YSR Kapu Nestham Scheme: రెండో ఏడాది కూడా వైఎస్సార్‌ కాపు నేస్తం అమలు

22 Jul, 2021 21:07 IST|Sakshi

సాక్షి, అమరావతి:  ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ‘వైఎస్సార్‌ కాపు నేస్తం’ పథకాన్ని అమలు చేసింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన అర్హులైన 3,27,244 మంది పేద మహిళలకు రూ.490.86 కోట్ల ఆర్థిక సాయాన్ని గురువారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయం నుంచి నేరుగా లబ్ధిదారుల ఖతాల్లో డబ్బు విడుదల చేశారు. ఈ మొత్తాన్ని బ్యాంకులు పాత అప్పుల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాల్లో నగదు జమ చేశారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే...
అక్కచెల్లెమ్మల ఆర్ధిక స్వావలంబననే లక్ష్యం. ఈ రోజు దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. నిరుపేదలుగా ఉన్న కాపు అక్కచెల్లెమ్మలకు ఆర్ధికంగా వాళ్ల కాళ్లమీద నిలబడే పరిస్ధితి రావాలి. వాళ్లకు ఆర్ధిక స్వావలంబన రావాలి అని ఈ పథకాన్ని తీసుకువచ్చాం. వైఎస్సార్‌ చేయూత మాదిరిగానే వైఎస్సార్‌ కాపునేస్తం తీసుకువచ్చాం.


వరుసగా రెండో ఏడాది కాపునేస్తం
రెండో ఏడాది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే.. ప్రతి ఏటా వరుసగా క్రమం తప్పకుండా ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ తోడుగా ఉంటూ ప్రతి సంవత్సరం రూ.15 వేలు చొప్పున 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఇస్తే రూ.75 వేలు అక్కచెల్లెమ్మల చేతిలో ఉంటుంది. తన కాలు మీద తను కచ్చితంగా నిలబడగలుగుతారనే గొప్ప ఆలోచనలోంచి  ఈ పథకం పుట్టింది. ఇందులో మొట్టమొదటిగా చేయూత ద్వారా ప్రతి ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండే కార్యక్రమం చేశాం. రూ.18,750 చొప్పున 45 నుంచి 60 సంవత్సరాల వయస్సులో ఉన్న అక్కచెల్లెమ్మలకు వరుసగా నాలుగేళ్లు పాటు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. 60 యేళ్లు దాటిపోతే వాళ్లకు పెన్షన్‌ వర్తిస్తుంది. వారికి ఈ రూపంలో మేలు జరుగుతుంది. 

45 నుంచి 60 ఏళ్లు మహిళలు వాళ్ల కాళ్లమీద వాళ్లు నిలబడగలుగుతారు అనే దృక్పధంతో అడుగులు ముందుకు వేశాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు తోడుగా చేయూత పథకంలో మల్టీ నేషనల్‌ కంపెనీలతో టై అప్‌ చేసే కార్యక్రమం చేశాం. వాళ్లకు మరింత వ్యాపార అవకాశాలు మెరుగుపర్చాలన్న తపనతో రిలయన్స్, ఐటీసీ, పీ అండ్‌ జీ, హిందుస్తాన్‌ లీవర్, అమూల్‌ వంటి కంపెనీలతో భాగస్వామ్యం చేశాం.ఈ పెద్ద కంపెనీలు చేయగా మిగిలిన వాళ్లందరికీ కూడా ఏటా రూ.15వేలు ఇస్తూ వెళితే వ్యాపార దృక్పథంతో అడుగులు వేసే పరిస్ధితి వస్తుంది. తద్వారా వారు ప్రణాళిక వేసుకోగలుగుతారు. వ్యాపారాలు చేసుకోవాలన్న ఆలోచన వారికి కలుగుతుంది. ఏ నెల్లో ఇస్తున్నాం అన్నది ముందుగానే చెప్తున్నాం, వారిలో భరోసాను కల్పిస్తున్నాం. ప్రభుత్వం మాట చెపితే కచ్చితంగా ఇస్తుందనే నమ్మకం ఎప్పుడైతే ఉంటుందో, తద్వారా ఆర్థికంగా వారు ప్రణాళిక వేసుకోగలుగుతారు.

కుటుంబ బరువు మోసే త్యాగమూర్తులు
అలాంటి కార్యక్రమంలో భాగంగానే  45 నుంచి 60 యేళ్ల వయసులో అత్యంత బాధ్యతాయుతంగా ఉండే అక్క, చెల్లెమ్మల చేతిలో పెడితే అది నేరుగా కుటుంబానికే ఉపయోగపడుతుంది. ఈ వయస్సుల్లో ఉన్నవారు త్యాగమూర్తులు, కుటుంబ బరువు బాధ్యతలను మోస్తున్నవారు. వాళ్లకు మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే వాళ్ల చేతుల్లో నేరుగా డబ్బులు పెట్టే గొప్ప కార్యక్రమానికి నాంది పలుకుతూ వరుసగా రెండో సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నాం.

