గోదావరి వరదలపై సమీక్ష.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..

16 Jul, 2022 10:16 IST|Sakshi

సాక్షి, అమరావతి: గోదావరి వరదలు, సహాయ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. శనివారం ఉదయం అధికారులతో మాట్లాడిన సీఎం.. గోదావరి వరద ప్రవాహం, తాజా పరిస్థితిపై ఆరా తీశారు. సురక్షిత ప్రాంతాలకు తరలింపుపై సీఎంకు అధికారులు వివరాలందించారు. ఎక్కడా కూడా ప్రాణనష్టం ఉండకూడదని  సీఎం స్పష్టం చేశారు. అవసరమైనంత మేర సహాయక బృందాలను వినియోగించుకోవాలన్నారు.
చదవండి: ఆదుకో.. మావయ్యా.. గమనించిన సీఎం జగన్‌ కాన్వాయ్‌ ఆపి.. 

మరో 24 గంటలపాటు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సహాయ శిబిరాల ఏర్పాటు, సౌకర్యాల కల్పనలో తగిన చర్యలు తీసుకోవాలని, సేవలు నాణ్యంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. వరద బాధిత కుటుంబాలకు రేషన్‌ పంపిణీ చేయాలని, యుద్ధ ప్రాతిపదికన అన్నికుటుంబాలకు చేర్చాలన్నారు. ప్రతి కుటుంబానికీ 25 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ బంగాళా దుంపలు, కిలో పామాయిల్, కేజీ ఉల్లిపాయలు అందించాలన్నారు. అలాగే ప్రతి కుటుంబానికి రూ.2 వేలు లేదా వ్యక్తికి రూ.వేయి చొప్పున శిబిరాలు విడిచి వెళ్లేలోగానే పంపిణీ చేయాలని సీఎం తెలిపారు. ఈ పనులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని.. ప్రతి గంటకూ వరద పరిస్థితిపై తనకు నివేదించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.

మరిన్ని వార్తలు