మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించాలి

15 Oct, 2020 16:57 IST|Sakshi

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో సంస్కరణలపై సీఎం వైఎస్‌‌ జగన్‌ సమీక్ష 

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, సిఫార్సులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన (యూఎల్‌బీ) కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో చేపట్టాల్సిన సంస్కరణలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలందించడంతో పాటు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రణాళిక (ఎస్‌ఓపీ) రూపొందించాలని అధి​కారులను ఆదేశించారు. గురువారం నాటి ఈ సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ నీలం సాహ్ని, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, మున్సిపల్‌ శాఖ కార్యదర్శి శ్యామలరావు, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ విజయకుమార్‌తో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. (చదవండి: వరద సాయం శరవేగం)

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. మున్సిపాలిటీల ఆదాయాన్ని ప్రభుత్వం ముట్టుకోదని, ఆ డబ్బును స్థానికంగానే ఖర్చు చేస్తుందని స్పష్టం చేశారు. పలు అభివృద్ధి పనులు, కార్యక్రమాల కోసం ఈ మొత్తాన్ని వ్యయం చేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘మున్సిపాలిటీల ఉద్యోగుల జీతభత్యాలను 010 పద్దు ప్రకారం ప్రభుత్వమే చెల్లిస్తుంది. మున్సిపాలిటీలు స్వయం సమృద్ధి సాధించాలి. ఆ దిశగా అడుగులు వేయాలి’’ అని ఆకాంక్షించారు.

శానిటేషన్‌–క్లీనింగ్
‘‘శానిటేషన్‌ బాగుండాలి, వాటర్‌ అండ్‌ సీవరేజ్‌ కూడా పక్కాగా ఉండాలి. ప్రతి రోజూ తప్పనిసరిగా చెత్తను తరలించాలి. వీధులనూ పరిశుభ్రం చేయాలి, డ్రైనేజీలను తరుచూ క్లీన్‌ చేయాలి. శానిటేషన్‌, వాటర్‌ అండ్‌ సీవరేజ్‌కు సంబంధించి రోజువారీ నిర్వహణ వ్యయాన్ని (ఓ అండ్‌ ఎం) మాత్రమే ఛార్జీలుగా వసూలు చేయాలి. ఎస్‌ఓపీ రూపొందించాలి. మున్సిపాలిటీలలో ఆదాయం ఎంత? వాటి వ్యయం ఎంత? జీతాల కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు? అభివృద్ధి పనులకు ఎంత వ్యయం చేస్తున్నారు? వంటి అన్నీ తెలుసుకుని, ఇంకా ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై ఎస్‌ఓపీ రూపొందించండి’’ అని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు.

మరిన్ని వార్తలు