ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి: సీఎం జగన్‌

24 Nov, 2022 17:09 IST|Sakshi

సాక్షి, అమరావతి: గృహనిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం సమీక్షా సమావేశం చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షలో జగనన్న కాలనీలు, టిడ్కో హౌసింగ్‌ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఇళ్లులేని వారందరికీ ఇళ్లు ఇవ్వడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ. 5,655 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించారు.

ఇళ్ల నిర్మాణంపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. లే అవుట్లలో పర్యటన వల్ల ఇళ్ల నిర్మాణ ప్రగతిపై సమీక్షించి ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.  లే అవుట్లను సందర్శించినట్టుగా ఫొటోలను కూడా అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు.  ప్రతి శనివారం హౌసింగ్‌డేగా నిర్వహిస్తున్నామని..  ఆ రోజు తప్పనిసరిగా అధికారులు లే అవుట్లను సందర్శిస్తున్నారని అధికారులు సీఎంకు వెల్లడించారు.

సీఎం జగన్‌ ఇంకా మాట్లాడుతూ..
► ఇళ్ల నిర్మాణం అనుకున్న సమయానికల్లా పూర్తి కావాలి.
► ఆప్షన్‌–3 ని ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలి.
► లే అవుట్ల వారీగా ప్రాధాన్యత పరంగా పనులను గుర్తించి.. అనుకున్న సమయానికి ఆ పని పూర్తయ్యేలా చూడాలి.
► దీనివల్ల ఇళ్ల నిర్మాణంలో చెప్పుకోదగ్గ ప్రగతి కనిపిస్తుంది.
► ఇళ్ల నిర్మాణం నాణ్యతలో ఎలాంటి రాజీ వద్దు.
► ప్రతి దశలోనూ నాణ్యతా నిర్ధారణ పరీక్షలు జరగాలి.
►  ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీని నిరంతరం పాటించడానికి ఎస్‌ఓపీలను అందుబాటులో ఉంచాలి.
► గ్రామ సచివాలయాల్లో ఉన్న ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ సేవలను విస్తృతంగా వాడుకోవాలి.
►  ఇళ్ల నిర్మాణంలో క్వాలిటీ ప్రమాణాలు పాటించే విషయంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ భాగస్వామ్యం తీసుకోవాలి.

► ఇళ్లు పూర్తయ్యే సరికి మూడు రకాల మౌలిక సదుపాయాలు ఉండాలి. 
►  విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి.
►  మిగిలిన మౌలిక సదుపాయాలనూ వృద్ధిచేసుకుంటూ ముందుకు సాగాలి.
► ఈ పనులకు సంబంధించి ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం అయ్యాయని అధికారులు తెలిపారు. ప్రాధాన్యతాక్రమంలో చేసుకుంటూ వెళ్తున్నామన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కార్యదర్శి ఇంతియాజ్, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి: (వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షుల జాబితా ఇదే..)

మరిన్ని వార్తలు