మాస్కుల విషయంలో మరింత కఠినంగా ఏపీ ప్రభుత్వం

12 Jul, 2021 15:51 IST|Sakshi

కోవిడ్‌పై సీఎం జగన్‌ సమీక్ష.. పలు కీలక నిర్ణయాలు

సాక్షి, అమరావతి: కోవిడ్‌ నియంత్రణ చర్యలను కఠినంగా అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం చేపట్టిన సమీక్షా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మాస్క్‌ ధరించకపోతే రూ.100ల జరిమానా కచ్చితంగా అమలు చేసేవిధంగా నిర్ణయం తీసుకున్నారు. దుకాణాల్లో కూడా సిబ్బంది దగ్గర నుంచి వినియోగదారులకు వరకూ మాస్క్‌లు ధరించాల్సిందే. ఉల్లంఘనలకు పాల్పడితే దుకాణాలకు భారీ జరిమానాలతో పాటు అవసరమైతే 2–3 రోజులు దుకాణాలు మూసివేతకు ప్రభుత్వం ఆదేశించింది.

ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఎవరైనా ఫొటో తీసి పంపినా జరిమానాలు విధించే విధంగా దీని కోసం ప్రత్యేక వాట్సాప్‌ నంబర్‌ ఏర్పాటు, రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్‌ కఠినంగా అమలు జరిగే విధంగా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలెవ్వరూ గుమిగూడకుండా కఠిన ఆంక్షలతో పాటు మార్కెట్లు, తదితర చోట్ల కూడా మాస్క్‌లు ధరించాలంటూ ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కెట్‌ కమిటీలు మాస్క్‌లు ధరించేలా చూడాలంటూ ప్రభుత్వం ఆదేశించింది.


డిగ్రీ విద్యార్థులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత
ప్రభుత్వ, ప్రైవేట్‌ టీచర్లకు వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిగ్రీ విద్యార్థులకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని, కోవిడేతర వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సీఎం తెలిపారు. డెంగ్యూ, ఇతర వ్యాధుల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు