Medicine-Health: విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలే లక్ష్యం: సీఎం జగన్‌

12 Apr, 2022 15:04 IST|Sakshi

సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఆసుపత్రుల్లో నూతనంగా ఏర్పాటు చేయనున్న సమాచార కియోస్క్‌ మోడల్‌ను పరిశీలించారు. ఆరోగ్యశ్రీలో మరింత సులువుగా వైద్య సేవలు పొందడం ఇలా అనే విధంగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..

దశాబ్దాలుగా మార్పులకు నోచుకోని విద్య, వైద్యం లాంటి రంగాల్లోని వ్యవస్థలను మార్చాలని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం.
► ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. వాటిద్వారా ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందించడంపై ప్రత్యేక దృష్టిపెట్టాం.
► విద్య, వైద్యం, వ్యవసాయ, గృహనిర్మాణం తదితర కీలక రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు చరిత్రాత్మకం. వైద్య రంగం విషయానికొస్తే.. చరిత్రలో ఎప్పుడూలేని విధంగా వేల సంఖ్యలో పోస్టులను భర్తీచేశాం.
వేల కోట్లను ఈ రంగంపై ఖర్చు చేస్తున్నాం. విలేజ్‌ / వార్డు క్లినిక్స్‌ దగ్గరనుంచి టీచింగ్‌ ఆస్పత్రుల వరకూ కూడా నాడు – నేడు కింద అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
► ఆరోగ్య శ్రీ కింద ఎలాంటి పెండింగ్‌ బిల్లులు లేకుండా ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నాం. ఆరోగ్య ఆసరా కింద రోగులకు.. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయి ఇంటి వెళ్లే సమయంలో డబ్బులు  ఇస్తున్నాం.
ఆరోగ్య శ్రీ కింద చికిత్సల సంఖ్యను గణనీయంగా పెంచాం. 16 టీచింగ్‌ ఆస్పత్రులను తీసుకు వస్తున్నాం.
► ప్రభుత్వ ఆస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలున్న మందులు ఇస్తున్నాం. భారీ మార్పులను ఆశించి, దానికి అనుగుణంగా లక్ష్యాలు పెట్టుకున్నాం.
► అందుకే విద్య, వైద్య సహా కీలక రంగాలను అత్యంత సీరియస్‌గా తీసుకుంటున్నాం. అనుభవం, సమర్థత ఉన్న అధికారులను ఆయా శాఖలకు అప్పగించాం.
ఒక ముఖ్యమంత్రిగా నేను లక్ష్యాలను నిర్దేశిస్తాను. కాని, ఆ లక్ష్యాన్ని అందుకునేందుకు యజ్ఞంలా అధికారులు పనిచేయాలి.
► శాఖాధిపతులు, వారి కింద పనిచేస్తున్న సిబ్బంది ఛాలెంజ్‌గా స్వీకరించాలి. ఆశించిన మార్పుల సాధనకు, లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులుతో పాటు, సిబ్బంది అంతే సీరియస్‌గా పనిచేయాలని సీఎం జగన్‌ స్పష్టం చేశారు.

► రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులను సీఎం వైఎస్‌ జగన్‌కు అధికారులు వివరించారు. డైలీ యాక్టివిటీ రేటు 0.13శాతానికి గణనీయంగా పడిపోయిందని అధికారులు తెలిపారు. 
► ప్రస్తుతం రాష్ట్రంలో పాజిటివ్‌ కేసులు కేవలం 5 మాత్రమే ఉన్నాయని, 4,30,81,428 మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తిచేశామని అధికారులు తెలిపారు.
► 15– 17 ఏళ్ల మధ్య ఉన్నవారికి వందశాతం 2 డోసుల  వ్యాక్సినేషన్‌ పూర్తయ్యిందని, 12 నుంచి 14 ఏళ్ల మధ్య ఉన్నవారికి మొదటి డోసు 94.47 శాతం వ్యాక్సిన్లు వేశామని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. 

►  వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. మే నెలాఖరు నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని సీఎం జగన్‌కు అధికారులు తెలిపారు. 
►  మే నెలాఖరు నాటికి అన్ని నియామకాలు పూర్తిచేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఇందులో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలన్నారు. 
►  ప్రజలకు అందుబాటులో వైద్య సేవలు అందించడానికి పెద్ద సంఖ్యలో డాక్టర్లను నియమిస్తున్నాం. వైద్యులకు ఇచ్చే జీతాల విషయంలో ఎలాంటి రాజీపడకూడదు.
►  ప్రజలకు తప్పకుండా వైద్యుల సేవలు అందుబాటులో ఉండేందుకు గతంలో జీతాలు పెంచుతూ కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆమేరకు వారికి జీతాలు ఇచ్చేలా నిర్ణయాలు తీసుకున్నాం. అందుకనే ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్‌పై నిషేధం విధించామని సీఎం జగన్‌ తెలిపారు.

ఆస్పత్రుల్లో నాడు-నేడు పనులు, విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్‌ నిర్మాణం, కొత్త పీహెచ్‌సీలు, మెడికల్‌కాలేజీల నిర్మాణంపై సీఎం సమీక్ష..
►   నిర్మాణాల్లో ఎక్కడా రాజీపడొద్దని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. వసతులు, సౌకర్యాల విషయంలో ఎక్కడా లోటు రానివ్వొద్దని తెలిపారు.
►   పలాస కిడ్నీ ఆస్పత్రి, కడప సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, అలాగే గిరిజన ప్రాంతాల్లో స్పెషాల్టీ ఆస్పత్రుల నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు.
►   16 మెడికల్‌ కాలేజీల్లో 6 చోట్ల జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయని సీఎంకు అధికారులు తెలిపారు.
►   పులివెందుల, పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్ల, విజయనగరం, అమలాపురం మెడికల్‌ కాలేజీల్లో నిర్మాణాల ప్రగతిని సీఎం జగన్‌కు  అధికారులు వివరించారు. 
►   మిగిలిన చోట్ల మే 15 నాటికల్లా మెడికల్‌ కాలేజీల నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం అధికారులను ఆదేశించారు.
►   కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులపై దృష్టిపెట్టాలని అధికారులకు సీఎం సూచించారు.

►  ఆస్పత్రుల్లో సౌకర్యాలను, సదుపాయాలను పర్యవేక్షించాలని, ఆస్పత్రి నిర్వహణ పరిశుభ్రంగా ఉందా? లేదా? అన్నదానిపై పరిశీలన చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
►  టాయిలెట్ల దగ్గరనుంచి ప్రతి విభాగం పరిశుభ్రంగా ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆరోగ్యశ్రీలో అవసరమైన మేరకు ఇంకా ప్రొసీజర్లను పెంచాలనుకుంటే పెంచాలన్నారు.
► ప్రతిభ ఆధారంగా వాలంటీర్ల మాదిరిగా ఆరోగ్య మిత్రలకు కూడా నగదు ప్రోత్సహకాలు ఇవ్వాలన్నారు. దీనిద్వారా ఆరోగ్య మిత్రల సేవలనూ గుర్తించినట్టు అవుతుందని పేర్కొన్నారు. ఏడాదిలో ఒక రోజు ఎంపిక చేసి, ఆరోజు నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. 

ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్‌ అండ్‌ బీ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌) ముద్దాడ రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌ చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు