ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలి

24 Jul, 2020 13:16 IST|Sakshi

ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

సాక్షి, అమరావతి: పండించిన పంటను అమ్ముకునేందుకు రైతులు కష్ట పడకూడదని, సంబంధిత పంటల విషయంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. దీని కోసం ప్రత్యేక శ్రద్ధ పెట్టి.. వచ్చే సీజన్‌ కల్లా ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. శుక్రవారం ఆయన తాడేపల్లి తన క్యాంపు కార్యాలయంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘‘అరటి, చీనీ, టమోటా రైతులు ప్రతి ఏటా ఆందోళన చెందుతున్నారు. కనీస గిట్టుబాటు ధర రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే.. ఎంత మేర కొనుగోలు చేయాలి, ఎంత మేర ఫుడ్‌ప్రాససింగ్‌కు తరలించాలన్నదానిపై అధికారులు దృష్టిపెట్టాలని’’ సీఎం పేర్కొన్నారు. దీని కోసం ఖర్చు ఎంత అయినా పర్వాలేదు.. కాని సమస్యకు పరిష్కారం ఉండాలని సీఎం జగన్‌ సూచించారు. (రాయలసీమలో నవశకం) 

‘‘ప్రతి ఏటా అరటి, చీనీ, టమోటా, ఉల్లి, నిమ్మలాంటి రైతులు కష్టాలు పడుతున్నారంటూ కథనాలు వస్తున్నాయి. మళ్లీ ఇలాంటి కథనాలు కనిపించకూడదు. ప్రతి ఏటా ఇలాంటివి పునరావృతం కాకూడదు. మిల్లెట్స్‌ ప్రాససింగ్‌పైన కూడా దృష్టిపెట్టండి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌పై ప్రఖ్యాత కంపెనీలతో టై అప్‌ చేసుకోవాలి. ఇబ్బందులు వస్తున్న 7–8 పంటలను గుర్తించండి. వాటిని ప్రాసెసింగ్‌ చేసి... వాల్యూ ఎడిషన్‌ ఏం చేయగలమో ఆలోచనలు చేయండి. ఈ పంటల ప్రాసెసింగ్‌ చేయడానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారో తనకు నివేదించాలని’’ అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.

నెలరోజుల్లోగా దీనికి సంబంధించి కార్యాచరణ పూర్తికావాలన్నారు. అవసరమైన చోట్ల ఆర్బీకేల స్థాయిలోనే ప్రాథమిక స్థాయిలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేయాలి. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అంచనాలు తయారు చేయాలని అధికారులను సీఎం  వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తలు