సాక్షి, అమరావతి: ఉద్యోగాలు కల్పించే చదువుల దిశగా కోర్సులు ఉండాలని, ఇందుకోసం ఇప్పుడున్న కోర్సులకు అనుబంధ, ప్రత్యేక కోర్సులు తీసుకు రావాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నత విద్యా శాఖను ఆదేశించారు. విద్యార్థుల్లో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచేందుకు వీలుగా ఇంగ్లిష్పై పట్టు, ప్రావీణ్యం వచ్చేలా గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. జీఆర్ఈ, జీ మ్యాట్ పరీక్షల కోసం మంచి శిక్షణ ఇవ్వాలని స్పష్టం చేశారు.
శుక్రవారం ఆయన ఉన్నత విద్య కార్యకలాపాలపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరగడం కోసమే విద్యా దీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామని తెలిపారు. పూర్తి స్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నామని, వసతి ఖర్చులూ పెట్టుకోలేక చదువులు ఆపేసే పరిస్థితులు ఉండకూడదని ఈ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తద్వారా గతంలో కన్నా గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) పెరిగిన మాట వాస్తవమేనని, అయితే మనం దీంతో సంతృప్తి చెందకూడదన్నారు. జీఈఆర్ 80 శాతానికి పైగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..
చదవండి👉: ప్రజా సంక్షేమం ఆగదు: సీఎం వైఎస్ జగన్
ఎంత మంది పిల్లలున్నా అందరికీ వర్తింపు
ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ
డిగ్రీ కాలేజీల కోసం ప్రత్యేక వ్యవస్థ
రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను జేఎన్టీయూ తరహాలో ఒక ప్రత్యేక యూనివర్సిటీ లాంటి వ్యవస్థ కిందకు తీసుకురావాలి. మంచి పరిజ్ఞానం ఉన్న వారు ఈ ప్రతిపాదిత వ్యవస్థకు నేతృత్వం వహించేలా చూడాలి. డిగ్రీ కోర్సులకు విలువను జోడించాలి. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలనుకునేట్టుగా ఉండాలి. ఏపీలో డిగ్రీ చదివితే.. మంచి జీతాలతో ఉద్యోగాలొచ్చే పరిస్థితి తీసుకురావాలి. – సీఎం వైఎస్ జగన్
బోధన సిబ్బంది భర్తీకి గ్రీన్ సిగ్నల్
టీచింగ్ ఫ్యాకల్టీలో ఎక్కడ ఖాళీలు ఉన్నా వెంటనే భర్తీ చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు. టీచింగ్ స్టాఫ్ నియామకంలో ఎక్కడా సిఫార్సులకు తావు ఉండకూడదని స్పష్టం చేశారు. ఇక్కడ రాజీపడితే విద్యార్థులకు తీవ్ర నష్టం ఏర్పడుతుందని, సమర్థులైన వారిని, ప్రతిభ ఉన్న వారిని టీచింగ్ స్టాఫ్గా తీసుకోవాలని చెప్పారు. వారికీ పరీక్షలు నిర్వహించి, ఎంపిక చేయాలని, టీచింగ్ స్టాఫ్ కమ్యూనికేషన్ నైపుణ్యాన్ని కూడా పరిశీలించాలని సూచించారు. యూనివర్సిటీల్లో క్రమశిక్షణ, పారదర్శకత అత్యంత ముఖ్యమైనవని అన్నారు. ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.