వైఎస్సార్‌ బీమా: రూ. 254 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్‌‌

31 Mar, 2021 12:09 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అనుకోని విపత్తు కారణంగా ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబాలకు వైఎస్సార్‌ బీమా పథకం కింద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ఆర్థిక సహాయం అందజేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదును నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఈ మేరకు 2020 అక్టోబర్‌ 21న పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఈ తరహాలో మరణించిన 12,039 మంది వ్యక్తుల కుటుంబ సభ్యులకు రూ. 254 కోట్లు చెల్లించనున్నారు. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో నిర్వహించే కార్యక్రమాల్లో స్థానిక మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

కాగా ఈ పథకం కోసం చేపట్టిన సర్వేలో అర్హులుగా గుర్తించినప్పటికీ, పేర్లు నమోదు చేసుకోకముందే మరణించిన వారి కుటుంబాలకు కూడా బీమా సొమ్మును చెల్లించడానికి సీఎం వైఎస్‌ జగన్‌ మానవతాదృక్పథంతో నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగా PMJJBY, PMSBY నుంచి 50 శాతం వాటా లేనప్పటికీ పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే పథకం అమలు చేస్తుంది. సహజ మరణానికి రూ.2లక్షలు, ప్రమాద మరణం, శాశ్వత అంగవైకల్యానికి రూ.5లక్షలు(18-50 వయస్సు), రూ.3లక్షలు (51-70 వయస్సు) బీమా... అలాగే పాక్షిక శాశ్వత అంగవైకల్యానికి రూ.1.5 లక్షల బీమా అందించనున్నారు.

12,039 కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకుంటున్నాం సీఎం జగన్‌ పేర్కొన్నారు. అర్హత ఉన్నా, బ్యాంకుల్లో నమోదు కాని కుటుంబాలకు అండగా ఉంటున్నామన్నారు. ఏటా రూ.510 కోట్లతో 1.41 కోట్ల కుటుంబాలకు ఉచిత బీమా ఇస్తున్నామన్నారు. కేంద్రం సాయం లేకున్నా బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోందని పేర్కొన్నారు. గతంలో ఉండే గ్రూప్ ఇన్సూరెన్స్‌ను కూడా తొలగించారని, వ్యక్తిగతంగా అకౌంట్‌ ఉన్న వారికే బీమా సౌకర్యం కల్పించారన్నారు. వాలంటీర్ల ద్వారా కొత్తగా 61 లక్షల మంది అకౌంట్‌లను ప్రారంభించామన్న సీఎం.. ఆ కుటుంబాలకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చిందన్నారు.

చదవండి: విజయవాడ రిటైనింగ్‌ వాల్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన 

మరిన్ని వార్తలు