వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఉండకూడదు: సీఎం జగన్‌

14 Sep, 2021 19:00 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: హెల్త్‌హబ్స్‌ ద్వారా ఏర్పాటయ్యే ఆస్పత్రుల్లో కనీసం యాభై శాతం బెడ్లను ఆరోగ్యశ్రీ పేషెంట్లకు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్య బీమా కంపెనీలు చెల్లిస్తున్న ఛార్జీలతో పోలిస్తే ఆరోగ్యశ్రీ కింద చెల్లిస్తున్న ఛార్జీలు మెరుగ్గానే ఉన్నాయన్నారు. ఎవరెక్కువ బెడ్లను ఆరోగ్యశ్రీకి కేటాయిస్తే వారికి హెల్త్‌హబ్స్‌లో ప్రాధాన్యత ఇచ్చేలా చూడాలని సీఎం పేర్కొన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య, ఆరోగ్య శాఖపై మంగళవారం సమీక్ష చేపట్టారు. అదే విధంగా రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్, హెల్త్‌ హబ్స్, ఆస్పత్రుల నిర్వహణ, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌లపై కూడా సీఎం అధికారులతో చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. హెల్త్‌హబ్స్‌ ద్వారా వచ్చే ఆస్పత్రుల బోర్డుల్లో ఒక సభ్యుడు ప్రభుత్వం నుంచి ఉంటారని తెలిపారు. రాష్ట్రానికి చెందిన డాక్టర్లు ఇక్కడే స్థిరపడి మంచి వైద్య సేవలు అందించే ఉద్దేశం కూడా హెల్త్‌హబ్స్‌ ద్వారా నెరవేరుతుందన్నారు. డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉండాలన్నది ఆస్పత్రుల ఎంపికకు ఒక ప్రమాణం కావాలని తెలిపారు. అవయవ మార్పిడి చికిత్సలు చేసే ఆస్పత్రుల ఏర్పాటుపై హెల్త్‌ హబ్స్‌లో ప్రత్యేక దృష్టిపెట్టాలని పేర్కొన్నారు. వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే అవసరం ఇక ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. లాభాపేక్షలేకుండా ఆస్పత్రులు నిర్వహిస్తున్న సంస్థలకూ ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం చెప్పారు.

ఆస్పత్రుల నిర్వహణపై సీఎం సమీక్ష
వివిధ వైద్య సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అనుసరిస్తున్న నిర్వహణా విధానాలను సీఎంకు అధికారులు వివరించారు. ఆస్పత్రుల నిర్వహణకోసం ప్రత్యేక అధికారుల నియమిస్తున్నట్లు తెలిపారు. బిల్డింగ్‌ సర్వీసులు, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ సర్వీసులు, బయోమెడికల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ సేవలను అధికారులు నిర్వహించనున్నారు. సీహెచ్‌సీల నుంచి బోధనాసుపత్రుల వరకూ నిర్వహణ కోసం అధికారుల నియామకానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఉత్తమ నిర్వహణా పద్ధతులకు అనుగుణంగా కొత్తగా నిర్మిస్తున్న ఆస్పత్రులు, బోధనాసుపత్రుల నిర్మాణాలు ఉండాలని  సీఎం ఆదేశించారు. అలాగే వీటి డిజైన్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఆస్పత్రుల్లో బెడ్ల నిర్వహణ, బాత్రూమ్‌ల నిర్వహణ, పరిశుభ్రత, ఆహారంలో నాణ్యత చాలా ముఖ్యమని తెలిపారు. 

రిసెప్షన్‌ సేవలు కూడా కీలకమని అన్నారు. సరిపడా వైద్యులు, పైన పేర్కొన్న సేవలు నాణ్యతతో అందితే కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా సేవలు అందినట్లేనని పేర్కొన్నారు. అత్యుత్తమ నిర్వహణా పద్ధతులను ప్రభుత్వ ఆస్పత్రుల్లో అమలు చేయాలని, ఎవరి ఆరోగ్యం బాగోలేకపోయినా అందరూ కూడా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆకాక్షించారు. ఆస్పత్రుల నిర్వహణలో పర్యవేక్షణ స్థాయి బలోపేతంగా ఉండాలని, నిర్ణీత రోజులకు మించి సెలవులో ఉంటే.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌కు సంబంధించి వివరాలు అందించిన అధికారులు
► ప్రతి గ్రామ సచివాలయంలో కనీసం నెలకు 2 సార్లు 104 ద్వారా వైద్యుల సేవలు ఉండేలా విధివిధానాలు
► నవంబర్‌ 15 నుంచి 258 మండలాల్లో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు
► వచ్చే జనవరి 26 నుంచి పూర్తి స్ధాయిలో అమలు

► జనాభానుకూడా దృష్టిలో ఉంచుకుని ఆమేరకు 104 లను వినియోగించాలని సీఎం ఆదేశం
► అలాగే విలేజ్‌ క్లినిక్స్‌ విధివిధానాలను, ఎస్‌ఓపీలను ఖరారుచేయాలన్న సీఎం
► పీహెచ్‌సీలో కనీసం ఇద్దరు డాక్టర్లను ఉంచాలని, ఒక డాక్టరు పీహెచ్‌సీలో సేవలు అందిస్తుండగా, మరో డాక్టరు 104 ద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ విధానంలో సేవలు అందించేలా చూడాలన్న సీఎం
► కొత్త పీహెచ్‌సీల నిర్మాణాలు కూడా వీలైనంత త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్న సీఎం.


కోవిడ్‌ 19 నివారణ, నియంత్రణ చర్యలతో పాటు వ్యాక్సినేషన్‌పై సీఎంకు వివరాలు అందించిన అధికారులు 
► ఏపీలో మొత్తం యాక్టివ్‌ కేసులు 14,652
► పాజిటివిటీ రేటు 2.23 శాతం
► రికవరీ రేటు 98.60 శాతం
► ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారు 2699
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 854 
► నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నవారి బెడ్స్‌ 91.66 శాతం
► ప్రైవైటు ఆస్పత్రులలో ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్నవారి బెడ్స్‌ 71.04 శాతం
► 104 కాల్‌ సెంటర్‌కు వచ్చిన ఇన్‌కమింగ్‌ కాల్స్‌ 753
► ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 21 ఫీవర్‌ సర్వేలు పూర్తయ్యాయి
► రాష్ట్ర వ్యాప్తంగా జీరో కేసులు నమోదైన సచివాలయాలు 10,541
► పాజిటివిటీ రేటు 3 శాతం కంటే తక్కువ నమోదైన జిల్లాలు 9
► పాటిజివిటీ రేటు 3శాతం కంటే ఎక్కువున్న జిల్లాలు 4

థర్డ్‌ వేవ్‌ సన్నద్ధత
► అందుబాటులో ఉన్న  ఆక్సిజన్‌ డీ టైప్‌ సిలిండర్లు 27,311
► అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు 20,964
► ఇంకా రావాల్సినవి 2493
► 50 అంతకంటే ఎక్కువ బెడ్స్‌ ఉన్న 140 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ జనరేషన్‌ (పీఎస్‌ఏ) ప్లాంట్లు ఏర్పాటు
► 11 అక్టోబరు నాటికి 140 ఆస్పత్రుల్లో అందుబాటులోకి రానున్న  పీఎస్‌ఏ ప్లాంట్లు

వ్యాక్సినేషన్‌
► ఇప్పటివరకు సింగిల్‌ డోసు వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 1,33,30,206
► రెండు డోసుల వ్యాక్సినేషన్‌ పూర్తైన వారు 1,08,54,556
► మొత్తం వ్యాక్సినేషన్‌ (సింగిల్, డబుల్‌ డోసు కలిపి) పూర్తైన వారు 2,41,84,762
► వ్యాక్సినేషన్‌ కోసం వినియోగించిన మొత్తం డోసులు 3,50,39,318

ఈ సమీక్షా సమావేశానికి ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌పోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్, 104 కాల్‌ సెంటర్‌ ఇంఛార్జి ఎ బాబు, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి మురళీధర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ డైరెక్టర్‌ జే వి యన్‌ సుబ్రమణ్యం ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

చదవండి: బహ్రెయిన్‌లో భారతీయ బాధితులను వెనక్కి తీసుకురండి

మరిన్ని వార్తలు