మేనిఫెస్టోలో చెప్పకపోయినా....
వైయస్సార్‌ కాపు నేస్తం ద్వారా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన 45–60 సంవత్సరాల వయస్సులో ఉన్న ప్రతి అక్క, చెల్లెమ్మకు ఐదేళ్ల కాలంలో రూ.15వేలు చొప్పున రూ.75వేలు నేరుగా వాళ్ల చేతుల్లోనే పెడుతున్నాం. ఈ కార్యక్రమం మన మేనిఫెస్టోలో చేస్తామని చెప్పకపోయినా కూడా ఇది చేస్తే  బాగుంటుందని అమలు చేస్తున్నాం. నిండు మనస్సుతో కాపు అక్క,చెల్లెమ్మలకు మంచి జరగాలని చేపట్టిన కార్యక్రమమిది.

గత ప్రభుత్వ పాలనలో 
ఈ సందర్భంగా మరో విషయం గుర్తు తెచ్చుకోవాలి, మీకు చెప్పాలి. ఇంతకు ముందు గత ప్రభుత్వ పరిపాలనలో ఇదే కాపుల సంక్షేమం కోసం  గతంలో సంవత్సరానికి రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి, కనీసం రూ.400 కోట్లు కూడా ఇవ్వని గత ప్రభుత్వ పరిస్ధితిని ఒక్కసారి గుర్తుచేసుకోమని ప్రతి అక్కకు, చెల్లెమ్మకు విజ్ఞప్తి చేస్తున్నాను. 

ఈ రెండేళ్ల కాలంలో
ఈ రెండు సంవత్సరాల కాలంలో మీ అందరి చల్లనిదీవెనలతో ఏర్పడిన మీ అందరి ప్రభుత్వం, మీ అన్న, తమ్ముడి ప్రభుత్వం అక్షరాలా రూ.12,126 కోట్లు నేరుగా కాపు అక్కచెల్లెమ్మలు, సోదరుల చేతుల్లో పెట్టగలిగాం. ఈ రోజు 3,27,244 మంది అక్కచెల్లెమ్మలకు వైయస్సార్‌ కాపునేస్తం కార్యక్రమంలో బటన్‌ నొక్కిన వెంటనే నేరుగా రూ.490.86 లక్షల రూపాయలు నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవుతాయి. ఈ రెండు సంవత్సరాల్లో అక్షరాల వివిధ పథకాల ద్వారా 59,63,308 మందికి గత ప్రభుత్వం కన్నా ఎక్కువగా 15 రెట్లు మేర రూ. 12,126.78 కోట్లు సహాయం చేశాం. ఈ డబ్బులను పాత అప్పులకు, బకాయిలకు జమచేసుకోవద్దని బ్యాంకులతో ఇప్పటికే మాట్లాడాం. కాపు నేస్తం అనే ఒక్క కార్యక్రమం ద్వారా ఈ రెండు సంవత్సరాల్లో చూస్తే... గత ఏడాది 3,27,349 మందికి రూ. 491.02 కోట్ల మేర లబ్ధి చేకూరింది. రెండేళ్లలో మొత్తంగా దాదాపుగా రూ. 982కోట్లు వారి చేతుల్లోనే పెట్టడం జరుగుతుంది.

వివిధ పథకాలు–లబ్ధి
వివిధ పథకాల కింద ఈ రెండు సంవత్సరాల కాలంలోనే డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌( డీబీటీ), నాన్‌ డీబీటీల ద్వారా 59,63,308 మందికి మేలు జరిగేలా రూ. 12,126.78 కోట్ల మేర కాపులకోసం ఖర్చు చేశాం అని సగర్వంగా తెలియజేస్తున్నాం. ఈ రెండు సంవత్సరాల కాలంలోనే కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల సంక్షేమం కోసం వివిధ పథకాల ద్వారా మన ప్రభుత్వం డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్‌ అంటే నేరుగా వారి అకౌంట్లలోకి పంపించిన కార్యక్రమాల ఖాతాల వివరాలను పరిశీలిస్తే... 

