కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం జగన్‌

20 Jan, 2022 19:08 IST|Sakshi

సాక్షి, అమరావతి: ప్రతి జిల్లాకు ఒక ఎయిర్‌పోర్టు ఉండాలన్నది మంచి కాన్సెప్టు అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ ఎయిర్‌పోర్టుకు అనుగుణంగా ప్రణాళికలు ఉండాలని అధికారులను ఆదేశించారు. అన్ని జిల్లాల్లో ఏకరీతిగా విమానాశ్రయాల నిర్మాణం చేపట్టాలని, ఇందుకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు.

బోయింగ్‌ విమానాలు సైతం ల్యాండింగ్‌ అయ్యేలా రన్‌వే అభివృద్ధి చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 6 విమానాశ్రయాల విస్తరణ, అభివృద్ధి పనులతో పాటు, రెండు కొత్త విమానాశ్రాయల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అధికారులకు వివరించారు. విజయనగరం జిల్లా భోగాపురం, నెల్లూరు జిల్లా దగదర్తి విమానాశ్రయాల పనులు త్వరితగతిన పూర్తి కావాలని, ఇందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాలన్నారు. 

నిర్వహణలో ఉన్న విమానాశ్రయాల విస్తరణ పనులను కూడా ప్రాధాన్యతాక్రమంలో చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను సిద్దం చేయలని సూచించారు. నిర్ణీత కాల వ్యవధిలోగా పెండింగ్‌ సమస్యలు పరిష్కారం కావాలని, గన్నవరం విమానాశ్రయం విస్తరణ పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు. రద్దీకి తగినట్లుగా మౌలికసదుపాయాలు, విస్తరణ పనులను వేగవంతం చేయాలని సీఎం జగన్‌ తెలిపారు. 

పోర్టులుపైనా సీఎం జగన్‌ సమీక్ష: 
రాష్ట్రంలో చేపడుతున్న 9 ఫిషింగ్‌ హార్బర్లు, 3 పోర్టులను అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని నిర్మాణం చేపట్టి, పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. భావనపాడు, రామాయపట్నం పోర్టుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని సీఎంకు అధికారులు వివరించారు. 

ఫిషింగ్‌ హార్భర్లు: 
రాష్ట్రంలోని 9ఫిషింగ్‌ హార్భర్లలో తొలిదశలో నిర్మాణం చేపడుతున్న 4ఫిషింగ్‌ హార్బర్లను అక్టోబరు నాటికి పూర్తి చేస్తామని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. తొలిదశలో ఉప్పాడ(తూర్పుగోదావరి), నిజాంపట్నం(గుంటూరు), మచిలీపట్నం(కృష్ణా), జువ్వలదిన్నె(నెల్లూరు) జిల్లాల్లో ఫిషింగ్‌ హార్భర్ల నిర్మాణం, రెండో విడతలో చేపడుతున్న మిగిలిన 5హార్భర్ల నిర్మాణాన్ని నిర్ధిష్ట కాలపరిమితిలోగా నిర్మిస్తామని సీఎంకు అధికారులు తెలిపారు. ఈ 5 ఫిషింగ్‌ హార్భర్లకు త్వరలోనే టెండర్లు ఖరారు చేస్తామని అధికారులు తెలిపారు. ఫేజ్‌ 2లో బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక (విశాఖపట్నం), బియ్యపుతిప్ప (పశ్చిమగోదావరి), ఓడరేవు (ప్రకాశం), కొత్తపట్నం (ప్రకాశం) జిల్లాల్లో ఫిషింగ్‌ హార్భర్లు నిర్మాణం కానున్నాయని అధికారులు సీఎం వైఎస్‌ జగనకు వివరించారు.

ఈ సమీక్షా సమావేశంలో పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి,  సీఎస్‌ సమీర్‌ శర్మ, పరిశ్రమలు, వాణిజ్యశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, సీఎఫ్‌ఎస్‌ఎస్‌ సీఈఓ రవిసుభాష్, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ కె మురళీధరన్‌, ఏపీ ఎయిర్‌పోర్ట్స్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ సలహాదారు వీ ఎన్‌ భరత్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: సీఎం జగన్‌ ప్రత్యేక శ్రద్ధ నన్ను కదిలించింది: కైకాల సత్యనారాయణ 

మరిన్ని వార్తలు