ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలి: సీఎం జగన్‌

3 Feb, 2023 12:04 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అర్హులైన విద్యార్థులందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన కింద నిధులను ప్రభుత్వం అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ఉచిత విదేశీ విద్యను అందిస్తున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో టాప్‌-200 వర్సిటీల్లో ఉచిత ఉన్నత విద్య అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్థులకు మొదటి విడతలో సాయంగా రూ. 19.95 కోట్లను బటన్‌ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి జమ చేశారు. 

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. జగనన్న విదేశీ విద్యా దీవెన రాష్ట్ర చరిత్రలో సువర్ణ అధ్యాయం. మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. పేద విద్యార్థులు ప్రపంచంలోనే టాప్‌ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల పేద విద్యార్థులకు అవకాశం ఇచ్చాము. పేదల చదువుకు పేదరికం అడ్డుకాకూడదు. పిల్లలకు మనం ఇ‍చ్చే ఆస్తి చదువే. విదేశీ వర్సిటీల్లో 213 మంది విద్యార్థులు అ‍డ్మిషన్లు పొందారు. వీరికి తొలివిడతగా రూ.19.95 కోట్ల సాయం అందిస్తున్నాము. ప్రపంచ వేదికపై దేశం, ఆంధ్ర రాష్ట్ర జెండా ఎగురవేయాలి. మన పిల్లలు ప్రపంచ స్థాయిలో రాణించాలని ఆకాక్షించారు. 

చిత్తశుద్ధితోనే పరిస్థితులు మార్చాలనే తాపత్రయం నుంచి ఈ ఆలోచన వచ్చింది. మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది. విద్య మీద పెట్టే ప్రతి పెట్టుబడి కూడా మానవ వనరుల మీద పెట్టినట్టే. కుటుంబాల తలరాతలే కాదు.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి తలరాతలు కూడా మారుస్తాయి. మహాత్మ గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, అంబేద్కర్‌ వంటి వాళ్లు పెద్ద యూనివర్శిటీల నుంచి వచ్చినవారే. అందుకే పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నామని అన్నారు. 

గతంలో కేవలం రూ. 10లక్షలు మాత్రమే ఇచ్చేవారు. 2016-17కి సంబంధించి రూ.300 కోట్లు బకాయిలు పెట్టారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు, మిగిలిన విద్యార్థులకు గరిష్టంగా రూ.కోటి వరకు సాయం అందిస్తున్నాము. ట్యూషన్‌ ఫీజు వందశాతం రీయింబర్స్‌మెంట్స్‌ ఇస్తున్నామన్నారు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే సీఎంఓలో అధికారులు అందుబాటులో ఉంటారు. ఇబ్బంది ఉంటే వెంటనే కాల్‌ చేయండి. ప్రతీ విషయంలో మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు