్గ పరిశీలకులుగా  సర్రాజు ఉన్నారు.

మరిన్ని వార్తలు