రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరాలి.. వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం పెంచుదాం: సీఎం జగన్‌

5 Aug, 2022 19:07 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలోని రైతులకు గరిష్ఠ లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వ్యవసాయంపై సమీక్షా సమావేశం నిర్వహించారాయన. ఈ సందర్భంగా.. 

రైతులకు ఎరువులు అందించడంలో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని సంబంధిత మంత్రిత్వశాఖను, అధికారులను ఆయన ఆదేశించారు. అంతేకాదు ఎక్కడ నుంచి ఎలాంటి సమాచారం వచ్చినా పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆర్బీకేల్లో ఉన్న అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రతి రోజూ నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్న సీఎం జగన్‌..  విత్తనాల సరఫరా, ఎరువుల పంపిణీ, వ్యవసాయ ఉత్పత్తులకు అందుతున్న ధరలు తదితర అంశాలపై పర్యవేక్షణ ఉండాలని తెలిపారు. 

ఈ-క్రాప్‌ వందశాతం పూర్తిచేయాలని, వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన భాగస్వామ్యం కానుందని తెలిపారు. రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్న సీఎం జగన్‌.. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపైనా ప్రధానంగా చర్చించారు. డ్రోన్ల వినియోగంపై మాస్టర్‌ ట్రైనర్లను తయారు చేయాలన్న ఆయన.. డ్రోన్ల నిర్వహణ, మరమ్మతుపై శిక్షణ ఇచ్చే దిశగా చర్యలు తీసుకోవాలని అధికారులతో చెప్పారు. అంతేకాదు.. నియోజకవర్గానికి ఒక  ఐటీఐ లేదంటే ఒక పాలిటెక్నిక్‌ కాలేజీలోని విద్యార్థులకు డ్రోన్ల వినియోగం, నిర్వహణ, మరమ్మతులపై సంపూర్ణ శిక్షణ ఇప్పించాలని సూచించారు.

ఇంకా ఈ సమీక్షలో.. 

ఖరీప్ సీజన్ పై సీఎంకు అధికారులు వివరాలు అందించారు
రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కన్నా అధిక వర్షపాతం నమోదు.
ఆగస్టు 3 నాటికి 16.2 శాతం అధిక వర్షపాతం నమోదు.
ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 36.82 లక్షల హెక్టార్ల మేర సాగు విస్తీర్ణం ఉంటుందని అంచనా కాగా, ఇప్పటికే 18.8 లక్షల హెక్టార్లలో పంటలసాగు.

ఈ సందర్భంగా రైతులకు అందుతున్న విత్తనాల నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలని సీఎం జగన్‌, అధికారుల్ని ఆదేశించారు. 

సరిపడా ఎరువుల నిల్వలు ఉన్నాయని తెలిపిన అధికారులు. 
ఆర్బీకేల ద్వారా వీటిని పంపిణీచేస్తున్నామన్న అధికారులు.

నూటికి నూరు శాతం ఈ- క్రాప్‌
 ఈ– క్రాప్‌ వందశాతం పూర్తిచేయాలి.
సెప్టెంబరు మొదటివారంలోగా ఈ– క్రాపింగ్‌ పూర్తిచేయాలి.
ఆర్బీకేల్లోని అగ్రికల్చర్‌ అసిస్టెంట్, రెవిన్యూ అసిస్టెంట్‌లు ఈ ప్రక్రియను పూర్తిచేసేలా చూడాలి. 
రోజువారీగా ఈ ప్రక్రియను నిశితంగా పరిశీలించాలి. 
ఈ–క్రాపింగ్‌ చేసిన తర్వాత భౌతిక రశీదు, డిజిటల్‌ రశీదు ఇవ్వాలని సీఎం జగన్‌ తెలిపారు. 


ఈ– క్రాపింగ్‌ చేసినప్పుడు జియో ట్యాగింగ్‌ కూడా చేస్తున్నామని, వెబ్‌ ల్యాండ్‌తో కూడా అనుసంధానం చేస్తున్నామని అధికారులు వివరించారు. 
 వెబ్‌ ల్యాండ్‌లో ఎక్కడైనా పొరపాట్లు ఉంటే.. వాటిని వెంటనే సరిదిద్దుకుంటూ పోవాలని సీఎం జగన్‌ సూచించారు. 

వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకంతో భాగస్వామ్యం కానున్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన.  రైతులకు గరిష్ట లబ్ధి చేకూర్చేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఆర్బీకేల్లో ప్రతి కియోస్క్‌ పనిచేసేలా చూడాలన్న సీఎం జగన్‌.. వాటికి సవ్యంగా ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉందా? లేదా? అన్నదానిపై నిరంతరం పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశించారు.

వైయస్సార్‌ యంత్రసేవ కింద రైతులకు మరిన్ని పరికరాలు ఇవ్వాలన్న సీఎం జగన్‌.. దీనికోసం అన్నిరకాలుగా సిద్ధంకావాల‍ని అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయశాఖమంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి,  ఏపీ అగ్రిమిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయశాఖ) అంబటి కృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి సాయి ప్రసాద్, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, వ్యవసాయశాఖ కమిషనర్‌ సి హరికిరణ్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: మానవత్వమై నిలిచి..

మరిన్ని వార్తలు