Ongole: సీఎం వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం

7 Oct, 2021 14:04 IST|Sakshi

సాక్షి, ప్రకాశం జిల్లా: తాడేపల్లి నుంచి ఒంగోలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. హెలిప్యాడ్ వద్ద సీఎంకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీస్‌ ట్రైనింగ్‌ కాలేజీ (పీటీసీ)లో హెలికాప్టర్‌ దిగిన దగ్గర నుంచి పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వరకు దారి పొడవునా మహిళలు, పార్టీ శ్రేణులు సీఎం వైఎస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలికారు. సీఎం వచ్చే దారితోపాటు, ఒంగోలు నగరం మొత్తం భారీ స్థాయిలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఒంగోలు పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ ఆసరా సభా వేదిక వద్దకు చేరుకున్న సీఎం.. అక్కడ పొదుపు మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. అనంతరం వేదిక వద్ద లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత తన ప్రసంగం అనంతరం వైఎస్సార్‌ ఆసరా రెండో విడత కింద లబ్ధిదారులకు డబ్బులు జమ చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు

‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం రెండవ విడత మొత్తాన్ని ప్రభుత్వం నేడు డ్వాక్రా గ్రూపు సభ్యులైన మహిళల ఖాతాల్లో నేరుగా జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో 2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి పొదుపు సంఘాల పేరిట ఉన్న అప్పును నాలుగు విడతల్లో మహిళలకు అందజేసే ఈ పథకానికి సీఎం వైఎస్‌ జగన్‌ గత ఏడాది శ్రీకారం చుట్టి.. తొలి విడత సొమ్ము జమ చేసిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగా గురువారం నుంచి రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 7.97 లక్షల స్వయం సహాయక సంఘాల్లో సభ్యులుగా ఉన్న 78.76 లక్షల మంది మహిళలకు రూ.6,439.52 కోట్లు పంపిణీ ప్రారంభం కానుంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక నుంచి దాదాపు 20 వేల మంది లబ్ధిదారుల సమక్షంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత ఏడాది తొలి విడతగా చెల్లించిన రూ.6,318.76 కోట్లు కూడా కలిపితే పొదుపు సంఘాల అప్పునకు సంబంధించి రూ.12,758.28 కోట్లు మహిళలకు అందజేసినట్టవుతుంది.
చదవండి:
స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేయండి

మరిన్ని వార్తలు