వైఎస్సార్‌ రైతు భరోసా కార్యక్రమం ద్వారా  7,85,700 మంది లబ్ధిదారులకు రూ.2550 కోట్లు ఖర్చు చేశాం.
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక  4,11,331 లబ్దిదారులకు రూ. రూ.2384 కోట్లు.
జగగన్న అమ్మఒడి  3,81,185 మంది లబ్దిదారులుకు  రూ.1143 కోట్లు.
వైఎస్సార్‌ కాపునేస్తం ద్వారా 3,27,349 మంది అక్కచెల్లెమ్మలకు రూ.982 కోట్లు.
వైఎస్సార్‌ ఆసరా ద్వారా  7,04048 మంది అక్కచెల్లెమ్మలకు  రూ.654 కోట్లు ఇవ్వగలిగాం.
జగనన్న విద్యాదీవెన  ద్వారా 1,28,119 మందికి రూ.354 కోట్లు
వైఎస్సార్‌ ఉచిత పంటలబీమా ద్వారా 3,04,451 మంది రైతన్నలుకు రూ.371 కోట్లు 
జగనన్న వసతి దీవెన ద్వారా 96,739 మంది అక్కచెల్లెమ్మలకు రూ.189 కోట్లు.
వైఎస్సార్‌ సున్నావడ్డీ కింద 8,42,854 మంది అక్కచెల్లెమ్మలకు రూ. 202 కోట్లు
రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద 1,71,360 మంది రైతన్నలకు రూ.132 కోట్లు 
వైఎస్సార్‌ బీమా ద్వారా 8151 మంది రైతన్నలకు రూ.132.87 కోట్లు
వైఎస్సార్‌ సున్నావడ్డీ పంట రుణాలు ద్వారా 5,42,523 రైతన్నలకు రూ.102 కోట్లు.
వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం ద్వారా 29957 మంది అన్నదమ్ములకు రూ.84 కోట్లు 
విదేశీ విద్యాదీవెన ద్వారా 533 మందికి రూ.29.45 కోట్లు
డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యఆసరా కింద 37765 మందికి రూ. 22.85 కోట్లు
జగనన్న చేదోడు ద్వారా 14,121 మంది రూ.14 కోట్లు
వైఎస్సార్‌ నేతన్న నేస్తం ద్వారా కూడా 2577 మందికి రూ.12.40 కోట్లు వాళ్ల చేతిలో పెట్టాం. 

ఒక్క రూపాయి అవినీతి, వివక్ష లేకుండానే
నేరుగా బటన్‌ నొక్కి ఆధార్‌ నెంబర్‌తో సహా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా, వివిక్షకు తావులేకుండా పారదర్శకంగా చేశాం. ప్రతి లబ్ధిదారుడికిమేలు జరిగేలా చేశాం. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు జరగాలి, అనర్హత ఉన్నవారికి వెళ్లకూడదన్న లక్ష్యంతో పనిచేశాం. అక్షరాలా 47,88,663 మందికి నేరుగా రూ.9359 కోట్లు ట్రాన్స్‌ఫర్‌ చేశాం. 

నాన్‌ డీబీటీ
నాన్‌ డీబీటీ స్కీంలు తీసుకుంటే... వైఎస్సార్‌ జగనన్న ఇళ్ల పట్టాల కార్యక్రమం ద్వారా 2,56,424 మంది అక్కచెల్లెమ్మలకు రూ.2160 కోట్లతో ఇళ్లపట్టాలు ఇవ్వగలిగాం. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా 1,16,797 మందిని రూ.289 కోట్లతో ఆదుకున్నాం.
వైఎస్సార్‌ సంపూర్ణపోషణ ద్వారా 1,50,800 మంది అక్కచెల్లెమ్మలకు, పిల్లలకు మంచి జరిగేలా రూ.144 కోట్లు ఖర్చు చేశాం. 
జగనన్న గోరుముద్ద ద్వారా 2,84,024 మంది పిల్లలకు రూ.123 కోట్లు ఖర్చుతో మంచి చేశాం. 
జగనన్న విద్యా కానుక ద్వారా 3,66,600 మందికి మరో రూ.50 కోట్లు చేశాం. మొత్తంగా చూస్తే నాన్‌ డీబీడీ విధానంలో 11,74,645 మంది రూ.2766 కోట్లు ఖర్చు చేసాం. 
రెండూ కలిపి చూస్తే ఈ రెండేళ్లలో 59,63,308 మందికి మేలు చేస్తూ... రూ.12126 కోట్లు రూపాయలు వెచ్చించాం. 
దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో మీ బిడ్డగా మీకు అందించగలిగాను. 
అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ప్రతి అడుగూ ముందుకు వేసుకుంటూ వచ్చాం. 
మంచి చేసే విషయంలో ఎక్కడా అబద్దాలు చెప్పలేదు, మోసాలు చేయలేదు. త్వరితగతిన అడుగులు వేస్తూనే మంచి చేస్తున్నాం. 
మీ బిడ్డకు మీ అందరకి చల్లని దీవెనులు ఉండాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

నెల రోజుల గడువు
మరో ముఖ్యమైన విషయం ఈ పథకం ఎవరికైనా, ఎక్కడైనా రాకపోయినా భయపడొద్దు. గ్రామ సచివాలయానికి వెళ్లి మరలా దరఖాస్తు పెట్టుకుంటే వెరిఫికేషన్‌ చేసి నెలరోజుల్లో మరలా అర్హులకి ఈ పధకాన్ని వర్తింపజేస్తాం అని సీఎం తన ప్రసంగం ముగించారు.  అనంతరం కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వైఎస్సార్‌ కాపునేస్తం లబ్ధిదదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసారు. 

ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రవాణా, ఐ అండ్‌ పీఆర్‌ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని), వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్,  బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, ఏపీ స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఆడపా శేషగిరి, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, జక్కంపూడి రాజా, జంగాలపల్లి శ్రీనివాసులు, బీసీ సంక్షేమశాఖ స్పెషల్‌ సీఎస్‌ జి.అనంతరాములు, ఏపీ స్టేట్‌ కాపు వెల్ఫేర్‌ అండ్‌ డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఐ శ్రీనివాస శ్రీనరేష్, ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు