అవినీతి నిర్మూలనపై సీఎం జగన్‌ సమీక్ష

24 Aug, 2020 13:50 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అవినీతి నిర్మూలనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ నీలం సాహ్ని, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఏసీబీ డీజీ పీఎస్సార్ ఆంజనేయులు హాజరయ్యారు. లంచం తీసుకుంటూ పట్టుబడితే నిర్ధిష్ట సమయంలో చర్యలు తీసుకునేందుకు దిశ చట్టం తరహాలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలని ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే 1902కు వచ్చే అవినీతి సంబంధిత అంశాలు ఏసీబీకి చెందిన 14400కు బదిలీతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే ఫిర్యాదులు అనుసంధానంతో పాటు ఎమ్మార్వో, ఎండీవో, సబ్ రిజిస్ట్రార్‌, మున్సిపల్‌, టౌన్‌ ప్లానింగ్ విభాగాల్లో అవినీతిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. 

ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ రివర్స్ టెండరింగ్‌ జరగాల్సిందేనని, టెండర్ విలువ రూ.కోటి దాటితే రివర్స్ టెండరింగ్‌కు వెళ్లాల్సిందేనని ముఖ్యమంత్రి మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా పిన్నాపురం విద్యుత్‌ ప్రాజెక్ట్‌తో పాటు భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ల ప్రాజెక్ట్‌ల విషయంలో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి తేడా స్పష్టం అయిందని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు